చిత్తూరు రూరల్ (కాణిపాకం): రాష్ట్ర పోలీస్ శాఖ ఆధ్వర్యంలో జరిగిన 1వ ఏపీ స్టేట్ పోలీస్ స్పోర్ట్స్ అండ్ గేమ్స్–2026 పోటీల్లో చిత్తూరు జిల్లా పోలీసులు అద్భుత ప్రతిభ కనబరిచారు. అనంతపురం రేంజ్ తరఫున బరిలోకి దిగిన జిల్లా పోలీస్ సిబ్బంది మొత్తం 30 పతకాలను (11 స్వర్ణ, 6 రజత, 13 కాంస్య) సాధించి సత్తా చాటారు. పోటీల్లో ప్రతిభ కనబరిచిన 17 మంది క్రీడాకారులు సోమవారం సాయుధ దళం కార్యాలయంలో ఎస్పీ తుషార్ డూడీని మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా క్రీడాకారులను ఎస్పీ ఘనంగా సత్కరించారు. విధుల ఒత్తిడిని అధిగమించడానికి క్రీడలు ఎంతో దోహదపడతాయని తెలిపారు.
దారి దోపిడీ కేసులో
నిందితుల అరెస్ట్
బైరెడ్డిపల్లె : పలమనేరు–కుప్పం జాతీయ రహదారిలోని దేవదొడ్డి సమీపంలో ఆగస్ట్ 28వ తేదీన దారి దోపిడీకి పాల్పడిన కేసులో నిందితులను అరెస్ట్ చేసినట్లు సీఐ పరుశురాముడు తెలిపారు. సోమవారం బైరెడ్డిపల్లె పోలీస్స్టేషన్లో ఆయన మాట్లాడారు. పలమనేరు మైక్రోఫైనాన్స్కు చెందిన వ్యక్తులు ద్విచక్రవాహనంపై వెళుతుండగా తమిళనాడులోని కృష్ణగిరి ప్రాంతానికి చెందిన వెంకటేష్, నాగేంద్ర, మురుగేష్ కత్తులతో బెదిరించి రూ.40వేలు దోచుకెళ్లారు. బాధితుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేశారు. సీసీ కెమెరా ఫుటేజీలు, ఫోన్ నంబర్ల ఆధారంగా నిందితులను గుర్తించి వెంకటేష్, నాగేంద్రను అరెస్ట్ చేసినట్లు సీఐ తెలిపారు. మురుగేష్ పరారీలో ఉన్నాడని, గాలిస్తున్నా మని వెల్లడించారు. ఎస్ఐ చందనప్రియ పాల్గొన్నారు.
డిగ్రీ అడ్మిషన్లకు శ్రీకారం
తిరుపతి సిటీ: జిల్లాలోని ప్రభుత్వ, టీటీడీ, ప్రైవేటు విద్యా సంస్థలల్లో డిగ్రీ ఫస్ట్ ఇయర్ అడ్మిషన్లు సోమవారం నుంచి ప్రారంభమయ్యాయి. ఓఏఎమ్డీసీ వెబ్సైట్లో యూజీ కోర్సులలో ప్రవేశాల కోసం రిజిస్ట్రేషన్ చేసుకు న్న విద్యార్థులకు సోమవారం తొలి విడత ప్రవేశాల మెరిట్ లిస్ట్ విడుదల చేశారు. ఇందులో భాగంగా 2026–27 విద్య సంవత్సరానికి సంబంధించి టీటీడీ ఆధ్వర్యంలో నడుస్తున్న ఎస్వీ ఆర్ట్స్ కళాశాలలో తొలి అడ్మిషన్గా విద్యార్థి బి రామశేష సాయి శివారెడ్డికి బీఎస్సీ హానర్స్ జు వాలజీ మొదటి సంవత్సరంలో ప్రవేశం పొందారు. కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ కిషన్, వైస్ ప్రిన్సిపల్ డాక్టర్ వై.మల్లికార్జున, అధికారులు విద్యార్థికి ప్రవేశపత్రాన్ని అందజేశారు.
ఫైర్ ఫైటింగ్పై అవగాహన
తిరుమల: శ్రీవారి వార్షిక బ్రహ్మోత్సవాలను పురస్కరించుకుని భక్తుల భద్రత, అత్యవసర పరిస్థితులను సమర్థవంతంగా ఎదుర్కొనేందుకు తిరుమలలో ఫైర్ ఫైటింగ్, బాంబ్ డిటెక్షన్ అండ్ డిస్పోజల్పై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. సోమవారం ఆస్థాన మండపంలో తిరుమల డీఎస్పీ విజయశేఖర్ ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో పోలీసు, టీటీడీ విజిలెన్స్ అండ్ సెక్యూరిటీ, ఫైర్ సర్వీసెస్, హెల్త్ డిపార్ట్మెంట్ సిబ్బంది పాల్గొన్నారు. అగ్ని ప్రమాదాల నివారణకు తీసుకోవాల్సిన జాగ్రత్తలు, అగ్నిమాపక పరికరాల వినియోగంపై ఫైర్ సిబ్బందికి అవగాహన కల్పించారు.


