టాప్‌లో అజీం ప్రేమ్‌జీ : రోజుకు ఎన్ని కోట్లంటే | Wipro Azim Premji emerges as most generous Indian in FY20 | Sakshi
Sakshi News home page

టాప్‌లో అజీం ప్రేమ్‌జీ : రోజుకు ఎన్ని కోట్లంటే

Nov 10 2020 3:29 PM | Updated on Nov 10 2020 4:44 PM

 Wipro Azim Premji emerges as most generous Indian in FY20 - Sakshi

సాక్షి,ముంబై: పారిశ్రామిక వేత్త, ప్రముఖ దాత, దేశీయ అతిపెద్ద సాఫ్ట్‌వేర్ సంస్థ విప్రో అధినేత అజీం ప్రేమ్‌జీ దాతృత్వంలో తన ప్రత్యేకతను చాటుకున్నారు. 2020వ సంవత్సరంలో విరివిగా దానాలు చేసి, ఈ జాబితాలో అగ్రస్థానంలో నిలిచారు. హురున్ రిపోర్ట్ ఇండియా తాజా లెక్కల ప్రకారం రోజుకు 20 కోట్లు  ఏడాదికి  7,904 కోట్లు చొప్పున, విరాళంగా ఇచ్చారు.

గత ఏడాది హురున్ రిపోర్ట్ ఇండియా రూపొందించిన జాబితా ప్రకారం హెచ్‌సీఎల్ టెక్నాలజీస్‌ ఫౌండర్‌ శివ్ నాడార్‌ టాప్‌లో నిలిచిన సంగతి తెలిసిందే. తాజాగా శివ నాడార్‌ను అధిగమించిన అజీం ప్రేమ్‌జి టాప్‌లో నిలిచారు. నాడార్‌  ఈ ఆర్థిక సంవత్సరంలో 795 కోట్లు రూపాయల విరాళమివ్వగా అంతకుముందు ఏడాది కాలంలో 826 కోట్ల రూపాయలుగా ఉంది. గత ఆర్థిక సంవత్సరంలో ప్రేమ్‌జీ 426 కోట్లు విరాళంగా ఇచ్చారు. రిలయన్స్ ఇండస్ట్రీస్‌కు అధినేత, బిలియనీర్‌ ముకేశ​ అంబానీ  458 కోట్ల రూపాయల విరాళం ఇవ్వడం ద్వారా మూడో స్థానంలో నిలిచారు. ఏడాది క్రితం  అంబానీ 402 కోట్ల రూపాయలు డొనేట్‌ చేశారు.

అలాగే కరోనా మహమ్మారిపై పోరులో భాగంగా కార్పొరేట్‌ రంగం భారీగా విరాళాలిచ్చింది. ప్రధానంగా టాటా సన్స్ 1500 కోట్ల నిబద్ధతతో, ప్రేమ్‌జీ 1125 కోట్లు, అంబానీ 510 కోట్లు రూపాయల విరాళాన్ని ప్రకటించారు. దీంతో పాటు పీఎం కేర్స్ ఫండ్‌కు  రిలయన్స్ 500 కోట్లు, ఆదిత్య బిర్లా గ్రూప్ 400 కోట్లు, టాటా గ్రూపు 500 కోట్ల విరాళంగా ఇచ్చాయి. దీంతో కలిపి ఈ ఏడాది ప్రేమ్‌జీ మొత్తం విరాళాలను 175శాతం పెరిగి 12,050 కోట్లకు చేరుకుంది.10 కోట్లకు పైగా విరాళం ఇచ్చిన వ్యక్తుల సంఖ్య అంతకుముందు కాలం 72 నుండి 78 కు స్వల్పంగా పెరిగిందని నివేదిక తెలిపింది. 27 కోట్ల విరాళంతో,  ఏటీఈ చంద్ర ఫౌండేషన్‌కు చెందిన అమిత్ చంద్ర, అర్చన చంద్ర ఈ జాబితాలో ప్రవేశించిన తొలి, ఏకైక ప్రొఫెషనల్ మేనేజర్లు.

ఈ జాబితాలో  ఇన్ఫోసిస్ సహ వ్యవస్థాపకులు ముగ్గురు చోటు సంపాదించుకున్నారు. నందన్‌ నీలేకని 159 కోట్లు,  ఎస్ గోపాల​ కృష్ణన్ 50 కోట్లు, షిబులాల్ 32 కోట్లు డొనేట్‌ చేశారు. మరోవైపు 5 కోట్లకు పైగా విరాళం ఇచ్చిన 109 మంది వ్యక్తుల జాబితాలో ఏడుగురు మహిళలు ఉన్నారు. వీరిలో రోహిణి నీలేకని 47 కోట్ల రూపాయలతో టాప్‌లో ఉన్నారు. ఫ్లిప్‌కార్ట్‌ సహ వ్యవస్థాపకుడు బిన్నీ బన్సాల్ (37) 5.3 కోట్లతో అతి పిన్నవయస్కుడిగా ఉండటం విశేషం.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement