ఆర్బీఐ కీలక ప్రకటన.. ఈ రూపీ పరిమితి భారీగా పెంపు

RBI Governor Shaktikanta Das Revealed Monetary Policy Decisions - Sakshi

ముంబై: డిజిటల్‌ రూపీని ఎన్నిసార్లైనా వాడుకునే వెలసులుబాటును కల్పిస్తూ నిర్ణయం తీసుకుంది రిజర్వ్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా. అంతేకాదు డిజిట్‌ రూపీపై ప్రస్తుతం ఉన్న రూ.10 వేల పరిమితిని లక్ష రూపాయల వరకు పెంచుతూ నిర్ణయం తీసుకుంది. ఇక 2022-23 ఆర్థిక సంవత్సరంలో వృద్ధి రేటు 7.8 శాతంగా ఉంటుందని రిజర్వ్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా గవర్నర్‌ శక్తికాంతదాస్‌ వెల్లడించారు. అదే విధంగా రిపోరేటు, రివర్స్‌రిపో రేటులో ఎటువంటి మార్పు లేదని తెలిపారు. ఆర్బీఐ 14వ బోర్డు సమావేశానికి సంబంధించి అనేక కీలక విషయాలను ఆయన వెల్లడించారు. 

ఆర్బీఐ కీలక నిర్ణయాలు 
- 2022-23 ఆర్థిక సంవత్సరంలో వృద్ధిరేటు 7.8 శాతంగా ఉంటుంది
- రిపోరేటు, రివర్స్‌రిపో రేటులో ఎటువంటి మార్పు లేదు. ప్రస్తుతం రిపోరేటు 4 శాతం ఉండగా రివర్స్‌రిపో రేటు 3.3 శాతంగా ఉంది. ఈ ఏడాది కూడా ఇవే కొనసాగనున్నాయి.
- నిత్యావసర వస్తువుల ధరలు అదుపులో ఉంటాయి. పప్పులు, వంట నూనె ధరల్లో ఉత్పత్తి పెరిగినందున ధరల పెరుగుదలకు కళ్లెం పడ్దట్టే. గత నవంబరు నుంచి పెట్రోలు ధరలు పెంచకపోవడం వల్ల ధరల పెరుగుదలకు కొంత బ్రేక్‌ పడింది.
- ఓమిక్రాన్‌ ప్రభావం క్యూ 3, క్యూ 4పై పెద్దగా లేదు
- కరోనా ప్రభావం నుంచి ఆర్థిక వ్యవస్థ కోలుకుంటుంది
- 2022-23 ఆర్థిక సంవత్సరంలో ద్రవ్యోల్బణం 4.5 శాతానికి పరిమితం అవుతుంది. గత ఆర్థిక సంవత్సరంలో ద్రవోల్బణం 5.7 శాతంగా ఉంది. ధరల పెరుగుదల అదుపులోకి వస్తుండటంతో ద్రవ్యోల్బణం తగ్గుతోంది 
- కమర్షియల్‌ బ్యాంకుల పనితీరు మెరుగుపడుతోంది
- అంతర్జాతీయ పరిస్థితుల్లో ప్రతికూలతు ఉన్నా రూపాయి విలువ స్థిరంగానే ఉంది. వంటనూనెల దిగుమతి, క్రూడ్‌ ఆయిల్‌ ధరల పెరుగుదల వల్ల విదేశీ మారక ద్రవ్యం నిల్వలు కొంత తగ్గాయి.
- ఎమర్జెన్సీ హెల్త్‌ సర్వీస్‌, కాంటాక్టింగ్‌ ఇంటెన్సివ్‌ సర్వీస్‌ల కోసం గత జూన్‌లో మొత్తం రూ.65 వేల కోట్ల రుణాలు కేటాయించాల్సిందిగా బ్యాంకులను ఆదేశించాం.  కరోనా భయాలు పూర్తిగా తొలగనందున ఈ పథకాన్ని 2022 జూన్‌ 30 వరకు పొడిగిస్తున్నాం. నిధుల లభ్యత పెరగడం వల్ల వైద్య రంగంలో మౌలిక సదుపాయాలు మరింతగా మెరుగవుతాయి.
- వీఆర్‌ఆర్‌ (వాలంటరీ రిటెన్షన్‌ రూట్‌) స్కీమ్‌కి మంచి స్పందన ఉంది. ఈ స్కీమ్‌ పరిమితిని ఒక కోటి రూపాయల నుంచి రూ. 2.5 కోట్లకు పెంచుతున్నారు. ఏప్రిల్‌ 1 నుంచి ఈ నిర్ణయం అమల్లోకి వస్తుంది
- ప్రీపెయిడ్‌ డిజిటల్‌ వోచర్లుగా ఉన్న ఈ రూపీ పరిమితిని పెంచారు. డిజిటల్‌ రూపీని 2021 ఆగస్టులో ప్రారంభించారు. ఇది సింగిల్‌ యూజ్‌ క్యాష్‌లెస్‌ వోచర్‌గా పని చేస్తుంది. ప్రస్తుతం డిజిటిల్‌ రూపీపై రూ.10,000 వరకే పరిమితి ఉంది. దీన్ని లక్ష వరకు పెంచుతూ ఆర్బీఐ నిర్ణయం తీసుకుంది. గతంలో ఈ వోచర్‌ని ఒకేసారి వాడాలనే నిబంధన ఉండగా.. ఇప్పుడు డిజిటల్‌ వోచర్‌లో అమౌంట్‌ అయిపోయే వరకు ఎన్ని సార్లైనా వాడుకునే వెసులుబాటు కల్పించారు. ఈ రూపీ వోచర్లు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు జారీ చేస్తాయి. యూపీఐ పేమెంట్స్‌లో వీటిని వాడుకోవచ్చు.
- ఎంఎస్‌ఎఫ్‌ (4.25 శాతం), బ్యాంక్‌ రేట్‌ (4.25 శాతం) ఎటువంటి మార్పు లేదు. 
- లతామంగేష్కర్‌ జీనా హై తమన్నా అనే పాటను గుర్తు చేస్తూ కరోనా కష్టాల్లో కూడా దేశం ధైర్యంగా ముందుకు సాగుతోందంటూ శక్తికాంతదాస ప్రసంగం ముగించారు.

14వ సమావేశం 
2022 ఫిబ్రవరి 10న పద్నాలుగవ రిజర్వ్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా బోర్డు సమావేశం జరిగింది. ఈ సమావేశంలో ప్రధానంగా 2022–23 వార్షిక బడ్జెట్‌ ముఖ్యాంశాలపై చర్చించారు. ద్రవ్యలోటు, మూలధన ప్రణాళికలు, ప్రభుత్వ మార్కెట్‌ రుణ సమీకరణల వంటి కీలక అంశాలపై ఈ సమావేశంలో సమీక్ష జరిపారు. లోక్‌సభలో వార్షిక బడ్జెట్‌ను ప్రవేశపెట్టిన తర్వాత ఆర్‌బీఐ గవర్నర్, డిప్యూటీ గవర్నర్లతో కూడిన ఆర్‌బీఐ బోర్డ్‌ను ఉద్దేశించి ఆర్థిక మంత్రి ప్రసంగించడం సాంప్రదాయకంగా వస్తోంది
 

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top