
దేశవ్యాప్తంగా ప్రాపర్టీ డాక్యుమెంట్ల రిజిస్ట్రేషన్లను ఆధునీకరించేందుకు ఉద్దేశించిన రిజిస్ట్రేషన్ బిల్లు-2025 ముసాయిదాను కేంద్రం ఆవిష్కరించింది. ఈ ప్రతిపాదిత చట్టం సమకాలీన డిమాండ్లకు సరిపోని నాటి 1908 రిజిస్ట్రేషన్ చట్టాన్ని భర్తీ చేయడానికి ఏర్పాటు చేశారు. కొత్త బిల్లు ఆస్తి రిజిస్ట్రేషన్ కోసం ఆన్లైన్ వ్యవస్థకు మద్దతుగా నిలుస్తుందని అధికారులు తెలిపారు. తద్వారా బ్యూరోక్రసీ, మధ్యవర్తుల అవసరం తగ్గనుంది.
ప్రాపర్టీ డాక్యుమెంటేషన్పై ఆధారపడిన ఆర్థిక లావాదేవీలు, చట్టపరమైన నిర్ణయాలు, పరిపాలనా సేవలను క్రమబద్ధీకరించే విస్తృత ప్రయత్నంలో భాగంగా ఈ చర్యలు చేపట్టారు. భూ దందాల్లోనే కాకుండా వివిధ ఆర్థిక, చట్టపరమైన కార్యకలాపాల్లో కూడా ప్రాపర్టీ డాక్యుమెంట్లు కీలక పాత్ర పోషిస్తున్నందున ఈ మార్పులు ప్రాధాన్యత చోటుచేసుకుంటున్నాయి.
1908 రిజిస్ట్రేషన్ చట్టం ఆన్లైన్ డాక్యుమెంట్ నిర్వహణ, డిజిటల్ ఐడెంటిటీ వెరిఫికేషన్ వంటి ఆధునిక అవసరాలకు అనుగుణంగా రూపొందించబడలేదు. ఈ వెసులుబాట్లు టెక్నాలజీ పెరుగుతున్న ఈ రోజుల్లో అత్యవసరంగా మారాయి. ప్రాపర్టీ డాక్యుమెంట్లు ఇప్పుడు కేవలం భూ దందాలకు మాత్రమే కాకుండా వివిధ ఆర్థిక, చట్టపరమైన కార్యకలాపాలకు కీలకంగా మారుతున్నాయి. అనేక రాష్ట్రాలు ఇప్పటికే ఆన్లైన్ అప్లోడ్లు, ఆధార్ ఆధారిత ధ్రువీకరణను అమలు చేస్తున్నాయి. అందుకు అనుగుణంగా దేశం అంతటా స్థిరమైన, విశ్వసనీయమైన వ్యవస్థను స్థాపించడానికి కొత్త చట్టం అవసరమని భావిస్తున్నారు. ఈ ఏకరూపత పౌరులందరికీ సమర్థవంతమైన, సురక్షితమైన ఆస్తి రిజిస్ట్రేషన్ ప్రక్రియలకు అవకాశం కల్పిస్తుందని భావిస్తున్నారు.
ఇదీ చదవండి: 15 రోజుల్లో వంట నూనెల ధరలు తగ్గింపు
ప్రతిపాదిత అంశాలు..
గృహ కొనుగోలుదారులకు ప్రాపర్టీ రిజిస్ట్రేషన్ ప్రక్రియను మరింత అందుబాటులోకి తీసుకురావడం, సమర్థవంతంగా నిర్వహించడం కొత్త బిల్లులోని ప్రధానాంశాల్లో ఒకటి. ప్రతిపాదిత విధానంలో పౌరులు సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాలకు పదేపదే వెళ్లాల్సిన అవసరం లేకుండా ఆస్తి పత్రాలను డిజిటల్గా నమోదు చేసుకోవచ్చు.
ఆన్లైన్ ద్వారా పేపర్ వర్క్ తగ్గుతుందని, ప్రక్రియలను వేగవంతం చేస్తుందని, మధ్యవర్తులపై ఆధారపడటాన్ని పరిమితం చేస్తుందని భావిస్తున్నారు.
ఆస్తుల లావాదేవీలకు డిజిటల్ రికార్డులను తప్పనిసరి చేయడం ద్వారా చట్టపరమైన రక్షణ పెరుగుతుంది. ఈ చర్యతో అమ్మకం ఒప్పందాలు, తనఖా పత్రాలు, సేల్ సర్టిఫికేట్లు వంటి కీలక డాక్యుమెంట్ల చట్టబద్ధత మెరుగుపడుతుందని భావిస్తున్నారు.
డిజిటల్-ఫస్ట్ విధానాన్ని అవలంబించడం ద్వారా, ఆస్తి లావాదేవీలను మరింత పారదర్శకంగా, సురక్షితంగా చేయడమే ఈ బిల్లు లక్ష్యం.