నేడు మార్కెట్ల లాభాల ఓపెనింగ్‌?! 

SGX Nifty indicates Market may open in positive zone - Sakshi

ఎస్‌జీఎక్స్‌ నిఫ్టీ 61 పాయింట్లు అప్‌

నిఫ్టీకి 11,791-11,844 వద్ద రెసిస్టెన్స్‌!

బుధవారం యూఎస్‌ మార్కెట్లు 2 శాతం ప్లస్‌

ప్రస్తుతం ఆసియా మార్కెట్లలో సానుకూల ట్రెండ్‌

పెట్టుబడుల బాటలో విదేశీ పోర్ట్‌ఫోలియో ఇన్వెస్టర్లు

నేడు(8న) దేశీ స్టాక్‌ మార్కెట్లు మరోసారి హుషారుగా ప్రారంభమయ్యే అవకాశముంది. ఇందుకు సంకేతంగా ఉదయం 8.15 ప్రాంతంలో ఎస్‌జీఎక్స్‌ నిఫ్టీ 61 పాయింట్లు ఎగసి 11,817 వద్ద ట్రేడవుతోంది. బుధవారం ఎన్‌ఎస్‌ఈలో నిఫ్టీ అక్టోబర్‌ ఫ్యూచర్స్‌ 11,756 వద్ద స్థిరపడింది. ఎన్‌ఎస్‌ఈ నిఫ్టీ ఫ్యూచర్‌ కదలికలను.. ఎస్‌జీఎక్స్‌ నిఫ్టీ ప్రతిఫలించే సంగతి తెలిసిందే. అధ్యక్ష ఎన్నికలలోపు పాక్షికంగానైనా సహాయక ప్యాకేజీని ప్రభుత్వం ప్రకటించవచ్చన్న అంచనాలతో బుధవారం యూఎస్‌ మార్కెట్లు 2 శాతం స్థాయిలో బలపడ్డాయి. ప్రస్తుతం ఆసియా మార్కెట్లలో సానుకూల ధోరణి నెలకొంది. కాగా.. నాలుగు రోజులపాటు మార్కెట్లు ర్యాలీ చేసిన నేపథ్యంలో దేశీయంగా నేడు ట్రేడర్లు లాభాల స్వీకరణకు ప్రాధాన్యమిచ్చే వీలున్నట్లు విశ్లేషకులు భావిస్తున్నారు. దీంతో కొంతమేర ఆటుపోట్లు కనిపించవచ్చని అభిప్రాయపడ్డారు.

ర్యాలీ బాటలోనే
తొలుత అటూఇటుగా ప్రారంభమైనప్పటికీ వరుసగా నాలుగో రోజు బుధవారం దేశీ స్టాక్‌ మార్కెట్లు లాభాల దుమ్ము రేపాయి. సెన్సెక్స్‌ 304 పాయింట్లు ఎగసి 39,879 వద్ద నిలవగా.. 76 పాయింట్లు పుంజుకున్న నిఫ్టీ 11,739 వద్ద ముగిసింది. ముందురోజు యూఎస్‌ మార్కెట్లు పతనంకావడంతో తొలుత మార్కెట్లు స్వల్ప ఒడిదొడుకులను ఎదుర్కొన్నాయి. దీంతో ఇంట్రాడేలో సెన్సెక్స్‌ 39,698- 39,451 పాయింట్ల మధ్య ఊగిసలాటకు లోనైంది. నిఫ్టీ సైతం 11,763- 11,629 పాయింట్ల మధ్య హెచ్చుతగ్గులను చవిచూసింది.

నిఫ్టీ కదలికలు?
నేడు మార్కెట్లు బలహీనపడితే ఎన్‌ఎస్‌ఈ నిఫ్టీకి తొలుత 11,658 పాయింట్ల వద్ద, తదుపరి 11,577 వద్ద మద్దతు లభించవచ్చని సాంకేతిక నిపుణులు భావిస్తున్నారు. ఒకవేళ మార్కెట్లు బలపడితే.. తొలుత 11,791 పాయింట్ల వద్ద, ఆపై 11,844 వద్ద నిఫ్టీకి రెసిస్టెన్స్‌ ఎదురుకావచ్చని తెలియజేశారు. ఇక బ్యాంక్‌ నిఫ్టీకి తొలుత 22,703 పాయింట్ల వద్ద, తదుపరి 22,441 వద్ద సపోర్ట్‌  లభించవచ్చని అంచనా వేశారు. ఇదే విధంగా తొలుత 23,131 పాయింట్ల వద్ద, తదుపరి 23,298 స్థాయిలో బ్యాంక్‌ నిఫ్టీకి అవరోధాలు కనిపించవచ్చని భావిస్తున్నారు.

ఎఫ్‌పీఐల కొనుగోళ్లు
నగదు విభాగంలో బుధవారం విదేశీ పోర్ట్‌ఫోలియో ఇన్వెస్టర్లు(ఎఫ్‌పీఐలు) రూ. 1,094 కోట్ల విలువైన స్టాక్స్‌ కొనుగోలు చేయగా.. దేశీ ఫండ్స్‌(డీఐఐలు) రూ. 1,129 కోట్ల అమ్మకాలు చేపట్టాయి. మంగళవారం ఎఫ్‌పీఐలు రూ. 1,102 కోట్లను ఇన్వెస్ట్‌ చేయగా.. దేశీ ఫండ్స్‌ రూ. 935 కోట్ల విలువైన స్టాక్స్‌ విక్రయించిన సంగతి తెలిసిందే.

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram

Tags: 



 

Read also in:
Back to Top