భారత పర్యటనలో వరల్డ్ బ్యాంక్ ప్రెసిడెంట్ 'అజయ్ బంగా'.. ప్రముఖులతో సమావేశాలు

World bank president ajay banga on india visit - Sakshi

ప్రధాని, ఆర్థిక మంత్రి

తదితరులతో సమావేశాలు

న్యూఢిల్లీ: ప్రపంచ బ్యాంకు ప్రెసిడెంట్‌గా అమెరికా ప్రతిపాదించిన అజయ్‌ బంగా తాజాగా భారత్‌ పర్యటనకు వచ్చారు. రెండు రోజుల పర్యటనలో (మార్చి 23, 24) భాగంగా ఆయన ప్రధాని నరేంద్ర మోదీ, ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్, విదేశీ వ్యవహారాల మంత్రి ఎస్‌ జైశంకర్‌ తదితరులతో సమావేశం కానున్నారు. 

భారత్‌ అభివృద్ధి ప్రణాళికలు, ప్రపంచ బ్యాంక్, అంతర్జాతీయ ఆర్థికాభివృద్ధిపరమైన సవాళ్లు వంటి అంశాలపై ఈ సందర్భంగా చర్చించనున్నారని అమెరికా ఆర్థిక శాఖ ఒక ప్రకటనలో తెలిపింది. అలాగే, నేషనల్‌ స్కిల్స్‌ డెవలప్‌మెంట్‌ కార్పొరేషన్‌తో కలిసి ఏర్పాటు చేసిన వృత్తి విద్యా కోర్సుల సంస్థల నెట్‌వర్క్‌ ’లెర్నెట్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ స్కిల్స్‌’ను కూడా బంగా సందర్శించనున్నారు. దీనికి ప్రపంచ బ్యాంక్‌ పాక్షికంగా నిధులు సమకూర్చింది. 

మాస్టర్‌కార్డ్‌ చీఫ్‌గా ఉన్న బంగా పేరును ప్రపంచ బ్యాంక్‌కు కొత్త ప్రెసిడెంట్‌గా  ప్రతిపాదించిన వెంటనే భారత ప్రభుత్వం మద్దతు తెలిపిందని అమెరికా ఆర్థిక శాఖ తెలిపింది. ఇప్పటికే బంగ్లాదేశ్, ఫ్రాన్స్, ఈజిప్ట్, జర్మనీ, ఇటలీ, సౌదీ అరేబియా, బ్రిటన్‌ తదిన్‌దేశాలు కూడా మద్దతు ప్రకటించినట్లు వివరించింది. తన అభ్యర్థిత్వానికి మద్దతు కూడగట్టుకునే ప్రయత్నాల్లో భాగంగా ఆయన మూడు వారాలుగా వివిధ దేశాలను సందర్శిస్తున్నారు. ఆఫ్రికాతో ప్రారంభించి యూరప్, లాటిన్‌ అమెరికా, ఆసియా దేశాల తర్వాత ఆఖరుగా భారత్‌ వచ్చారు.

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top