
విద్యాలక్ష్మి స్కీము కింద విద్యా రుణాలపై వడ్డీ రేటును 20 బేసిస్ పాయింట్లు (0.2%) తగ్గించినట్లు పంజాబ్ నేషనల్ బ్యాంక్ (పీఎన్బీ) వెల్లడించింది. సంస్థను బట్టి విద్యా రుణాలపై వడ్డీ రేటు 7.5% నుంచి ప్రారంభం అవుతుందని వివరించింది. ఉన్నత విద్యను అభ్యసించడంలో విద్యార్థులకు ఆర్థిక తోడ్పాటునందించే లక్ష్యంతో ఈ స్కీమును రూపొందించారు. దేశవ్యాప్తంగా నాణ్యమైన ఉన్నత విద్యా సంస్థలుగా (క్యూహెచ్ఈఐ) గుర్తింపు పొందిన 860 సంస్థల్లో అడ్మిషన్ పొందిన విద్యార్థులకు ఇది ఉపయోగకరంగా ఉంటోంది.
ఇదీ చదవండి: రిజిస్ట్రేషన్ బిల్లు-2025 ముసాయిదా విడుదల
విద్యాలక్ష్మి పథకం కింద ఎడ్యుకేషన్ లోన్ కోసం దరఖాస్తు చేయాలంటే కింది డాక్యుమెంట్లు అవసరం అవుతాయని నిపుణులు చెబుతున్నారు.
కేవైసీ వివరాల కోసం: ఆధార్, పాన్ ఐడీ, అడ్రస్ ప్రూఫ్.
అకడమిక్ రికార్డులు: మునుపటి అకడమిక్ ఏడాదిలోని మార్కు షీట్లను సెల్ఫ్ అటెస్టెడ్ చేయాలి.
ప్రవేశ పరీక్ష ఫలితాలు: ఇప్పటికే ఏదైనా యూనివర్సిటీలో ప్రవేశం కోసం చూస్తూ, దాని ప్రవేశ పరీక్ష రాసి ఉంటే అందుకు సంబంధించిన ర్యాంక్ కార్డును జోడించాలి.
అడ్మిషన్ ప్రూఫ్: ఇప్పటికే సంస్థ నుంచి అడ్మిషన్ వస్తే ఫీజు స్ట్రక్చర్తో పాటు సంస్థ నుంచి అడ్మిషన్ లెటర్.
ఫొటోలు: పాస్ పోర్ట్ సైజ్ ఫొటోలు.
లోన్ హిస్టరీ: ఇప్పటికే బ్యాంకులు/ రుణదాతల నుంచి గతంలో లేదా ప్రస్తుతం ఉన్న రుణాల వివరాలు.
ఆదాయ ధ్రువీకరణ పత్రం: రాష్ట్రంలోని నిర్దేశిత పబ్లిక్ అథారిటీ నుంచి ఆదాయ ధ్రువీకరణ పత్రం.