బాధితుడే నిందితుడిగా మారిన వైనం  | 4 Members Gang Held For Cheating With Names Of Treasure In Hyderabad | Sakshi
Sakshi News home page

బాధితుడే నిందితుడిగా మారిన వైనం

Mar 5 2021 8:26 AM | Updated on Mar 5 2021 9:03 AM

4 Members Gang Held For Cheating With Names Of Treasure In Hyderabad - Sakshi

సాక్షి, గచ్చిబౌలి: ఇంట్లో ఉన్న బంగారు నిధిని తంత్ర పూజలతో బయటకు తీస్తామని నమ్మించి, ఇత్తడిని పుత్తడిగా చూపించి అందినకాడికి దండుకున్న ఓ ముఠాను రాజేంద్రనగర్‌ పోలీసులు, సైబరాబాద్‌ ఎస్‌ఓటీ పోలీసులు అరెస్టు చేసి కటకటాల్లోకి నెట్టారు. కాగా, ఈ ముఠా చేతిలో మోసపోయిన ఓ బాధితుడు కూడా ఇత్తడిని పుత్తడిగా నమ్మించి మరో వ్యక్తిని దగా చేసి పోలీసులకు చిక్కాడు. గచ్చిబౌలిలోని సైబరాబాద్‌ కమిషనరేట్‌లో గురువారం కమిషనర్‌ వీసీ సజ్జనార్‌ తెలిపిన వివరాల ప్రకారం...  
ఓల్డ్‌ మల్లేపల్లి నివాసి సయ్యద్‌ దస్తగిరి అహ్మద్‌(65) ఆర్‌ఎంపీ డాక్టర్‌. తన క్లినిక్‌కు వచ్చేవారి తో తనకు బ్లాక్‌ మ్యాజిక్‌ పవర్‌ ఉందని నమ్మబలికి 15 ఏళ్లుగా మోసాలకు పాల్పడుతున్నాడు.   
మిరాలం మండికి చెందిన మిర్జా అబ్బాస్‌ అలీ సాజద్‌ రియల్టర్‌.  తమ ఇంట్లో నిధి ఉందని, బయటకు తీయకపోతే ఇంట్లోవారు చనిపోతారని రోజూ తన తల్లి కల కంటోందని సాజద్‌  ఛత్తాబజార్‌కు చెందిన తన స్నేహితుడు అలీ అక్బర్‌ తయాబికి చెప్పాడు.  
అతను చార్మినార్‌ ఇరాన్‌గల్లీకి చెందిన షేక్‌ హఫీజ్, యాకుత్‌పురాకు చెందిన అబ్దుల్‌ ఫయీమ్‌ను పరిచయం చేయగా, వారు ఓల్డ్‌ మల్లోపల్లిలో ఉన్న ఆర్‌ఎంపీ డాక్టర్‌ దస్తగిరి వద్దకు తీసుకెళ్లారు. 

సాజద్‌ ఇంటికి వెళ్లిన డాక్టర్‌ దస్తగిరి మీ తల్లికి వచ్చే కల  నిజమేనని, శాంతిపూజలు చేస్తే నిధి బయటకు వస్తుందని, పూజకు రూ. 3 లక్షల నుంచి 5 లక్షల వరకు ఖర్చు అవుతుందని చెప్పాడు.  
ఇంట్లో ఐదుచోట్ల గుంతలు తవ్వించాడు. ఇంటి యజమాని సాజద్‌  కళ్లుగప్పి బంగారు పూత పూసిన ఇత్తడి బిస్కెట్లను గంతుల్లో వేసి మట్టితో కప్పేశాడు.  
ఆ తర్వాత ఒక రోజు హఫీజ్, అక్బర్‌ తయాబ్, అబ్దుల్‌ ఫయూమ్‌లతో కలిసి సయ్యద్‌ దస్తగిరి పూజ చేసేందుకు సాజద్‌ ఇంటికి వెళ్లాడు.  
పూజ చేసిన అనంతరం ముగ్గురూ గుంతలో వెతికినట్టు నటించి బంగారం కనిపించిందని చెప్పారు. తాము చెప్పినప్పుడే మూట విప్పాలని, లేకపోతే బంగారం మీకు దక్కదని చెప్పి అక్కడి నుంచి ఉడాయించారు. 
⇔ కొద్ది రోజుల తర్వాత గుంతలో చూడగా బంగారు బిస్కెట్లు కనిపించాయి. వాటిని పరిశీలించగా నకిలీవి అని తేలింది. దీంతో మోసపోయానని గ్రహించిన సాజద్‌  ఈ విషయాన్ని ఎవ్వరికీ చెప్పలేదు.  
మోసపోయి... 
రూ. 3 లక్షలు ఖర్చు చేసి మోసపోయానని గ్రహించిన సాజద్‌ తన స్నేహితుడు అలీ అక్బర్‌ తయాబితో కలిసి తక్కువ ధరకు బంగారం విక్రయిస్తామని చెప్పి ఇత్తడి బిస్కెట్లను అమ్మాలని నిర్ణయించాడు.   
తమ వద్ద ఆరు కిలోల బంగారం ఉందని, రూ. 40 వేలకే తులం ఇచ్చేస్తామని ఓ వ్యక్తికి చెప్పారు. 

అతడి వద్ద రూ. 50 వేలు అడ్వాన్స్‌గా తీసుకొన్న వీరు కావాలంటే పరీక్షించుకోవాలని 200 గ్రాములున్న ఇత్తడి బిస్కెట్‌ను ఇచ్చారు. అతడు దానిని పరీక్ష చేయించుకోగా, ఇత్తడిదని తేలింది.  
దీంతో బాధితుడు రాజేంద్రనగర్‌ పీఎస్‌లో ఫిర్యాదు చేశాడు. రాజేంద్రనగర్‌ పోలీసులు, ఎస్‌ఓటీ పోలీసులు దర్యాప్తు చేపట్టగా అసలు విషయం బయటపడింది. ఈకేసులో నిందితుడు సాజద్‌ కూడా బాధితుడేని తేలింది.  
సాజద్‌తో పాటు సయ్యద్‌ దస్తగిరి అహ్మద్, షేక్‌ హఫీజ్, అలీ అక్బర్‌ తయాబిలను అరెస్టు చేయగా అబ్దుల్‌ ఫయీమ్‌ పరారీలో ఉన్నాడు.  
నిందితుల నుంచి 5.85 కిలోల బంగారు పూత పూసిన 11 ఇత్తడి బస్కెట్లు, 8 లక్షల నగదు స్వాధీనం చేసుకున్నారు. 
తక్కువ ధరకు బంగారం ఇస్తామని చెబితే నమ్మవద్దని ప్రజలకు ఈ సందర్భంగా కమిషనర్‌ సజ్జనార్‌ సూచించారు. సమావేశంలో ఎస్‌ఓటీ అడిషనల్‌ డీసీపీ సందీప్, ఏసీపీ సంజీవరావు, సీఐ కనకయ్య తదితరులు పాల్గొన్నారు. 

Advertisement
 
Advertisement
Advertisement