కంపెనీ దురాశే.. ఉద్యోగుల తొలగింపు: శ్రీధర్ వెంబు ట్వీట్ వైరల్ | Sridhar Vembu Tweet About Layoffs | Sakshi
Sakshi News home page

కంపెనీ దురాశే.. ఉద్యోగుల తొలగింపు: శ్రీధర్ వెంబు ట్వీట్ వైరల్

Nov 10 2024 4:17 PM | Updated on Nov 10 2024 4:40 PM

Sridhar Vembu Tweet About Layoffs

కరోనా సమయంలో చాలా కంపెనీలు ఆర్థికంగా నష్టపోవడంతో.. ఉద్యోగులను తొలగించడం ప్రారంభించాయి. అయితే ఇప్పుడు సంస్థలు ఆర్థికంగా కుదుటపడుతున్నాయి, లాభాలను ఆర్జిస్తున్నాయి. ఇలాంటి సమయంలో కూడా ఉద్యోగుల తొలగింపులు జరుగుతూనే ఉన్నాయి. దీనిపైన మల్టీ నేషనల్ టెక్నాలజీ కంపెనీ.. జోహో ఫౌండర్ 'శ్రీధర్ వెంబు' కీలక వ్యాఖ్యలు చేశారు.

100 కోట్ల రూపాయల క్యాష్ ఉన్న కంపెనీకి.. వార్షిక ఆదాయం 1.5 రెట్లు కంటే ఎక్కువ వచ్చింది. ఇప్పటికీ 20 శాతం లాభాలను గడిస్తోంది. మూడో త్రైమాసికంలో ఏకంగా రూ.18 కోట్ల ఆదాయం వచ్చింది. అంతే కాకుండా రూ. 40కోట్ల విలువైన షేర్లను కొనుగోలు చేయడానికి కూడా సంస్థ సిద్ధమైంది. ఇంత లాభాలతో ముందుకు సాగుతున్న కంపెనీ.. ఉద్యోగులలో 12 నుంచి 13 శాతం తొలగింపులు చేపట్టడం అంటే.. ఇది పెద్ద దురాశే అని శ్రీధర్ వెంబు తన ఎక్స్ ఖాతాలో పేర్కొన్నారు.

చెన్నై కేంద్రంగా పనిచేస్తున్న 'ప్రెష్‌వర్క్స్' కంపెనీని ఉద్దేశించి శ్రీధర్ వెంబు ఈ వ్యాఖ్యలను చేసినట్లు తెలుస్తోంది. ఈ సంస్థ కొన్ని రోజుల క్రితమే సుమారు 660 మంది ఉద్యోగులను తొలగించింది. ప్రస్తుతం ఈ ట్వీట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. నెటిజన్లు కూడా తమదైన రీతిలో స్పందిస్తున్నారు.

ఇదీ చదవండి: ఏ హామీ లేకుండానే లోన్: నిర్మలా సీతారామన్ కీలక ప్రకటన

కంపెనీలు లాభాల్లో ఉన్నప్పటికీ.. ఉద్యోగులను తొలగించే సంస్కృతి కొన్ని అగ్రదేశాల్లో ఉంది. దానిని మనం భారతదేశానికి దిగుమతి చేసుకుంటున్నాము. ఇది ఉద్యోగులకు కంపెనీ మీద ఉన్న నమ్మకాన్ని చెరిపివేస్తుంది. సంస్థలో ఎప్పుడూ.. కస్టమర్‌లను, ఉద్యోగులను మొదటి స్థానంలో ఉంచాలి. ఆ తరువాత స్థానంలో వాటాదారులు ఉండాలని శ్రీధర్ వెంబు పేర్కొన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement