
న్యూఢిల్లీ: వచ్చే రెండేళ్లలో తమ క్యాండీ ఉత్పత్తి ’పల్స్’ రూ. 1,000 కోట్ల బ్రాండుగా ఎదుగుతుందని అంచనా వేస్తున్నట్లు దేశీ ఎఫ్ఎంసీజీ సంస్థ ధరమ్పాల్ సత్యపాల్ గ్రూప్ వైస్ చైర్మన్ రాజీవ్ కుమార్ తెలిపారు. ఒక్కోటి రూ. 1 ఖరీదు చేసే ఈ క్యాండీలు గత ఆర్థిక సంవత్సరంలో 750 కోట్ల యూనిట్లు అమ్ముడవడం ద్వారా రూ. 750 కోట్ల అమ్మకాల మార్కును సాధించినట్లు వివరించారు.
హార్డ్–బాయిల్డ్ క్యాండీ విభాగంలో 19 శాతం మార్కెట్ వాటాతో తాము అగ్రగామిగా ఉన్నామని, గత మూడళ్లుగా ఏటా 15% వృద్ధి సాధిస్తున్నా మని కుమార్ చెప్పారు. దేశీయంగా ఈ మార్కెట్ పరిమాణం సుమారు రూ. 4,000 కోట్లుగా ఉంది. 2015లో పల్స్ క్యాండీని ప్రవేశపెట్టారు.
ఈ ఉత్పత్తి దాని ప్రారంభ రోజుల్లో సోషల్ మీడియా బజ్, యూజర్-జనరేటెడ్ కంటెంట్ నుండి కూడా ప్రయోజనం పొందిందని కంపెనీ పేర్కొంది. సెలబ్రిటీ పోస్టులు, వైరల్ యూజర్ రివ్యూలు పల్స్ క్యాండీ తక్కువ మార్కెటింగ్ ఖర్చుతో కల్ట్ హోదాను సాధించడానికి సహాయపడ్డాయి. దీంతో అనతి కాలంలోనే డీఎస్ గ్రూప్ పల్స్ లైనప్ ను విస్తరించింది. లాంచ్ అయినప్పటి నుండి సుమారు 5,000 కోట్ల పల్స్ క్యాండీలు అమ్ముడయ్యాయి. ప్రారంభంలో కచ్చా ఆమ్ (పచ్చి మామిడి) ఫ్లేవర్ క్యాండీలు ఉండగా జామ, ఆరెంజ్, పైనాపిల్, లిచీ వేరియంట్లు తర్వాత వచ్చాయి.