రికార్డు గరిష్ట స్థాయిలో ఉద్యోగ అవకాశాలు
68 శాతానికి చేరిన అవుట్లుక్
ఏఐని వినియోగిస్తున్న సంస్థలు
ఏప్రిల్–జూన్ క్వార్టర్పై మ్యాన్పవర్ గ్రూప్ అంచనా
న్యూఢిల్లీ: ఉద్యోగ నియామకాలు వచ్చే ఏప్రిల్–జూన్ త్రైమాసికంలో గణనీయంగా పెరగనున్నట్లు మ్యాన్పవర్ గ్రూప్ తాజా సర్వే తెలిపింది. వ్యాపారాల్లో పెరిగిన విశ్వాసం, దేశీ డిమాండ్ బలంగా ఉండడం ఇందుకు ప్రధాన కారణాలుగా పేర్కొంది. మ్యాన్పవర్ గ్రూప్ ఎంప్లాయిమెంట్ అవుట్లుక్ సర్వే ప్రకారం.. 2026 సంవత్సరం రెండో త్రైమాసికానికి నెట్ ఎంప్లాయ్మెంట్ అవుట్లుక్ (ఎన్ఈవో) 68 శాతానికి చేరి రికార్డు స్థాయిని తాకింది. ఇది గత త్రైమాసికంతో పోలిస్తే 17 పాయింట్లు, గత సంవత్సరం ఇదే కాలంతో పోలిస్తే 24 పాయింట్లు ఎక్కువ.
జనవరి 1 నుంచి ఫిబ్రవరి 3 మధ్య దేశవ్యాప్తంగా 3,000కిపైగా సంస్థల యజమానుల అభిప్రాయాలను మ్యాన్పవర్ గ్రూప్ తెలుసుకుని ఈ వివరాలు విడుదల చేసింది. గతేడాది చేపట్టిన జీఎస్టీ సంస్కరణలు, 2026 సంవత్సరానికి బలమైన ఆర్థిక వృద్ధి అంచనాలు వ్యాపారాలకు మద్దతునిస్తున్నట్టు ఈ సర్వే నివేదిక తెలిపింది. అలాగే భారత్– ఐరోపా సమాఖ్య (ఈయూ) వాణిజ్య ఒప్పందం, అంతర్జాతీయంగా వాణిజ్య ఉద్రిక్తతలు తగ్గుముఖం పట్టడం వంటివి మెరుగైన ఎగుమతులకు సహాయపడతాయని పేర్కొంది. నియామకాలు పెరుగుతాయన్న సంస్థల అంచనాల నుంచి, నియామకాలు తగ్గుతాయని చెప్పిన కంపెనీల అంచనాలను మినహాయించగా వచి్చందే నెట్ ఎంప్లాయిమెంట్ అవుట్లుక్ (ఎన్ఈవో).
ఫైనాన్స్, బీమాలో ఎక్కువ..
⇒ మ్యాన్పవర్ గ్రూప్ సర్వే ప్రకారం.. ఫైనాన్స్, ఇన్సూరెన్స్ రంగంలోని కంపెనీలు గరిష్ట నియామక అంచనాలతో ఉన్నాయి. ఇది 71 పాయింట్లుగా ఉంది. గత త్రైమాసికం నుంచి 8 పాయింట్లు పెరిగింది. అదే గతేడాది క్యూ2తో పోలి్చతే ఏకంగా 26 పాయింట్లు పెరిగింది. అంతేకాదు ఫైనాన్స్, బీమా రంగంలో నియామక అంచనాల పరంగా అంతర్జాతీయంగానూ భారత్ మొదటి స్థానంలో ఉంది.
⇒ ఆటోమోటివ్ రంగం సైతం పెద్ద సంఖ్యలో కొత్త ఉద్యోగులను ఏప్రిల్–జూన్ త్రైమాసికంలో తీసుకోనుంది. ఆ తర్వాత టెక్నాలజీ, ఐటీ రంగంలో ఎక్కువ అవకాశాలు రానున్నాయి.
⇒ ఆతిథ్య రంగంలో నియామకాల అంచనా 31 శాతంగా ఉంది. ఈ రంగంలో కొంత అప్రమత్త ధోరణి కనిపించింది.
⇒ దేశంలోని అన్ని ప్రాంతాల్లోనూ ఉద్యోగ నియామకాలు పెరగనుండగా, ఉత్తర భారత్లో మాత్రం 70 పాయింట్లతో బలమైన అంచనాలు కనిపించాయి.
⇒ ఇప్పటికే 87 శాతం సంస్థలు నియామకాలు, శిక్షణ విషయంలో ఏఐని వినియోగిస్తున్నాయి. ఏఐ తమ అంచనాలను పూర్తిగా అందుకుంటున్నట్టు 11 శాతం సంస్థలే చెప్పాయి.
వేధిస్తున్న నిపుణుల కొరత..
‘‘నియామకాల ఉద్దేశ్యం బలంగా ఉంది. ఇది యాజమాన్యాల్లో పెరుగుతున్న విశ్వాసానికి నిదర్శనం. అదే సమయంలో నిపుణుల కొరత సైతం వేధిస్తోంది. తమకు కావాల్సిన నైపుణ్యాలను గుర్తించడం కష్టంగా ఉందని 82 శాతం సంస్థలు అంటున్నాయి. రానున్న రోజుల్లో నియామక నిర్ణయాలను కృత్రిమ మేథ (ఏఐ) ప్రభావితం చేయనుంది’’అని మ్యాన్పవర్ గ్రూప్ ఎండీ సందీప్ గులాటీ తెలిపారు.


