చిత్తూరు కలెక్టరేట్ : ఈవీఎంల (ఎలక్ట్రానిక్ ఓటింగ్ మెషిన్) యాక్సెప్టెన్స్ టెస్ట్ ప్రొసీజర్ (ఏటీపీ)ను పకడ్బందీగా చేపట్టాలని కలెక్టర్ షణ్మోహన్ ఆదేశించారు. బుధవారం కలెక్టరేట్లోని ఎన్నికల గోడౌన్ను ఆయన తనిఖీ చేశారు. జిల్లా కేంద్రానికి విచ్చేసిన ఈవీఎంల యాక్సెప్టెన్స్ టెస్ట్ ప్రక్రియను ఆయన పరిశీలించారు. కలెక్టర్ మాట్లాడుతూ ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు జిల్లాలో రెండంచెల భద్రత నడుమ ఈవీఎంలను గౌడౌన్లో భద్రపరిచినట్లు తెలిపారు. 12 మంది బెల్ ఇంజినీర్ల సమక్షంలో ఈ నెల 16వ తేదీ నుంచి ఈవీఎంల మొదటి స్థాయి పరిశీలన నిర్వహించడం జరుగుతుందన్నారు. జిల్లాకు కొత్తగా బెల్ కంపెనీ నుంచి 2,510 బ్యాలెట్ యూనిట్లు, 4390 కంట్రోల్ యూనిట్లు, 3617 వీవీప్యాడ్స్లకు ఏటీపీని నిర్వహిస్తున్నా రని తెలిపారు. జిల్లాలో గతంలో ఉన్న పాత బ్యాలెట్ యూనిట్లు 2,353, కంట్రోల్ యూనిట్లు 1,448, వీవీ ప్యాడ్స్ 1,711 అలాగే ఉన్నట్లు తెలిపారు. ఈవీఎంలోని కంట్రోల్ యూనిట్, బ్యాలెట్ యూనిట్, వీవీ ప్యాట్ లకు సంబంధించి బెల్ కంపెనీ నుంచి వచ్చిన ఇంజినీర్ల పర్యవేక్షణలో అధికారులు కంట్రోల్ యూనిట్,బ్యాలెట్ యూని ట్, వీవీ ప్యాడ్,ఓటింగ్ బటన్లు, ప్రింట్ స్లీప్లు తదితర అంశాలను నిశితంగా పరిశీస్తున్నట్లు తెలిపారు. బ్యాలెట్ యూనిట్లు, కంట్రోల్ యూనిట్లు, వీవీప్యాట్ల స్కానింగ్ ప్రక్రియను జాగ్రత్తగా నిర్వహించాలన్నారు. పటిష్ట పోలీస్ బందోబస్తు, సీసీ కెమెరాల పర్యవేక్షణ, విజిటింగ్ రిజిస్టర్ నిబంధనలు పాటిస్తున్నట్లు కలెక్టర్ వెల్లడించారు. డీఆర్వో రాజశేఖర్, ఎన్నికల విభాగం సూపరింటెండెంట్ బ్యూలా, సిబ్బంది ఉమాపతి, మనోజ్ తదితరులు పాల్గొన్నారు.