లోకేష్ రాజీనామా చేయాలి డీఎస్సీ అక్రమాలపై సీబీఐతో విచారణ జరిపించాలి మాజీ ఉప ముఖ్యమంత్రి నారాయణస్వామి డిమాండ్
కార్వేటినగరం: రాష్ట్రంలో దృతరాష్ట్ర పరిపాలన కొనసాగుతోందని రాష్ట్ర మాజీ ఉప ముఖ్యమంత్రి నారాయణస్వామి ఆరోపించారు. ఆయన ఆదివారం పుత్తూరులోని వైఎస్సార్సీపీ కార్యాలయంలో విలేకరులతో మాట్లాడారు. ఆనాడు దుర్యోధను డు ఎన్ని తప్పులు చేసినా దృతరాష్ట్రుడికి కనిపింపించలేదని తెలిపారు. ఇప్పుడు డీఎస్సీలో నారాలోకేష్ చేసిన అక్రమాలు చంద్రబాబుకు కనిపించడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. డీఎస్సీలో చోటుచేసుకున్న అక్రమాలకు నైతిక బాధ్యత వహిస్తూ రాష్ట్ర విద్యాశాఖ మంత్రి నారాలోకేష్ రాజీనామా చేయాలన్నారు. నిరుద్యోగులు రాత్రింబవళ్లు కష్టపడి చదివి ర్యాంకులు సాధిస్తే, మెరిట్ అభ్యర్థులను పక్కన పెట్టి అక్రమార్కులకు ఉద్యోగం ఇచ్చారని విమర్శించారు. స్పోర్ట్స్ కోటా పేరిట ఉద్యోగాలను అమ్మకున్నారని దుయ్యబట్టారు. నీట్ పరీక్ష పేపర్ లీకేజ్ అక్రమాలపై పోరాటం చేసిన విద్యార్థులు విజయం సాధించారని, అలాగే డీఎస్సీలో జరిగిన అక్రమాలపై సీబీఐ విచారణ చేయించాలని, లోకేష్తో రాజీనామా చేయించి చంద్రబాబు తన నిజాయితీని చాటుకోవాలన్నారు.
విద్యార్థులకు సంక్షేమం కరువు
ప్రస్తుతం పేద విద్యార్థులకు సంక్షేమం కరువైందని నారాయణస్వామి తెలిపారు. విద్యే ఆయుధమని, విద్యతోనే పేదరికం దూరమవుతుందని గతంలో దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి, తర్వాత వైఎస్.జగన్మోహన్రెడ్డి విద్యకు ఎంతో ప్రాధాన్యత ఇచ్చారని గుర్తు చేశారు. ఫీజు రియంబర్స్మెంట్ ద్వారా వైఎస్సార్ పేదల జీవితాల్లో వెలుగులు నింపారని తెలిపారు. వైఎస్ జగన్మోహన్రెడ్డి అమ్మ ఒడి, ఇంగ్లీష్ మీడియం, విద్యాదీవెన, విదేశీ విద్యాదీవెన, వసతి దీవెన పథకాలు అమలుచేసి పిల్లలకు సంక్షేమం కోసం కృషి చేశారని వివరించారు. నాడు–నేడుతో పాఠశాలలను బాగు చేసి నవశకానికి శ్రీకారం చుట్టారని పేర్కొన్నారు. గ్రామ స్థాయిలో సచివాలయాలను ఏర్పాటుచేసి ప్రజలకు స్థానికంగానే సేవలు అందించారని తెలిపారు. ఒకేసారి 1.30 వేల శాశ్వత ఉద్యోగాలు భర్తీ చేసిన ఘనత వైఎస్.జగన్మోహన్రెడ్డికి దక్కుతుందన్నారు. టీడీపీ కూటమి ప్రభుత్వం అధికారం చేపట్టి రెండేళ్లు పూర్తయినా ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేర్చలేదని విమర్శించారు.


