ఐపీవోకు సిద్ధంగా ఉన్న రెండు కంపెనీలు ఇవే.. | Several companies gearing up for their IPOs in India | Sakshi
Sakshi News home page

ఐపీవోకు సిద్ధంగా ఉన్న రెండు కంపెనీలు ఇవే..

Mar 19 2025 11:48 AM | Updated on Mar 19 2025 11:48 AM

Several companies gearing up for their IPOs in India

క్యాపిటల్‌ మార్కెట్ల నియంత్రణ సంస్థ సెబీ తాజాగా పబ్లిక్‌ ఇష్యూ చేపట్టేందుకు రెండు కంపెనీలకు గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చింది. ఈ జాబితాలో వైట్‌గూడ్స్‌ దిగ్గజం ఎల్‌జీ ఎల్రక్టానిక్స్‌ ఇండియాతోపాటు మానవ వనరులు, టోల్‌ప్లాజా నిర్వాహక సర్వీసుల సంస్థ ఇన్నోవిజన్‌ లిమిటెడ్‌ చేరాయి. రెండు కంపెనీలు 2024 డిసెంబర్‌లో సెబీకి ప్రాస్పెక్టస్‌ను దాఖలు చేశాయి.

దక్షిణ కొరియా దిగ్గజం ఎల్‌జీ అనుబంధ సంస్థ ఎల్‌జీ ఎల్రక్టానిక్స్‌ ఇండియా దేశీ స్టాక్‌ ఎక్స్ఛేంజీల్లో లిస్టింగ్‌కు సన్నద్ధమవుతోంది. ఇందుకు ఇప్పటికే రోడ్‌షోలు ప్రారంభించగా..తాజాగా సెబీ నుంచి అనుమతి పొందింది. ఐపీవోలో భాగంగా 15 శాతం వాటాకు సమానమైన 10.18 కోట్ల షేర్లను మాతృ సంస్థ విక్రయానికి ఉంచనుంది. తద్వారా సుమారు రూ.15,000 కోట్లు సమీకరించే యోచనలో ఉన్నట్లు తెలుస్తోంది. ఐపీవో పూర్తయితే కార్ల తయారీ దిగ్గజం హ్యుందాయ్‌ మోటార్స్‌ ఇండియా తదుపరి దేశీయంగా లిస్టయిన రెండో దక్షిణ కొరియా దిగ్గజంగా ఎల్‌జీ నిలవనుంది. హ్యుందాయ్‌ గతేడాది అక్టోబర్‌లో లిస్టయింది. ఎల్‌జీ ఇండియా ప్రధానంగా వాషింగ్‌ మెషీన్లు, లెడ్‌ టీవీలు, ఏసీలు, రిఫ్రిజిరేటర్లు, మైక్రోవేవ్స్‌ తదితర పలు కన్జూమర్‌ ప్రొడక్టులను విక్రయించే విషయం విదితమే. దేశీయంగా నోయిడా, పుణెల్లో తయారీ యూనిట్లను కలిగి ఉంది.

ఇదీ చదవండి: స్టార్‌లింక్‌ సర్వీసులపై స్పెక్ట్రమ్‌ ఫీజు?

రుణ చెల్లింపులకు..

టోల్‌ప్లాజా మేనేజ్‌మెంట్‌ సర్వీసుల కంపెనీ ఇన్నోవిజన్‌ లిమిటెడ్‌ ఐపీవోలో భాగంగా రూ.255 కోట్ల విలువైన ఈక్విటీని కొత్తగా జారీ చేయనుంది. వీటికి జతగా ప్రమోటర్లు మరో 17.72 లక్షల షేర్లను ఆఫర్‌ చేయనున్నారు. ఈక్విటీ జారీ నిధులను రుణ చెల్లింపులు, వర్కింగ్‌ క్యాపిటల్, సాధారణ కార్పొరేట్‌ అవసరాలకు వెచ్చించనుంది. కంపెనీ ప్రధానంగా మానవ వనరులు, క్లయింట్లకు దేశవ్యాప్తంగా నైపుణ్యాభివృద్ధి శిక్షణ, టోల్‌ ప్లాజా మేనేజ్‌మెంట్‌ తదితర సర్వీసులు సమకూర్చుతోంది.

Advertisement
 
Advertisement
Advertisement