చిత్తూరు రూరల్ (కాణిపాకం): చిత్తూరు మండలం తాళంబేడు పంచాయతీ మంగాపురంలో సంచలనం సృష్టించిన హత్య కేసులో పోలీసులు దర్యాప్తు వేగవంతం చేశారు. పట్టాభినాయుడు ఇంట్లో పనిచేస్తున్న ఆనందరావు (50) శుక్రవారం హత్యకు గురైన విషయం తెలిసిందే. ఈ దారుణానికి ఒడిగట్టిన దుండగులను పట్టుకునేందుకు గత నాలుగు రోజులుగా పోలీసులు ముమ్మర గాలింపు చర్యలు చేపడుతున్నారు. ఈ క్రమంలో అడిషనల్ ఎస్పీ మహబూబ్బాషా మంగళవారం డీఎస్పీ సత్యనారాయణ, సీఐ రామచంద్ర, ఎస్ఐ మణికంఠేశ్వరెడ్డితో కలిసి ఘటనా స్థలాన్ని పరిశీలించారు. ఇంటి యజమానితో పాటు స్థానికులతో మాట్లాడి వివరాలు సేకరించారు. హత్యకు సంబంధించి ఇప్పటివరకు ఎలాంటి క్లూస్ లభించలేదని, ఫోరెన్సిక్ రిపోర్టు రావడానికి మరికొంత సమయం పట్టే అవకాశముందని పోలీసు వర్గాలు పేర్కొంటున్నాయి. ఈ హత్య కేసు గ్రామస్తులతో పాటు చుట్టుపక్కల ప్రాంతాల్లో తీవ్ర ఉత్కంఠ రేపుతోంది. దొంగతనానికి వచ్చిన దుండగులు ఇంటి యజమానులను వదిలి, పనిమనిషిని ఎందుకు లక్ష్యంగా చేసుకున్నారు? అసలు అక్కడ బాంబు పెట్టి పరారవ్వాల్సిన అవసరం ఏమిటి? అనే ప్రశ్నలు ప్రతి ఒక్కరిలో రేకెత్తిస్తున్నాయి. పోలీసులు ఈ చిక్కుముడులను ఛేదించి అసలు నిందితులను ఎప్పుడు బోనులో నిలబెడతారో వేచి చూడాల్సి ఉంది.


