సీకేతో మీకేమి? | - | Sakshi
Sakshi News home page

సీకేతో మీకేమి?

Aug 15 2026 1:04 AM | Updated on Aug 15 2026 1:04 AM

సీకే కుటుంబాన్ని ఎందుకు చేరదీయడం? చేరేదీస్తే నీకు వచ్చే నష్టం ఏంటి? అయితే నీ ఇంట్లో పెట్టుకో చిత్తూరులో ఎమ్మెల్యే ఎదుటే టీడీపీ నేతల వాదులాట

చిత్తూరు అర్బన్‌: చిత్తూరులో కూటమి నేతల మధ్య వైరం మరోమారు బట్టబయలయ్యింది. ఇటీవల నగరంలో జరుగుతున్న ఇంటింటికీ టీడీపీ కార్యక్రమాలతో పాటు ఎమ్మెల్యే వెంట సీకే కుటుంబ సభ్యులు వెళుతుండడాన్ని అధికార పార్టీలోని కొందరు సీనియర్లు అంగీకరించడంలేదు. వాళ్లు ఎందు కు వస్తున్నారని, అసలు వాళ్లను ఎందుకు చేరదీస్తున్నారంటూ సొంత పార్టీ నేతలపైనే ఆగ్రహం వ్యక్తంచేస్తున్నారు.

మాజీ ఎమ్మెల్యే సీకే బాబు కుటుంబ సభ్యులు టీడీపీ కార్యక్రమాల్లో పాల్గొంటున్న వ్యవహారంపై రెండు రోజుల క్రితం చిత్తూరులోని నాగయ్య కళాక్షేత్రంలో జరిగిన ఓ సమావేశంలో ఇద్దరు టీడీపీ నేత ల మధ్య వాగ్వాదం జరగడం చర్చనీయాంశంగా మారింది.

గురువారం ఉదయం 10 గంటలకు సమావేశం అని చెప్పి ఎమ్మెల్యే జగన్‌మోహన్‌ నాయుడితో పాటు సీకే లావణ్య సైతం 11.30 గంటలకు సభాస్థలికి రావడంతో సీనియర్‌ కురువృద్ధుడు తీవ్ర అసహనానికి గురయ్యారు. అప్పటికే వేదికపై మొదటి వరుసలో జూనియర్లు కూర్చోవడం టీడీపీ చిత్తూరు నియోజకవర్గ పరిశీలకురాలు పూరిమెట్ల కుమారికి సైతం సీటు లేకపోవడంతో.. మరింత అసహనానికి లోనయ్యారు. దీంతో పరోక్షంగా సీకే కుటుంబాన్ని ప్రస్తావిస్తూ..

ఎందుకు వాళ్లు..?

