షేరుకు 81 యూరోలు చొప్పున ఆఫర్
న్యూఢిల్లీ: భారత ఐటీ దిగ్గజం పర్సిస్టెంట్ సిస్టమ్స్ అంతర్జాతీయంగా భారీ కొనుగోలు ఒప్పందాన్ని కుదుర్చుకుంది. జర్మనీకి చెందిన ప్రముఖ డిజిటల్ ఇంజినీరింగ్ సంస్థ నగారో ఎస్ఈను పూర్తిగా స్వా«దీనం చేసుకోనున్నట్లు ప్రకటించింది. తమ అనుబంధ సంస్థ గెలాక్సీ జర్మనీ హోల్డింగ్ ఎస్ఈ .. నగారో షేర్ల పూర్తిగా కొనుగోలు చేయనున్నట్లు తెలిపింది. ఇందుకోసం ఒక్కో షేరుకు 81 యూరోల చొప్పున నగదు రూపంలో ఆఫర్ చేస్తున్నట్లు తెలిపింది. ఈ డీల్ విలువ సుమారు 1.3 బిలియన్ డాలర్లుగా ఉంటుందని, 2027 మార్చి ఆఖరు నాటికి పూర్తి కావొచ్చని అంచనా.
ఈ వ్యూహాత్మక విలీనంతో సుమారు 2.9 బిలియన్ డాలర్ల (రూ.24 వేల కోట్లకు పైగా) వార్షిక ఆదాయ సామర్థ్యంతో ప్రపంచ ఏఐ ఆధారిత డిజిటల్ ఇంజినీరింగ్ రంగంలో అగ్రశ్రేణి సంస్థల్లో ఒకటిగా పర్సిస్టెంట్ అవతరించనుంది. పర్సిస్టెంట్–నగారోకి ఉమ్మడిగా ప్రపంచవ్యాప్తంగా 40 దేశాల్లో 46 వేల మంది పైగా ఐటీ ఉద్యోగులు ఉంటారు. వీరిలో అత్యధికంగా 37 వేల మంది భారత్లో, ఉత్తర అమెరికాలో 3,500 మంది, యూరప్లో సుమారు 3,000 మంది ఉంటారని సంస్థ తెలిపింది. ఈ లావాదేవీకి సంబంధించి ఇరు సంస్థలు ఇప్పటికే బిజినెస్ కాంబినేషన్ అగ్రిమెంట్పై సంతకాలు చేశాయి.


