బోయిన్‌పల్లి కిడ్నాప్ కేసు‌: ఆ ముగ్గురు క్షేమం

Bowenpally Kidnap Case Police Rescued 3 People - Sakshi

సాక్షి, హైదరాబాద్‌ : బోయిన్‌పల్లి కిడ్నాప్‌ కేసును పోలీసులు ఛేదించారు. కిడ్నాప్‌కు గురైన ముగ్గురు ప్రస్తుతం క్షేమంగా ఉన్నారు. కిడ్నాపర్లు నార్సింగ్‌ వద్ద బాధితులను వదిలేసి పరారవ్వగా సీసీ ఫుటేజీల ఆధారంగా నార్త్‌జోన్‌ టాస్క్‌ఫోర్స్‌ పోలీసులు రెండు వాహనాలను పట్టుకున్నారు. కీలక నిందితుడు చంద్రబోస్‌తోపాటు 15 మందిని అదుపులోకి తీసుకున్నారు. కాగా, మంగళవారం అర్థరాత్రి ముఖ్యమంత్రి సమీప బంధువులైన మాజీ క్రీడాకారుడు ప్రవీణ్‌రావు(51), సునీల్‌రావు(49), నవీన్‌రావు (47)లను కొందరు దుండగులు కిడ్నాప్‌ చేశారు. రాత్రి 7.30 సమయంలో ఐటీ అధికారులమంటూ ఆయన ఇంటి లోపలకు వెళ్లినవారు.. ఏపీ మాజీ మంత్రి భూమా అఖిలప్రియ భర్త భార్గవరెడ్డి పేరును ప్రస్తావించినట్టు తెలుస్తోంది. (ప్రత్యర్థుల కత్తుల వేట, ఒకరు మృతి)

అనంతరం ముగ్గురినీ అక్కడ నుంచి బలవంతంగా తీసుకెళ్లినట్టు తెలుస్తోంది. సమాచారం అందుకున్న నార్త్‌జోన్‌ డీసీపి కల్మేశ్వర్, సెంట్రల్‌ జోన్‌ డీసీపీ అక్కడికి చేరుకున్నారు. డైమండ్‌ పాయింట్, రాణిగంజ్‌ మీదుగా రెండు అనుమానిత వాహనాలు వెళ్లిన దృశ్యాలు సీసీ కెమెరాల ద్వారా గుర్తించి వాటిని పట్టుకున్నారు. ఈ కిడ్నాప్‌కు హఫీజ్ పేటలోని 50 ఎకరాల‌ భూ వ్యవహారమే కారణమని పోలీసులు గుర్తించారు. భూమా నాగిరెడ్డి హయాం నుండి ఈ భూ వివాదం కొనసాగుతోంది. భూమా అఖిల ప్రియ భర్త భార్గవ్‌ రామ్‌ సోదరుడు సెటిల్మెంట్ చేసేందుకు ప్రయత్నిస్తున్నాడు. రెక్కీ నిర్వహించి మరి కిడ్నాప్ చేశారు. కిడ్నాపర్ల పై ఐపీసీ సెక్షన్ 448, 419, 341, 342, 506, 366 రెడ్ విత్ 149 సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు.

బాధితులు క్షేమంగా బయటపడటంపై వారి సోదరుడు ప్రతాప్‌ కుమార్‌ సంతోషం వ్యక్తం చేశారు. ఆయన మాట్లాడుతూ.. ‘‘ ఏ క్షణమైనా మా వాళ్లు ఇంటికి చేరుకోవచ్చు. ఘటన జరిగిన వెంటనే స్పందించిన తెలంగాణ పోలీస్‌లకు ధన్యవాదాలు. దేశంలోనే తెలంగాణ పోలీస్ బెస్ట్ అని మరోసారి రుజువైంది. సహకరించిన మీడియాకు కృతజ్ఞతలు. రాత్రంతా మా కుటుంబం టెన్షన్ పడ్డాం. అన్ని వైపులా ఒత్తిడి వల్లే మా వాళ్లు సేఫ్ అయ్యారు. 

Read latest Crime News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top