ప్రపంచ వేదికపై భారత్: నిర్మలా సీతారామన్ కీలక వ్యాఖ్యలు | Nirmala Sitharaman Says About India Development | Sakshi
Sakshi News home page

ప్రపంచ వేదికపై భారత్: నిర్మలా సీతారామన్ కీలక వ్యాఖ్యలు

Oct 26 2024 2:53 PM | Updated on Oct 26 2024 3:13 PM

Nirmala Sitharaman Says About India Development

కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్, అమెరికాలో సెంటర్ ఫర్ స్ట్రాటజిక్ అండ్ ఇంటర్నేషనల్ స్టడీస్ (CSIS) ప్రెసిడెంట్ అండ్ సీఈఓ జాన్ జే హామ్రేతో జరిగిన సమావేశంలో ఆర్థిక సాధికారతలో భారత్ అభివృద్ధిని గురించి వివరించారు. దేశం వేగంగా అభివృద్ధి చెందుతోందని.. ప్రతి గ్రామంలో మౌలిక సదుపాయాలు అందుబాటులో ఉన్నాయని పేర్కొన్నారు.

2014లో రాష్ట్ర రాజధానులకు సమీపంలో ఉన్న గ్రామాలకు కూడా విద్యుత్ సదుపాయం అంతంత మాత్రంగానే ఉండేది. నేడు ప్రతి గ్రామంల్లో విద్యుత్ సదుపాయం మాత్రమే కాకుండా.. ప్రతి ఇంటికి కుళాయి నీటి కనెక్షన్లు ఉన్నాయని.. ప్రధాని నరేంద్ర మోదీ ప్రారంభించిన 'జల్ జీవన్ మిషన్' కార్యక్రమం గురించి కూడా సీతారామన్ వెల్లడించారు.

ఇంతకు ముందు గ్రామాలకు కుళాయి నీటి కనెక్షన్లు ఉండేవి, కానీ ఇప్పుడు ప్రతి ఇంటికి కుళాయి నీటి కనెక్షన్స్ అందించడం జరిగింది. లక్షలాది భారతీయ కుటుంబాల ఆరోగ్యం, పారిశుధ్యం వంటి సౌకర్యాలపై కూడా కేంద్రం సానుకూల దృష్టి పెట్టిందని ఆర్ధిక మంత్రి పేర్కొన్నారు.

ఇదీ చదవండి: పండక్కి 13 స్పెషల్ ఎడిషన్స్.. మార్కెట్లో కొత్త కార్ల జోరు

మున్సిపాలిటీలు కేంద్ర ప్రభుత్వం వసూలు చేసే పన్నుల్లో కొంత భాగాన్ని, ఫైనాన్స్ కమిషన్ సిఫార్సుల ఆధారంగా అదనపు నిధులను పొందుతాయని ఆమె వివరించారు. అంతే కాకుండా మార్కెట్ నుంచి వనరులను సేకరించేందుకు వారి సామర్థ్యాలను పెంచుతున్నాము.  ఇది దేశాభివృద్ధికి ఎంతగానో ఉపయోగపడుతుందని నిర్మలా సీతారామన్ వివరించారు.

భారతదేశ ఆర్థిక వృద్ధికి కొన్ని సంస్కరణలు జరుగుతున్నాయి, భవిష్యత్తులో కూడా జరుగుతూనే ఉంటాయి. ఇప్పటికే ఎంతోమంది పెట్టుబడిదారులు కొత్త రంగాలలో విరివిగా పెట్టుబడులు పెడుతున్నారు. కొనసాగుతున్న సంస్కరణలు, పెరిగిన గ్లోబల్ ఎంగేజ్‌మెంట్‌తో.. భారతదేశం ప్రపంచ వేదికపై ప్రత్యేక గుర్తింపు పొందుతుందని సీతారామన్ స్పష్టం చేశారు.

Advertisement
 
Advertisement
Advertisement