చిత్తూరు కలెక్టరేట్ : జిల్లాలకు ఉద్యోగ, ఉపాధ్యాయుల పంపిణీ ప్రక్రియను పారదర్శకంగా నిర్వహించాలని జేఏసీ, పలు ఉపాధ్యాయ సంఘాల నేతలు కోరారు. శనివారం కలెక్టరేట్లో డీఆర్ఓ కె. మోహన్ కుమార్ అధ్యక్షతన ఉద్యోగ, ఉపాధ్యాయ సంఘాల ప్రతినిధులతో సమావేశం నిర్వహించారు. సమావేశంలో జేఏసీ చైర్మన్, ఎన్జీఓ జిల్లా అధ్యక్షుడు కేవీ రాఘవులు, ఎస్టీయూ జిల్లా అధ్యక్షుడు మదన్మోహన్ రెడ్డి, నాయకుడు గంటా మోహన్, యూటీఎఫ్ రాష్ట్ర నేత జీవీ రమణ, పీఆర్టీయూ జిల్లా ప్రధాన కార్యదర్శి విజయ్భాస్కర్ రెడ్డి, ఆపస్ జిల్లా అధ్యక్షుడు మంజునాథ్గుప్తా మాట్లాడారు. ఉపాధ్యాయుల సీనియారిటీ జాబితాను మార్కులు, ర్యాంకులతో సహా, డీఎస్సీల వారీగా డీఈఓ వెబ్సైట్లో ఉంచాలన్నారు. ఏ జిల్లా కు ఎన్ని పోస్టులు కేటాయిస్తున్నారో ముందే స్పష్టం చేయాలని కోరారు. ఉపాధ్యాయులకు జిల్లాల కేటాయింపు ప్రక్రియపై ఆప్షన్లు ఇచ్చుకునేందుకు అవగాహన సదస్సులు నిర్వహించాలన్నారు. ఉద్యోగోన్నతుల కౌన్సెలింగ్ పూర్తయిన తర్వాతే విభజన ప్రక్రియను చేపట్టాలని సూచించారు. అలాగే ప్రతి ఉద్యోగి సర్వీస్ రిజిస్టర్ను పక్కాగా అప్డేట్ చేయించాలన్నారు. పీఎఫ్, ఏపీ జీఎల్ఐ ఖాతాల్లో ఎలాంటి మిస్సింగ్ క్రెడిట్లు లేకుండా చూడాలని స్పష్టం చేశారు. మినిమం టైం స్కేల్, కాంట్రాక్ట్, ఔట్ సోర్సింగ్ ఉద్యోగుల విషయంలో మానవతా దృక్పథంతో వ్యవహరించాలని కోరారు. భార్యాభర్తలు, దివ్యాంగులు, మాజీ సైనికులు, తీవ్రమైన ఆరోగ్య సమస్యలు ఉన్న వారికి ప్రత్యేక సడలింపులు ఇస్తూ ప్రాధాన్యత ప్రాతిపదికన పోస్టు లు కేటాయించాలని డిమాండ్ చేశారు.ఉద్యోగోన్న తి వద్దనుకుని రివర్షన్ పొందిన టీచర్ల పూర్తి సీనియారిటీని పరిగణనలోకి తీసుకోవాలన్నారు. పెండింగ్ కారుణ్య నియామకాలను పూర్తి చేయాలని సూచించారు. ఈ మేరకు డిమాండ్లతో కూడిన వినతిపత్రం అందించారు.
తప్పిదాలకు తావులేకుండా..
ఉపాధ్యాయుల విభజన ప్రక్రియలో తప్పిదాలకు తావులేకుండా జాగ్రత్తలు తీసుకోవాలని ఏపీటీఎఫ్ జిల్లా అధ్యక్షుడు జగదీష్ కోరారు. శనివారం ఈ మేరకు ఇన్చార్జి డీఈఓ వెంకటేశ్వరరావుకు వినతిపత్రం అందించారు. ఏపీటీఎఫ్ జిల్లా నేతలు గోపీనాథ్, ఆఫ్జల్ బాషా పాల్గొన్నారు.
అందరికీ న్యాయం చేస్తాం: డీఆర్ఓ
డీఆర్ఓ మోహన్ కుమార్ మాట్లాడుతూ ఉద్యోగుల విభజన ప్రక్రియలో ఎలాంటి తప్పిదాలు తలెత్తకుండా చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. ప్రతి ఒక్కరికీ న్యాయం జరిగేలా నిర్ణయాలు తీసుకుంటామని స్పష్టం చేశారు. నేతలు రమేష్, ప్రసా ద్, బాలసుబ్రమణ్యం, మణిగండన్, గిరిబాబు, దేవా, హుస్సేన్ పాల్గొన్నారు.


