
మాట్లాడుతున్న జిల్లా ఎన్నికల అధికారి షణ్మోహన్
చిత్తూరు కలెక్టరేట్ : సార్వత్రిక ఎన్నికల గెజిట్ నోటిఫికేషన్ను జిల్లాలోని ఆయా నియోజకవర్గాల ఆర్ఓలు ప్రచురించారు. గురువారం ఉదయం ఆయా ఆర్ఓల కార్యాలయాల్లో నోటిఫికేషన్ విడుదల చేసి వివరాలు వెల్లడించారు. కలెక్టరేట్లో జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ షణ్మోహన్ నోటిఫికేషన్ విడుదల చేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ కేంద్ర, రాష్ట్ర ఎన్నికల సంఘాదల ఆదేశాల మేరకు ఎన్నికలను పకడ్బందీగా నిష్పక్షపాతంగా నిర్వహించేందుకు చర్యలు చేపడుతున్నట్లు తెలిపారు. మే 13న ఎన్నికల పోలింగ్ ఉంటుందన్నారు. జూన్4 ఓట్ల లెక్కింపు ప్రక్రియ నిర్వహించడం జరుగుతుందన్నారు. జూన్ 6వ తేదీ వరకు ఎన్నికల కోడ్ జిల్లా వ్యాప్తంగా అమలులో ఉంటుందని వెల్లడించారు.
పకడ్బందీగా నామినేషన్ల ప్రక్రియ
జిల్లాలో పకడ్బందీగా నామినేషన్ల ప్రక్రియ నిర్వహించేందుకు ఏర్పాట్లు చేశామని జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ షణ్మోహన్ తెలిపారు. చిత్తూరు ఆర్డీఓ కార్యాలయంలో ఆయన విలేకర్లతో మాట్లాడారు. ప్రతి రోజు ఉదయం 11 నుంచి మధ్యాహ్నం 3 గంటల వరకు నామినేషన్లు స్వీకరించనున్నట్లు వెల్లడించారు. ముందుగా వచ్చే అభ్యర్థి నామినేషన్ను పరిశీలిస్తామని చెప్పారు. నామినేషన్ కేంద్రంలోకి అభ్యర్థితో పాటు నలుగురిని అనుమతిస్తామని వివరించారు. అభ్యర్థులు నామినేషన్లను నేరుగా ఆర్ఓలకే అందజేయాలని సూచించారు. అభ్యర్థులు అందజేసే అఫిడవిట్ను ఈసీ వెబ్సైట్లో పొందుపరుస్తామని, ప్రతి ఒక్కరూ పరిశీలించుకోవచ్చని తెలిపారు. అభ్యర్థులకు ఏ సమస్య ఉన్నా నేరుగా ఆర్ఓల దృష్టికి తీసుకెళ్లి పరిష్కరించుకోవాలన్నారు. ఈ నెల 29న పోటీలో ఉండే అభ్యర్థుల తుది జాబితా విడుదల చేస్తామని వెల్లడించారు. ఏడు కేటగిరీలలో ఉద్యోగులకు పోస్టల్ బ్యాలెట్ సౌకర్యం కల్పిస్తున్నట్లు చెప్పారు. ఎన్నికల విధుల్లో ఉండే ఉద్యోగులందరూ పోస్టల్బ్యాలెట్ కోసం సంబంధిత హెచ్ఓడీ వద్ద పేర్లు నమోదు చేసుకోవాలని కోరారు. మే 3వ తేదీ తర్వాత పోస్టల్ బ్యాలెట్ పేపర్లు పంపిణీ చేయనున్నట్లు తెలిపారు. ఈ నెల 29న సప్లిమెంటరీ ఓటర్ల తుది జాబితా విడుదల చేస్తామని వివరించారు. సమావేశంలో జేసీ శ్రీనివాసులు, డీఆర్ఓ పుల్లయ్య తదితరులు పాల్గొన్నారు.
– ఐదుగురికి తీవ్రగాయాలు
గుడిపాల : జనసేన పార్టీ మండల అధ్యక్షుడు రూపేష్కు టీడీపీ చిత్తూరు ఎమ్మెల్యే అభ్యర్థి గురజాల జగన్మోహన్ ఎన్నికల్లో ప్రచారం చేసేందుకు ఓ ఇన్నోవా కారును అందజేశారు. అందులో ప్రతిరోజు కొంతమంది యువకులను వెంటబెట్టుకొని రూపేష్ ప్రచారం నిర్వహిస్తున్నాడు. ఈ క్రమంలో బుధవారం రాత్రి 197రామాపురం మార్గంలో అతివేగంగా కారణంగా కారు అదుపు తప్పి బోల్తా పడింది. ఈ ప్రమాదంలో మొత్తం ఐదుగురు తీవ్రంగా గాయపడ్డారు. ఏఎల్పురం వడ్డియిండ్లకు చెందిన చిరంజీవి(26, ఖైదుగానికండ్రిగకు చెందిన ఆదికేశవులు(55), కొత్తకోట హరిజనవాడకు చెందిన సంతోష్(27), కిల్లారిపల్లెకు చెందిన డ్రైవర్ దాము(50)తోపాటు రూపేష్(33) గాయపడ్డారు. క్షతగాత్రులందరూ చీలాపల్లె వేలూరు సీఎంసీ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. ఎస్ఐ శ్రీనివాసరావు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
