టాటా సన్స్‌ను లిస్ట్‌ చేయాల్సిందే | Shapoorji Mistry urges Tata Trusts to back Tata Sons listing | Sakshi
Sakshi News home page

టాటా సన్స్‌ను లిస్ట్‌ చేయాల్సిందే

Sep 19 2026 5:16 AM | Updated on Sep 19 2026 5:16 AM

Shapoorji Mistry urges Tata Trusts to back Tata Sons listing

దీనివల్ల పారదర్శకత, జవాబుదారీతనం పెరుగుతాయి 

ఎస్‌పీ గ్రూప్‌ చైర్మన్‌ షాపూర్‌ మిస్త్రీ 

టాటా సన్స్‌ బోర్డుకు దన్ను

న్యూఢిల్లీ: టాటా గ్రూప్‌ హోల్డింగ్‌ కంపెనీ టాటా సన్స్‌ లిస్టింగ్‌కు షాపూర్జీ పల్లోంజీ (ఎస్‌పీ) గ్రూప్‌ మద్దతు తెలిపింది. లిస్టింగ్‌ను టాటా ట్రస్ట్స్‌ తీవ్రంగా వ్యతిరేకిస్తున్నప్పటికీ టాటా సన్స్‌ బోర్డు చేస్తున్న ప్రయత్నాలకు ఇది మరింత బలం చేకూరుస్తోంది. టాటా సన్స్‌లో 18.6 శాతం వాటాతో రెండో అతిపెద్ద వాటాదారుగా నిలుస్తున్న ఎస్‌పీ గ్రూప్‌.. లిస్టింగ్‌ కోసం చాన్నాళ్లుగా పట్టుబడుతున్న సంగతి తెలిసిందే. 

పబ్లిక్‌ లిస్టింగ్‌ వల్ల సంస్థలో పారదర్శకతతో పాటు జవాబుదారీతనం కూడా బలోపేతమవుతాయని ఎస్‌పీ గ్రూప్‌ చైర్మన్‌ షాపూర్‌ మిస్త్రీ చెప్పారు. టాటా సన్స్‌ బోర్డు సమావేశంలో చైర్మన్‌ చంద్రశేఖరన్‌కు మరో ఐదేళ్ల పొడిగింపుతో పాటు కంపెనీ లిస్టింగ్‌కు మెజారిటీ డైరెక్టర్లు ఓకే చెప్పడం.. దీన్ని టాటా ట్రస్ట్స్‌ తీవ్రంగా వ్యతిరేకించిన నేపథ్యంలో గ్రూప్‌పై పట్టు కోసం ఆధిపత్య పోరు మరింత ముదిరింది.

 ఈ తరుణంలో కీలకమైన వాటాదారుల్లో ఒకటైన ఎస్‌పీ గ్రూప్‌ లిస్టింగ్‌కు సై అనడం ప్రాధాన్యం సంతరించుకుంది. కాగా,  ఎక్సే్చంజీల్లో లిస్టింగ్‌ చేయడం అనేది కేవలం ఆర్థికపరమైన, నియంత్రణపరమైన అంశం మాత్రమే కాదని,.. సామాజిక, నైతిక ఆవశ్యకత అని మిస్త్రీ పేర్కొన్నారు. 

టాటా ట్రస్ట్‌ల దాతృత్వ పాత్రను కాపాడుకుంటూనే, పాలనను బలోపేతం చేసేందుకు ఇది మంచి అవకాశమన్నారు. టాటా సన్స్‌లో టాటా ట్రస్ట్‌లకు 66% మెజారిటీ వాటా ఉంది. ఇదిలా ఉంటే, టాటా సన్స్‌ను ప్రైవేటు కంపెనీగా కొనసాగించేందుకు ఎస్‌పీ గ్రూప్‌ వాటాలో కొంత భాగాన్ని బైబ్యాక్‌ చేయడం ద్వారా కనీసం రూ.25,000 కోట్లు అందించేలా టాటా ట్రస్ట్స్‌ మరో ప్రతిపాదనను తెరపైకి తెచ్చింది. 

సమస్యకు సామరస్య పరిష్కారం... 
టాటా సన్స్‌ లిస్టింగ్‌ అనేది ఒక వారధిగా మారగలదని మిస్త్రీ వ్యాఖ్యానించారు. ఈ అంశం విభేదాలకు ములంగా మారకుండా... వాటాదారులు, టాటా ట్రస్ట్స్, ఇతర పక్షాల మధ్య సయోధ్య కుదరాలని ఆకాంక్షించారు. ఈ విషయాన్ని సామరస్యంగా, ఉమ్మడి లక్ష్యంతో పరిష్కరించుకోవాలని టాటా గ్రూప్‌ ట్రస్టీలు, డైరెక్టర్లు, వాటాదారులు, ఉద్యోగులను కోరారు. 

మరింత లోతైన, సౌహార్ద్రపూర్వక సంబంధాల కోసం టాటా సన్స్, ట్రస్ట్‌లతో కలిసి పని చేయడానికి ఎస్‌పీ గ్రూప్‌ సిద్ధంగా ఉందని కూడా మిస్త్రీ పేర్కొన్నారు. ఏ ఒక్క పక్షానికో విజయం చేకూర్చడం కాకుండా.. పటిష్టమైన టాటా సామ్రాజ్యం, బలమైన దాతృత్వం, మరింత జవాబుదారీతనం, విస్తృత భాగస్వామ్యం.. అంతిమంగా భారత్‌కు మరింత సేవ చేయడమే లక్ష్యమని స్పష్టం చేశారు.  

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement