పెరుగుతున్న డిజిటల్ చెల్లింపులు
నగదు వినియోగమూ ఎక్కువే
పొదుపులోనూ వీరే ఫస్ట్
విస్తరిస్తున్న బీమా రక్షణ
గ్రామీణ, చిన్న పట్టణాల్లోని మహిళలు సైతం నిత్యజీవితంలో భాగంగా యూనిఫైడ్ పేమెంట్ ఇంటర్ఫేస్ (యూపీఐ) సాధనంతో అనుబంధాన్ని పెంచుకుంటున్నారు. గ్రోసరీ చెల్లింపులు, మొబైల్, యుటిలిటీ బిల్లు చెల్లింపులు, రీచార్జ్లను యూపీఐ ద్వారా కానిచ్చేస్తున్నారు. పెట్టుబడుల విషయంలోనూ వీరు ఆసక్తి చూపిస్తున్నట్టు ‘పే నియర్బై ఉమెన్ ఫైనాన్షియల్ ఇండెక్స్ 2026’ ఆరో ఎడిషన్ నివేదిక వెల్లడించింది. గ్రామీణ, చిన్న పట్టణాల్లో ఆర్థిక సేవలను అందించే 10,000 మంది మహిళా ఏజెంట్లను సర్వే చేసి ‘పే నియర్బై’ ఈ వివరాలు విడుదల చేసింది.
గ్రామీణ, చిన్న పట్టణాల్లో 38 శాతం మహిళలు వారంలో కనీసం ఒకసారి యూపీఐని వినియోగిస్తున్నారు.
ఆస్తుల అనుసంధాన ఉత్పత్తులు, పెట్టుబడుల పట్ల మహిళల్లో అవగాహన పెరుగుతోంది.
కుటుంబంలో తామే ప్రాథమిక పొదుపుదారులమని 85 శాతం మహిళలు తెలిపారు.
బంగారం ఆధారిత సాధనాల్లో పెట్టుబడుల పట్ల 44% మహిళలు ఆసక్తి చూపించారు. తమకు అందుబాటులోని సేవా పాయింట్ల ద్వారా చిన్న మొత్తంతో బంగారం సాధనాల్లో సిప్ ద్వారా ఇన్వెస్ట్ చేస్తామని చెప్పారు. కొత్త పొదుపు సాధనాల పట్ల వారిలో ఆసక్తికి ఇది నిదర్శనం.
సులభంగా ఉపసంహరించుకునే ఫిక్స్డ్, రికరింగ్ డిపాజిట్లకు మహిళల్లో ఆదరణ కనిపించింది. వీటిల్లో ఇన్వెస్ట్ చేస్తామని 98 శాతం మంది మహిళలు తెలిపారు.
కాకపోతే ఇటీవలి కాలంలో ఎక్కువగా ఆదరణ, అవగాహనకు నోచుకుంటున్న మ్యూచువల్ ఫండ్స్ పెట్టుబడుల విషయంలో మాత్రం మహిళల్లో ఆసక్తి ఆశించినంత లేదు. వీటి పట్ల గ్రామీణ, చిన్న పట్టణాల్లో 10 శాతం మంది మహిళల్లోనే అవగాహన ఉండడం గమనార్హం.
ఒకవైపు డిజిటల్ చెల్లింపులూ క్రమంగా పెరుగుతుండగా.. మరోవైపు నగదు వినియోగం కూడా ప్రధానంగానే ఉంది. ఇంటి ఖర్చులతోపాటు, అవసరమైనప్పుడు వినియోగించేందుకు వీలుగా వారు నగదుకు ప్రాధాన్యం ఇస్తున్నారు.
నగదు ఉపసంహరణకు బయోమెట్రిక్ గుర్తింపు లేదా ముఖ గుర్తింపును సౌకర్యంగా భావిస్తున్నారు. చాలా మంది మహిళల నగదు ఉపసంహరణ రూ.1,000–2,500 మధ్య ఉంటోంది.
బీమా రక్షణ విషయమై అధిక శాతం మంది మహిళల్లో అవగాహన ఉంది. కానీ, తీసుకునే వారు 26 శాతంగానే ఉన్నారు. ఆరోగ్య, జీవిత, ప్రమాద బీమాకు ప్రాధాన్యం ఇస్తున్నారు.
సొంతంగానే కానిచ్చేస్తున్నారు..
‘‘మరింత మంది మహిళలు స్వతంత్రంగానే తమ బ్యాంక్ ఖాతాలను నిర్వహించుకుంటున్నారు. క్రమశిక్షణతో నెలవారీ పొదుపు చేసుకోవడం, బంగారం సాధనాలు, బీమా, సంఘటిత రంగంలో రుణాల పట్ల సుముఖత చూపిస్తున్నారు. ఆర్థిక సాధనాల పట్ల అవగాహన పెరిగే క్రమంలో విశ్వసనీయమైన సహాయక నమూనాలు వారధిగా పనిచేస్తాయి. మహిళలు ఒకరి మార్గదర్శనానికి బదులు సొంతంగానే ఆర్థిక అంశాల్లో భాగస్వాములయ్యేందుకు వీలు కల్పిస్తాయి’’అని పే నియర్బై ఎండీ, సీఈవో ఆనంద్ కుమార్ బజాజ్ తెలిపారు.
ఇదీ చదవండి: ప్రకటనల రంగంలో ఏఐ విప్లవం


