
ఆదాయపు పన్ను శాఖ పరిపాలనా సంస్థ సెంట్రల్ బోర్డ్ ఆఫ్ డైరెక్ట్ ట్యాక్సెస్ (సీబీడీటీ) కొత్త చైర్మన్గా 1988 బ్యాచ్ ఐఆర్ఎస్ అధికారి రవి అగర్వాల్ నియమితులయ్యారు. ప్రస్తుత చైర్మన్ 1986 బ్యాచ్ కు చెందిన ఐఆర్ఎస్ అధికారి నితిన్ గుప్తా పదవీకాలం జూన్ 30తో ముగుస్తుంది.
గుప్తా 2022 జూన్లో సీబీడీటీ చీఫ్గా నియమితులయ్యారు. గత ఏడాది సెప్టెంబరులోనే ఆయన పదవీ విరమణ చేయాల్సి ఉండగా జూన్ వరకు తొమ్మిది నెలల పొడిగింపు ఇచ్చారు. కొత్త సీబీడీటీ చీఫ్ ప్రస్తుతం బోర్డులో మెంబర్ (అడ్మినిస్ట్రేషన్)గా వ్యవహరిస్తున్నారు.
అగర్వాల్ 2025 జూన్ వరకు సీబీడీటీకి నేతృత్వం వహిస్తారని కేబినెట్ నియామకాల కమిటీ (ఏసీసీ) జారీ చేసిన ఉత్తర్వుల్లో పేర్కొంది. అగర్వాల్ సెప్టెంబర్లో పదవీ విరమణ చేయాల్సి ఉండగా, నియామక నిబంధనల సడలింపులో తిరిగి నియమితులైన కేంద్ర ప్రభుత్వ అధికారులకు వర్తించే సాధారణ నిబంధనలు, షరతుల ప్రకారం వచ్చే ఏడాది జూన్ 30 వరకు కాంట్రాక్ట్ ప్రాతిపదికన పునర్నియామకం కొనసాగుతుందని ఆయన నియామక ఉత్తర్వుల్లో పేర్కొన్నారు.
సీబీడీటీకి చైర్మన్ నేతృత్వం వహిస్తుండగా, ప్రత్యేక కార్యదర్శి హోదాలో ఆరుగురు సభ్యులు ఉంటారు. ప్రగ్యా సహాయ్ సక్సేనా, హెచ్బీఎస్ గిల్, ప్రవీణ్ కుమార్, సంజయ్ కుమార్, సంజయ్ కుమార్ వర్మ బోర్డులో సభ్యులుగా ఉన్నారు. జూన్ 30వ తేదీన వర్మ పదవీ విరమణ చేస్తున్నారు.