
ప్రసార రంగంలో సమతుల్య నియంత్రణ విధానం అవసరం
ట్రాయ్ ఛైర్మన్ అనిల్ కుమార్ లహోటి
ప్రసార రంగంలో సమతుల్య నియంత్రణ విధానం అవసరమని టెలికాం రెగ్యులేటరీ అథారిటీ ఆఫ్ ఇండియా (ట్రాయ్) ఛైర్మన్ అనిల్ కుమార్ లహోటి తెలిపారు. వరల్డ్ ఆడియో విజువల్ అండ్ ఎంటర్టైన్మెంట్ సమ్మిట్ (వేవ్స్) 2025లో ఆయన పాల్గొని మాట్లాడారు. టీవీ, స్ట్రీమింగ్ ప్లాట్ఫామ్ల మధ్య నియంత్రణలో అసమానతలున్నాయని తెలిపారు. అందుకోసం సమతుల్య నియంత్రణ విధానం తోడ్పడుతుందని చెప్పారు. ఈ సందర్భంగా న్యూ టారిఫ్ ఆర్డర్ (ఎన్టీఓ)పై సమీక్ష కొనసాగుతుందని తెలిపారు.
పరస్పర విరుద్ధ డిమాండ్లు
ప్రధాన బ్రాడ్కాస్టర్లు, పంపిణీదారులు ప్రసార రంగంలో నియంత్రణను కోరుకోవడంలేదని లహోటి చెప్పారు. అందుకు వ్యతిరేకంగా స్థానిక కేబుల్ ఆపరేటర్లు, వినియోగదారులు బలమైన నియంత్రణ పర్యవేక్షణ కోరుతున్నట్లు తెలిపారు. ఈ పరస్పర వాదనల మధ్య సమతుల్యత సాధించడం, పరిశ్రమల వృద్ధిని ప్రోత్సహించడంతోపాటు వినియోగదారుల రక్షణను నిర్ధారించడం ట్రాయ్ లక్ష్యంగా చేసుకున్నట్లు పేర్కొన్నారు.
కొత్త టారిఫ్ ఆర్డర్పై సమీక్ష
స్ట్రీమింగ్ సేవలతో పోలిస్తే టీవీ బిల్లులు అధికంగా ఉండడం వల్ల పోటీ తగ్గిపోయిందనే అభిప్రాయాలున్నాయి. దాంతో అధికంగా ఆన్లైన్ స్ట్రీమింగ్ ప్లాట్ఫామ్లవైపే వినియోగదారులు మొగ్గు చూపుతున్నారనే వాదనలున్నాయి. ఈ సమస్య పరిష్కరించేందుకు కొత్త టారిఫ్ ఆర్డర్ను సమగ్రంగా సమీక్షించడానికి ట్రాయ్ ముందస్తు సంప్రదింపుల ప్రక్రియను ప్రారంభించింది. ఇందుకోసం టీవీ బ్రాడ్కాస్టర్లు, ఆపరేటర్ల అభిప్రాయాలు సేకరిస్తోంది. లీనియర్ టీవీ విధానం కఠినమైన ప్రభుత్వ ఆదేశిత ప్రోగ్రామింగ్, అడ్వర్టైజింగ్ కోడ్ల కింద పనిచేస్తుందని, డిజిటల్ స్ట్రీమింగ్ ప్లాట్ఫామ్లు స్వీయ నియంత్రణను అనుసరిస్తాయని లహోటి అభిప్రాయపడ్డారు. ఇది న్యాయమైన పోటీపై ఆందోళనలను లేవనెత్తుతుందని చెప్పారు.
ఇదీ చదవండి: హజ్ యాత్రకు ప్రత్యేక విమానాలు
డిజిటల్ మీడియాను పర్యవేక్షించే ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ మంత్రిత్వ శాఖ (ఎంఈఐటీవై), వార్తలు, క్యూరేటెడ్ కంటెంట్కు బాధ్యత వహించే సమాచార, ప్రసార మంత్రిత్వ శాఖ (ఎంఐబీ) మధ్య అధికార పరిధిని ట్రాయ్ పరిశీలిస్తోందని లహోటి తెలిపారు. రెండింటి మధ్య స్థిరమైన నియంత్రణ సూత్రాల అవసరాన్ని నొక్కి చెప్పారు.