రూ. 2.95 లక్షల కోట్లకు ఏయూఎం
యాంఫీ సీఈవో వెంకట్ చలసాని
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: మ్యూచువల్ ఫండ్స్పై అవగాహన పెరుగుతున్న నేపథ్యంలో తెలుగు రాష్ట్రాల్లో ఫండ్స్ నిర్వహణలోని ఆస్తుల పరిమాణం (ఏయూఎం) రూ. 2.95 లక్షల కోట్లకు చేరిందని ఫండ్ సంస్థల సంఘం యాంఫీ సీఈవో వెంకట్ ఎన్ చలసాని తెలిపారు. గతేడాది జూలైతో పోలిస్తే ఏయూఎం తెలంగాణలో 19% వృద్ధి చెంది రూ. 2.12 లక్షల కోట్లకు, ఆంధ్రప్రదేశ్లో 23% వృద్ధితో రూ. 82,409 కోట్లకు చేరినట్లు వివరించారు.
క్రమశిక్షణతో పెట్టుబడులు పెట్టడం, సిప్ మార్గంలో ఇన్వెస్ట్ చేసే ధోరణి పెరుగుతుండటాన్ని ఇది సూచిస్తోందని శుక్రవారమిక్కడ విలేకరుల సమావేశంలో చెప్పారు. రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలవ్యాప్తంగా చూస్తే తెలంగాణ 8వ స్థానంలో, ఏపీ 15వ స్థానంలో ఉన్నట్లు ఆయన పేర్కొన్నారు. తెలంగాణలో హైదరాబాద్, ఏపీలో విశాఖ, విజయవాడలాంటి ప్రాంతాలు కీలకంగా ఉంటున్నాయన్నారు.
తెలుగు రాష్ట్రాల్లో రియల్ ఎస్టేట్, పసిడిలో ఎక్కువగా ఇన్వెస్ట్ చేస్తుంటారని, క్రమంగా ఫండ్స్లాంటి ఇతర సాధనాల వైపు మళ్లుతున్నారని వెంకట్ వివరించారు. ప్రస్తుతం జాతీయ స్థాయిలో నెలవారీగా సిప్ల రూపంలో సుమారు రూ. 32,000 కోట్ల పెట్టుబడులు వస్తున్నాయని, ఈ ఆర్థిక సంవత్సరంలోనే రూ. 35 వేలకు చేరవచ్చని తెలిపారు. ఇక పరిశ్రమ ఏయూఎం రూ.87 లక్షల కోట్లకు పైగా ఉండగా, పరిస్థితులు కలిసొస్తే రూ.100 లక్షల కోట్లకు చేరడానికి ఎక్కువ కాలం పట్టదని ఆయన చెప్పారు.


