తొలిసారి.. 14,000 మైలురాయికి నిఫ్టీ(అప్‌డేటెడ్‌) | Nifty near 14000 mark- Market in consolidation mode | Sakshi
Sakshi News home page

తొలిసారి.. 14,000 మైలురాయికి నిఫ్టీ(అప్‌డేటెడ్‌)

Dec 31 2020 10:02 AM | Updated on Dec 31 2020 12:11 PM

Nifty near 14000 mark- Market in consolidation mode - Sakshi

ముంబై, సాక్షి: వరుసగా ఆరు రోజులపాటు ర్యాలీ బాటలో సాగిన దేశీ స్టాక్‌ మార్కెట్లు తాజాగా కన్సాలిడేషన్‌ బాట పట్టాయి. స్వల్ప హెచ్చుతగ్గుల మధ్య కదులుతున్నాయి. ప్రస్తుతం సెన్సెక్స్‌ 36 పాయింట్లు బలపడి 47,782కు చేరగా.. నిఫ్టీ 9 పాయింట్లు పుంజుకుని 13,991 వద్ద ట్రేడవుతోంది. గత 21 సెషన్లలో 15సార్లు మార్కెట్లు సరికొత్త గరిష్టాలను అందుకున్న నేపథ్యంలో ట్రేడర్లు లాభాల స్వీకరణకు దిగుతున్నట్లు విశ్లేషకులు పేర్కొన్నారు. దీనికితోడు డిసెంబర్‌ డెరివేటివ్‌ కాంట్రాక్టులు నేడు ముగియనుండటంతో అప్రమత్తంగా వ్యవహరిస్తున్నట్లు చెప్పారు. ఇంట్రాడేలో సెన్సెక్స్‌ 47,801-47,602 పాయింట్ల మధ్య ఊగిసలాడింది. నిఫ్టీ సైతం 13998-13936 పాయింట్ల మధ్య హెచ్చుతగ్గులను చవిచూసింది. ఇన్వెస్టర్లు కొనుగోళ్లకు ఆసక్తి చూపడంతో మిడ్‌సెషన్‌కంటే ముందుగానే నిఫ్టీ 14,000 పాయిం‍ట్ల మైలురాయిని అధిగమించింది. 28 పాయింట్లు బలపడటం ద్వారా ఇంట్రాడేలో 14,010ను తాకింది. వెరసి మార్కెట్‌ చరిత్రలో తొలిసారి నిఫ్టీ ఈ ఫీట్‌ను సాధించింది.

పీఎస్‌యూ బ్యాంక్స్‌ ప్లస్‌
ఎన్‌ఎస్‌ఈలో ఐటీ, ఎఫ్‌ఎంసీజీ 0.4-0.2 శాతం చొప్పున నీరసించగా.. మిగిలిన అన్ని రంగాలూ బలపడ్డాయి. ప్రధానంగా ఫార్మా, ఐటీ, పీఎస్‌యూ బ్యాంకింగ్‌1-0.3 శాతం స్థాయిలో పుంజుకున్నాయి. నిఫ్టీ దిగ్గజాలలో డాక్టర్‌ రెడ్డీస్‌, ఓఎన్‌జీసీ, ఐసీఐసీఐ, సన్‌ ఫార్మా, సిప్లా, టాటా మోటార్స్‌, హెచ్‌డీఎఫ్‌సీ, దివీస్‌, ఆర్‌ఐఎల్‌ 1.4-0.5 శాతం మధ్య లాభపడ్డాయి. అయితే శ్రీ సిమెంట్‌, అల్ట్రాటెక్, గ్రాసిమ్, గెయిల్‌, యూపీఎల్‌, ఎంఅండ్‌ఎం‌, టెక్‌ మహీంద్రా, ఎన్‌టీపీసీ, ఐషర్‌, టీసీఎస్‌, ఇన్ఫోసిస్‌ 1.5-0.5 శాతం మధ్య బలహీనపడ్డాయి.

అరబిందో జూమ్‌ 
డెరివేటివ్‌ స్టాక్స్‌లో అరబిందో, ఐడియా, పీవీఆర్‌, బీఈఎల్‌, గ్లెన్‌మార్క్‌, అశోక్‌ లేలాండ్‌, లుపిన్‌, పెట్రోనెట్‌ 3-1.5 శాతం మధ్య ఎగశాయి. కాగా.. మరోవైపు బంధన్‌ బ్యాంక్‌, రామ్‌కో సిమెంట్‌, అంబుజా, ఏసీసీ, జీఎంఆర్‌, అదానీ ఎంటర్‌, టొరంట్‌ పవర్‌ 2-1 శాతం మధ్య క్షీణించాయి. బీఎస్‌ఈలో మిడ్‌, స్మాల్‌ క్యాప్స్‌ 0.4 శాతం చొప్పున పుంజుకున్నాయి. ఇప్పటివరకూ ట్రేడైన షేర్లలో 1,488 లాభపడగా.. 703 మాత్రమే నష్టాలతో కదులుతున్నాయి. 

ఎఫ్‌పీఐల జోరు
నగదు విభాగంలో బుధవారం విదేశీ పోర్ట్‌ఫోలియో ఇన్వెస్టర్లు(ఎఫ్‌పీఐలు) రూ, 1,825 కోట్ల విలువైన స్టాక్స్‌ కొనుగోలు చేయగా.. దేశీ ఫండ్స్‌(డీఐఐలు) రూ. 587 కోట్ల విలువైన అమ్మకాలు చేపట్టాయి. మంగళవారం ఎఫ్‌పీఐలు రూ. 2,349 కోట్లకుపైగా ఇన్వెస్ట్‌ చేయగా.. డీఐఐలు రూ. 2,010 కోట్ల పెట్టుబడులను వెనక్కి తీసుకున్న విషయం విదితమే. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement