Bihar Hooch Tragedy: Homoeopathic Medicines Used To Make Liquor In Saran District - Sakshi
Sakshi News home page

Bihar Hooch Tragedy: హోమియోపతి మందులతో లిక్కర్ తయారీ.. 72 మంది చనిపోయిన కల్తీ మద్యం ఘటనలో షాకింగ్ నిజాలు..

Published Sat, Dec 24 2022 1:16 PM

Bihar Hooch Tragedy Homoeopathic Medicines Used Make Liquor - Sakshi

పాట్నా: 72 మంది చనిపోయన బిహార్ కల్తీ మద్యం ఘటనలో షాకింగ్ విషయాలు వెలుగులోకి వచ్చాయి. నిందితులు హోమియోపతి మందులను ఉపయోగించి విషపూరిత లిక్కర్‌ను తయారు చేసినట్లు ప్రత్యేక దర్యాప్తు బృందం(సిట్) విచారణలో తేలింది. ప్రధాన సూత్రదారి సహా మొత్తం ఐదుగుర్ని సిట్ పోలీసు బృందం శుక్రవారం అరెస్టు చేసింది.

ఈ ఐదుగురిలో ప్రధాన నిందితుడు రాజేశ్ సింగ్ సహా శైలేంద్ర రాయ్, సోనుకుమార్, అర్జున్ మహ్తో, సంజయ్ మహ్తో ఉన్నారు. వీరంతా చాలా కాలంగా కల్తీమద్యం దందా నడుపుతున్నారు. ముఖ్యంగా రాజేశ్ సింగ్ ఉత్తర్‌ప్రదేశ్‌కు వెళ్లి 90 శాతం ఆల్కహాల్ ఉన్న హోమియోపతి మందులను భారీగా కొనుగోలు చేసి, వాటిని కల్తీ మద్యం తయారీకి ఉపయోగించాడని పోలీసులు తెలిపారు. నకిలీ కస్టమర్ల పేర్లను ఉపయోగించి మందులను తీసుకొచ్చాడని వెల్లడించారు.

ఈ కల్తీమద్యాన్ని తాగి నిందితుల్లోనే ఒకరు తీవ్ర అస్వస్థతకు గురయ్యారని పోలీసులు వివరించారు. కల్తీమద్యం సరఫరా కేసులో రాజేశ్ గతంలోనూ జైలుకు వెళ్లి వచ్చాడని చెప్పారు.

బిహార్ ఛప్రా జిల్లాలో కల్తీమద్యం తాగి వారాల వ్యవధిలోనే 72 మంది చనిపోయారు. దీనిపై రాజకీయంగా తీవ్ర దుమారమే చెలరేగింది. సీఎం నితీశ్ కుమార్, బీజేపీ మధ్య మాటల యుద్ధం జరిగింది. కల్తీమద్యం తాగి చనిపోయిన వారికి పరిహారం ఇచ్చే ప్రసక్తే లేదని నితీశ్ తేల్చిచెప్పారు. తాగితే చస్తారని ప్రజలను హెచ్చరించారు.
చదవండి: శబరిమల నుంచి తిరిగి వస్తుండగా ప్రమాదం.. 8 మంది భక్తులు దుర్మరణం

Advertisement
Advertisement