టీడీపీలోని ఓ కురువృద్ధుడు ఈ సమావేశంలో ఎమ్మెల్యేని లక్ష్యంగా చేసుకుని, ఆయన అనుచరుడిపై విరుచుకుపడినట్లు సమాచారం. ‘‘ఏం యా.. సీకే కుటుంబాన్ని ఎందుకు మీరు ఎంటర్‌టైన్‌ చేస్తున్నారు.? ఎక్కడకు పోయినా వాళ్లను వెంటబెట్టుకుని పోతా ఉండారు. ఇన్నాళ్లు రానివాళ్లు ఇప్పడు ఎందుకు మీ వెంట వస్తా ఉండారు..? ఇది పద్ధతికాదు. వాళ్లకు ఎంత దూరం ఉంటే అంత మంచిది. గంజాయి అమ్మే ఇద్దరు ఆడోళ్లను కూడా దూరం పెట్టమని చెప్పాను. వాళ్ల వల్ల పార్టీకి చాలా చెడ్డపేరు వస్తా ఉండాది. అయినా కూడా మీరు వినడంలేదు. పేపర్లలో ఎండకడతా ఉండారు. పోలీస్‌ స్టేషన్లలో పిలిచి వార్నింగులు ఇస్తా ఉండారు. ఇదంతా మంచిది కాదు..’’ అన్నట్లు తెలిసింది. ఇటీవల ఎమ్మెల్యే చెంతచేరి, అన్నీ తానై నడిపిస్తున్న ఆ వ్యక్తి ఆ కురు వృద్ధుడికి ధీటుగా సమాధానం ఇచ్చినట్లు తెలుస్తోంది. ‘‘ఏందినా నువ్వు చెప్పేది. ఎలక్షన్లలో ఎమ్మెల్యేకి వాళ్లు పనిచేయలేదా..? కూడానే ఉంటూ ఎవరు ఎంత ద్రోహం చేసినారో మాకు అన్నీ తెలుసు. కానీ సీకే మాత్రం నిజాయితీగా పనిచేసినాడు. పార్టీ కోసం పనిచేసిన వాళ్లకు ప్రియారిటీ ఇస్తే తప్పేముండాది..? మీకు మీకు మధ్య ఏదైనా పర్సనల్‌ గొడవలుంటే మీరు చూసుకోండి. పార్టీపైన రుద్దొద్దు..’’ అంటూ సమాధానం ఇచ్చినట్లు తెలిసింది. ఇదంతా కూడా పలువురు సీనియర్‌ నాయకులు, స్థానిక ఎమ్మెల్యే సమక్షంలోనే జరిగినట్లు సమాచారం. సొంత పార్టీ నేతలపైనే మీడియాకు లీకులు ఇచ్చి వార్తలు రాయించడం నీ నైజం కాదా..? అంటూ మరో నేత, ఎమ్మెల్యేకు దగ్గరి వ్యక్తిపై మండిపడ్డట్లు సమాచారం.

ఈశ్వరరావు ద్వంద వైఖరి..

మరోవైపు రావూరి ఈశ్వరరావు ఇటీవల సీకే బాబును పొగుడుతూ వీడియోలు విడుదల చేయడంపై అటు టీడీపీలోని ఓ వర్గం, ఇటు వైఎస్సార్‌సీపీ నేతలు పెదవి విరుస్తున్నారు. ఈశ్వరరావుకు సీకేపై అంత ప్రేమ ఉంటే, 2004 ఎన్నికల్లో తవణంపల్లె, చిత్తూరు ప్రాంతాల్లో ఊరూరా పర్యటించి స్థానికులకు బియ్యం, డప్పులు పంచిపెట్టి మరీ.. సీకేను ఓడించడానికి ఎందుకు కంకణం కట్టుకున్నారని ప్రశ్నిస్తున్నారు. సీకే గెలిస్తే చిత్తూరు రౌడీ రాజ్యం అవుతుందని ఈశ్వరరావు నాడు చెప్పలేదా అని ప్రశ్నిస్తున్నారు. ఈశ్వరరావు కుటిల రాజకీయానికి, ద్వంద వైఖరికి ఆయన విడుదల చేసిన వీడియోలే నిదర్శమని వైఎస్సార్‌సీపీ నేతలు గట్టిగానే బదులిస్తున్నారు.

తలనొప్పి తప్పదా..?

ఓ వైపు మునిసిపల్‌ ఎన్నికలు నిర్వహిస్తామని ప్రభు త్వం చెబుతున్న తరుణంలో చిత్తూరులోని అధికార పార్టీ నేతల మధ్య చోటు చేసుకుంటున్న ఈ పరిణామాలు పార్టీకి నష్టం చేకూర్చడంతో పాటు స్థానిక ఎమ్మెల్యేకు తలనొప్పి తప్పదన్నట్లుగా ఉంది. పార్టీ కోసం దశాబ్దాలుగా పనిచేసినవాళ్లు, కుటుంబ స భ్యుల ప్రాణాలే పోగొట్టుకున్న వాళ్లు, కరుడుగట్టిన టీడీపీ కోసం శ్రమించిన వాళ్లను కాకుండా.. ఇప్పు డు వచ్చిన వాళ్లకు మేయర్‌ పీఠంపై హామీ ఇస్తే ఏమాత్రం సహించేదిలేదని సీనియర్లు తేల్చి చెబుతున్నారు. దీంతో చిత్తూరు టీడీపీలో సం‘కుల’ సమ రం తప్పదని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement