చిత్తూరు కలెక్టరేట్ : గత వైఎస్సార్సీపీ ప్రభుత్వంలో విద్యాశాఖ అభివృద్ధికి ప్రత్యేక శ్రద్ధ చూపించారు. నాణ్యమైన విద్య పేద విద్యార్థులకు అందాలనే సంకల్పంతో ఇంగ్లిష్ మీడియం, బైజూస్ కంటెంట్, 3వ తరగతి నుంచే టోఫెల్ శిక్షణ, ఉచితంగా ట్యాబ్ల పంపిణీ, స్మార్ట్ టీవీలు వంటి సంచలనాత్మక నిర్ణయాలు తీసుకున్నారు. కార్పొరేట్ పాఠశాలలను తలదన్నేలా ప్రభుత్వ బడులను అద్బుతంగా తీర్చిదిద్దారు. ఒకప్పుడు పాడుబడిన ప్రభుత్వ బడుల భవనాలు, కనీస సౌకర్యాలు లేని పరిస్థితుల నుంచి రన్నింగ్ వాటర్ తో మరుగుదొడ్లు, తాగునీటి వ్యవస్థ, విద్యుద్దీకరణ, ఫ్యాన్లు, గ్రీన్న్ చాక్బోర్డులు, సుందరమైన పెయింటింగ్స్, ఇంగ్లష్ ల్యాబ్స్, బెంచీలతో డిజిటల్ నిలయాలుగా ఆవిర్భవించాయి. దీంతో జిల్లాలోని ప్రభుత్వ బడుల్లో అడ్మిషన్ల సంఖ్య రికార్డు స్థాయి పెరిగింది. అక్షరాస్యత శాతంలో గణనీయంగా వృద్ధి నమోదైంది.
సర్కారు అలసత్వం
చంద్రబాబు ప్రభుత్వం వచ్చిన తర్వాత విద్యాశాఖ మంత్రి లోకేష్ అనాలోచిత నిర్ణయాలతో సర్కారు బడుల పరిస్థితి దిగజారుతోంది. ఉత్తీర్ణత శాతం దారుణంగా పడిపోతోంది. ఏటా డ్రాపౌట్ల సంఖ్యల గణనీయంగా పెరిగిపోతోంది. పిల్లలు బడికి వచేందుకు పెద్దగా ఆసక్తి చూపని దుస్థితి దాపురించింది. సాంకేతిక అంశాలను ఉపాధ్యాయులకు అంటగట్టడంతో బోధన అరకొరగా మారింది. టీచర్లు తరగతి గదుల కంటే బయటే ఎక్కువ తిరగాల్సి వస్తోంది. దీంతో విద్యార్థుల అభ్యసన సామర్థ్యం పడిపోతోంది. దీంతో చదువుపై పిల్లలకు ఆసక్తి సన్నగిల్లుతోంది. ఈ క్రమంలో జిల్లా అక్షరాస్యత శాతంపై సైతం ప్రభావం పడుతోంది.
అక్షరాస్యత అనేది కేవలం అక్షరాలు దిద్దడం మాత్రమే కాదు.. సమాజ వికాసానికి, భావితరాల భవిష్యత్కు వేసే బలమైన పునాది. ప్రతి సంవత్సరం సెప్టెంబర్ 8వ తేదీన అంతర్జాతీయ అక్షరాస్యత దినోత్సవం విద్యా ప్రాధాన్యతను చాటి చెబుతుంది. గత వైఎస్సార్సీపీ హయాంలో విద్యారంగం దినదినాభివృద్ధి చెందింది. విప్లవాత్మకమైన మార్పులతో దేశానిక ఆదర్శంగా నిలిచింది. ప్రస్తుతం చంద్రబాబు ప్రభుత్వంలో విద్యావ్యవస్థ వెనుకంజ వేస్తోంది. అనాలోచిత నిర్ణయాలు.. అలసత్వంతో ప్రధానంగా సర్కారు బడుల పరిస్థితి రోజురోజుకూ తీసికట్టుగా మారింది.
ప్రభుత్వ పాఠశాలలే కీలకం
అక్షరాస్యత శాతం పెంపొందించడంతో ప్రభుత్వ పాఠశాల పాత్ర కీలకం. నిరుపేదలే ఎక్కువగా చదువుకు దూరంగా ఉంటారు. వారు తమ పిల్లలను బడికి పంపించేందుకు పెద్దగా ఇష్టపడరు. కూలి పనులు చేసుకుంటే కుటుంబానికి ఆధారంగా ఉంటారని భావిస్తుంటారు. అలాంటి పేదలను విద్యాఒడిలోకి తీసుకురావాలంటే సర్కారు బడులు బలోపేతం కావాలి. ఆ దిశగా గత వైఎస్సార్సీపీ ప్రభుత్వంలో కృషి చేశారు. అయితే చంద్రబాబు పాలనలో కార్పొరేట్లకే కొమ్ముకాస్తున్నారు. పేద బిడ్డల చదువుపై నిర్లక్ష్యం చూపుతున్నారు. ఇది ఏమాత్రం మంచి కాదు. – మనోజ్రెడ్డి, వైఎస్సార్సీపీ చిత్తూరు
నియోజకవర్గ యువత అధ్యక్షుడు
పేదలపై విద్యాభారం
జిల్లాలో అక్షరాస్యత కేవలం 70.38 శాతానికే పరిమితం కావడం, అందులోనూ మహిళల అక్ష రాస్యత 60.90 శాతమే ఉండడం ఆలోచించాల్సిన విషయం. ము ఖ్యంగా కుప్పం నియోజకవరగం గుడుపల్లె మండలంలో అక్షరాస్యత 60 శాతానికి పడిపోయింది. గత వైఎస్సార్సీపీ ప్రభుత్వంలో పేదల విద్యకు ప్రాధాన్యమివ్వడంతో సర్కా రు బడులు కళకళలాడాయి. ఇప్పుడు కార్పొరేట్లకు వంత పాడుతుండడంతో నిరుపేదలపై విద్యాభారం పడుతోంది. దీంతో చాలామంది చదువుకు దూరమవుతున్నారు. ఇప్పటికై నా ప్రభుత్వం మేలుకోవాలి. దేశ భవిష్యత్ను దృష్టిలో ఉంచుకుని సర్కారు బడులను బలోపేతం చేయాలి. – సద్దాం, జిల్లా స్టూడెంట్స్ అసోషియేషన్ జేఏసీ చైర్మన్


