తగ్గిన మొండిబాకీలు.. పెరిగిన లాభాలు | Union bank Central bank of india Q1 Profits | Sakshi
Sakshi News home page

తగ్గిన మొండిబాకీలు.. పెరిగిన లాభాలు

Jul 20 2025 1:39 PM | Updated on Jul 20 2025 3:10 PM

Union bank Central bank of india Q1 Profits

ప్రభుత్వ రంగానికి చెందిన యూనియన్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా 2025 ఏప్రిల్‌జూన్‌ కాలానికి రూ.4,116 కోట్ల నికర లాభాన్ని నమోదు చేసింది. 2024 ఇదే కాలానికి ఆర్జించిన రూ.3,679 కోట్లతో పోలిస్తే ఇది 12% అధికం. మొత్తం ఆదాయం రూ.30,874 కోట్ల నుంచి రూ.31,791 కోట్లకు పెరిగింది. వడ్డీ ఆదాయం రూ.26,364 కోట్ల నుంచి అధికమై రూ.27,296 కోట్లకు చేరింది. నికర వడ్డీ ఆదాయం రూ.9,412 కోట్ల నుంచి రూ.9,113 కోట్లకు దిగివచ్చింది. నిర్వహణ లాభం 11% క్షీణించి రూ.7,785 కోట్ల నుంచి రూ.6,909 కోట్లకు తగ్గింది.

స్థూల నిరర్థక ఆస్తులు(ఎన్‌పీఏలు) 4.54% నుంచి 3.52 శాతానికి, నికర ఎన్‌పీఏలు 0.90% నుంచి 0.62 శాతానికి తగ్గాయి. మొండి రుణాలకు ప్రొవిజన్ల కేటాయింపు రూ.1,651 కోట్ల నుంచి రూ.1,153 కోట్లకు తగ్గాయి. స్థూల అడ్వాన్సులు 6.83% పుంజుకొని 9,12,214 కోట్ల నుంచి రూ.9,74,489 కోట్లకు చేరుకున్నాయి. ప్రొవిజన్‌ కవరేజ్‌ రేషియో(పీసీఆర్‌) 116 బేసిస్‌ పాయింట్లు పెరిగి 93.49 శాతం నుంచి 94.65 శాతానికి చేరింది. మొత్తం వ్యాపారం 5% వృద్ధి చెంది రూ.21,08,762 కోట్ల నుంచి రూ.22,14,422 కోట్లకు ఎగసింది.

సెంట్రల్‌ బ్యాంక్‌ ఫలితాలు భేష్‌

ప్రభుత్వరంగ సెంట్రల్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా ప్రస్తుత ఆర్థిక సంవత్సరం(202526) తొలి త్రైమాసికంలో ఆకర్షణీయమైన ఫలితాలు ప్రకటించింది. ఆదా యం మెరుగవడం, మొండి రుణాలు (ఎన్‌పీఏలు) తగ్గడంతో ఏప్రిల్‌జూన్‌లో రూ.1,169 కోట్ల నికర లాభా న్ని నమోదు చేసింది. గత ఆర్థిక సంవత్సరం(2024 25) ఇదే క్యూ1 నికర లాభం రూ.880 కోట్లతో పోలి స్తే ఇది 33% అధికం. వార్షిక ప్రాతిపదికన మొత్తం ఆదాయం రూ.9,500 కోట్ల నుంచి రూ.10,374 కోట్లకు ఎగసింది.

బ్యాంకు వడ్డీ ఆదాయం రూ.8,335 కోట్ల నుంచి రూ.8,589 కోట్లకు చేరుకుంది. నిర్వహణ లాభం 19% పెరిగి రూ.2,304 కోట్లకు చేరింది. ఆస్తుల నాణ్యత మెరుగవడంతో స్థూల మొండి బకాయిలు 4.54% నుంచి 3.13 శాతానికి దిగివచ్చాయి. నికర ఎన్‌పీఏలు 0.73% నుంచి 0.49 శాతానికి తగ్గాయి. స్థూల అడ్వాన్సులు 9.97% పుంజుకొని 2,50,615 కోట్ల నుంచి రూ.2,75,595 కోట్లకు చేరుకున్నాయి. ప్రొవిజన్‌ కవరేజ్‌ రేషియో 96.17 % నుంచి 97.02 శాతం పెరిగింది. కనీస మూలధన నిష్పత్తి 15.6% నుంచి 17.6 శాతానికి మెరుగైంది. మొత్తం వ్యాపారం 11% వృద్ధి చెంది రూ.6,35,564 కోట్ల నుంచి రూ.7,04,485 కోట్లకు ఎగసింది.

Advertisement
 
Advertisement
Advertisement