వారి వయసంతా 25 లోపే.. అన్నీ హైస్పీడ్‌ స్పోర్ట్స్‌ బైక్‌లే

Bike Theft Gang Arrested In Hyderabad - Sakshi

బైక్‌ చోరీలు.. ఆపై జల్సాలు..

నలుగురు బైక్‌ దొంగలు అరెస్ట్‌

వారికి సహకరిస్తున్న మరో ఇద్దరు కూడా..

రూ.45.85 లక్షల విలువ చేసే 24 వాహనాలు స్వాధీనం..

సాక్షి, దుండిగల్‌: వారి వయసంతా 25 లోపే.. చిన్న చిన్న దొంగతనాలు చేసి జైలు పాలయ్యారు.. అక్కడే జట్టుగా ఏర్పడి ఓ ముఠాను తయారు చేసుకున్నారు.. క్షణాల్లో వాహనాలను దొంగలించి వాటిని విక్రయించి.. వచ్చే సొమ్ముతో జల్సాలు చేసే వారు. చివరకు పోలీసులకు చిక్కి కటకటాలపాలయ్యారు. నలుగురు నిందితులతో పాటు వారికి సహకరిస్తున్న మరో ఇద్దరిని బాలానగర్‌ సీసీఎస్, దుండిగల్‌ పోలీసులు అరెస్ట్‌ చేసి రిమాండ్‌కు తరలించారు. షాపూర్‌నగర్‌లోని డీసీపీ కార్యాలయంలో బాలానగర్‌ డీసీపీ పద్మజారెడ్డి, పేట్‌బషీరాబాద్‌ ఏసీపీ రామలింగరాజు, దుండిగల్‌ సిఐ రమణారెడ్డిలతో కలిసి మీడియాకు వివరాలను వెల్లడించారు. 
చదవండి: నిజామాబాద్‌లో చిన్నారి కిడ్నాప్‌ కలకలం

ముఠా నాయకుడు చింతల బాలరాజ్‌.. 
నాగర్‌కర్నూల్‌ జిల్లా బల్మూర్‌ మండలం తుమ్మన్‌పేట్‌ గ్రామానికి చెందిన చింతల బాలరాజు(23) ఐడిఏ బొల్లారంలోని బీరప్ప బస్తీలో నివసిస్తున్నాడు. బైక్‌ మెకానిక్‌ అయిన బాలరాజు చెడు వ్యసనాలకు బానిసయ్యాడు. వాహనాలను తస్కరించడంలో ఆరి తేరిన బాలరాజు ద్విచక్ర వాహనాలను దొంగలించి వాటిని విక్రయిస్తూ జల్సాలు చేయడం మొదలు పెట్టాడు. 
చదవండి: బాలికలకు చాక్లెట్ల ఆశ చూసి.. ఇంట్లోకి తీసుకెళ్లి అత్యాచారం..


వివరాలు వెల్లడిస్తున్న డీసీపీ పద్మజారెడ్డి 

జైల్లో దోస్తీ.. 
పలు దొంగతనాలు చేసి జైలు పాలైన చింతల బాలరాజు వివిధ నేరాలకు పాల్పడి జైలుకు వచ్చిన వారితో జట్టు కట్టాడు. వనపర్తి జిల్లాకు చెందిన రతస్వామి(19), మెదక్‌ జిల్లాకు చెందిన ఏర్వ విజయ కృష్ణ(24), మేడ్చల్‌ కు చెందిన బర్దసారి  సుభాష్‌ (21), బండ్లగూడకు చెందిన షేక్‌ మహ్మద్‌ అబ్దుల్‌ ఆలం(20), ఐడిఏ బొల్లారం పోచమ్మబస్తీ నివాసి మహ్మద్‌ సోహైల్‌(19) లు ముఠాగా ఏర్పడి వాహనాలను చోరీచేసి విక్రయించేవారు. 

అన్ని హై స్పీడ్‌ వాహనాలే.. 
ఆరుగురూ కలిసి మద్యం తాగిన అనంతరం ముందుగా పార్కింగ్‌ చేసిన ద్విచక్ర వాహనాల వద్ద రెక్కీ నిర్వహించారు. వాహనంపై కూర్చున్నట్లు నటించి హ్యాండిల్‌ లాక్‌ విరగొట్టి క్షణాల్లో అక్కడి నుంచి ఉడాయిస్తారు. అయితే ఇప్పటి వరకు చోరీ చేసిన వాహనాలన్ని హైస్పీడ్‌ స్పోర్ట్స్‌ బైక్‌లే కావడం విశేషం. వీటిని చందానగర్, శాంతినగర్‌కు చెందిన కల్లమల్ల దీపక్‌(21), మౌలాలీ, గాం«దీనగర్‌కు చెందిన మహ్మద్‌ అన్వర్‌(20)లకు కేవలం రూ.20 వేలకు విక్రయించడం గమనార్హం. విశ్వసనీయ సమాచారం అందుకున్న పోలీసులు శుక్రవారం నిందితులు చింతల బాలరాజు, సుభాష్, అబ్దుల్‌ ఆలం, సోహేల్‌తో పాటు చోరీ సొత్తు కొనుగోలు చేసిన దీపక్, అన్వర్‌లను అరెస్ట్‌ చేసి రిమాండ్‌కు తరలించారు. వీరి నుంచి రూ.45.85 లక్షల విలువ చేసే 24 బైక్‌లను స్వాధీనం చేసుకున్నారు. రతస్వామి, విజయ కృష్ణ పరారీలో ఉన్నారు. 

మాదాపూర్‌లో మరో ఇద్దరు..
మాదాపూర్‌: నెంబర్‌ ప్లేట్‌ లేకుండా బైక్‌పై వస్తున్న ఇద్దరిని అదుపులోకి తీసుకొని విచారించగా వారు ద్విచక్రవాహన దొంగలని తేలింది. అదుపులోకి తీసుకొని విచారించి రూ.28 లక్షల విలువ గల 19 బైక్‌లను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. మాదాపూర్‌ పోలీస్‌స్టేషన్‌లో డీసీపీ వెంకటేశ్వర్లు శుక్రవారం విలేకరుల సమావేశంలో వివరాలు వెల్లడించారు. మదాపూర్‌లోని అయ్యప్పసొసైటీలో వాహన తనిఖీలు చేస్తుండగా ఇద్దరు వ్యక్తులు నెంబర్‌ ప్లెట్‌ లేని వాహనంపై వచ్చారు. పోలీసులకు అనుమానం వచ్చి విచారించగా పొంతనలేని సమాధానాలు చెప్పారు.

సంగారెడ్డి జిల్లాకు చెందిన చవన్‌కమలేష్‌(20)మెహిదీపట్నంలోని ఎస్‌వీఎన్‌ హాస్టల్‌లో ఉంటున్నాడు. మరో వ్యక్తి మేడ్చల్‌జిల్లా బ్రూక్‌బాండ్‌ కాలనీ వాసి కొత్తకొండ వికాస్‌ కుమార్‌(20)గా గుర్తించారు. వీరు వ్యసనాలకు బానిసై పలు ప్రాంతాల్లో ద్విచక్ర వాహనాలు చోరీ చేసేవారు. వాటిని కరీంనగర్‌ జిల్లా లక్ష్మీదేవునిపల్లి గ్రామానికి చెందిన జంగిలి శ్రీకాంత్‌(20)కు విక్రయించేవారు. దీంతో విచారణ జరిపి బైక్‌లను స్వాధీనం చేసుకున్నారు.  

Read latest Crime News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top