
భారతీయ కళలు ఉట్టిపడేలా నీతా ముఖేష్ అంబానీ కల్చరల్ సెంటర్ (ఎన్ఎంఏసీసీ) ఇండియా వీకెండ్ను న్యూయార్క్ నగరంలోని లింకన్ సెంటర్లో ఏర్పాటు చేయనున్నట్లు నీతా అంబానీ తెలిపారు. ఈ వేడుక 2025 సెప్టెంబర్ 12 నుంచి 14 వరకు జరగనుందని చెప్పారు. ఈమేరకు ‘ఎన్ఎంఏసీసీ.ఇండియావికెండ్’ ఇన్స్టాగ్రామ్ హ్యాండిల్లో వివరాలు వెల్లడించారు. భారతీయ కళల వారసత్వం, సంప్రదాయ నృత్యాలు, సంగీతం, ఫ్యాషన్, వంటకాలు.. వంటి ఎన్నో సాంస్కృతిక కార్యక్రమాలు ఇందులో ఉండనున్నాయని తెలిపారు.
ఇదీ చదవండి: 61 లక్షల యూజర్లను కాపాడిన ఎయిర్టెల్
ఇన్స్టాగ్రామ్ పోస్ట్లోని వివరాల ప్రకారం.. ‘ది గ్రేట్ ఇండియన్ మ్యూజికల్: సివివైజేషన్ టు నేషన్’ ఈవెంట్లో భాగంగా సాంప్రదాయ నృత్యాలు ఉంటాయని నీతా అంబానీ తెలిపారు. దాంతోపాటు ఈ హైప్రొఫైల్ ఈవెంట్ సెలబ్రిటీల ఫ్యాషన్ షో, దేశ హస్తకళలు, సమకాలీన డిజైన్లకు వేదికగా నిలుస్తుందని చెప్పారు. క్రీస్తుపూర్వం 5000 నుంచి 1947లో భారతదేశానికి స్వాతంత్ర్యం వచ్చే వరకు దేశీయ పరిణామాలను తెలియజేసేలా నాటకాలుంటాయని చెప్పారు. ప్రదర్శనలు, దృశ్యాలు, కథల ద్వారా ఈ ఈవెంట్ చరిత్రకు జీవం పోస్తుందని నీతా అంబానీ చెప్పారు.