27 ఏళ్ల యువకుడు.. రూ.9,100 కోట్లకు అధిపతి! | Meet Pearl Kapur, India's Youngest Billionaire | Sakshi
Sakshi News home page

27 ఏళ్ల యువకుడు.. రూ.9,100 కోట్లకు అధిపతి!

Feb 10 2024 9:42 AM | Updated on Feb 10 2024 10:00 AM

Meet Pearl Kapur India Youngest Billionaire - Sakshi

‘మన చుట్టూ ఎన్నో సమస్యలున్నాయి.పెద్దయ్యాక వాటికి పరిష్కారం వెతకాలి.’ - ఒకప్పటి పిల్లలు ఇలాగే ఆలోచించేవారు. కానీ నేటితరంవాళ్లు పెద్దయ్యేదాకా ఆగాలనుకోవడం లేదు. టెక్నాలజీతో అద్భుతాలు చేస్తున్నారు. అలాంటి వారిలో 27 ఏళ్ల పెరల్ కపూర్ ఒకరు. అప్పుడప్పుడే సంపాదనవైపు అడుగులు వేసే సమయంలో ఓ కంపెనీని స్థాపించారు. అనతి కాలంలో భారత్‌లోనే అత్యంత పిన్న వయస్కుడైన బిలియనీర్‌గా చరిత్ర సృష్టించాడు.  

ఆంత్రప్రెన్యూర్‌లకు భారత్‌ స్వర్గధామంగా మారుతోంది. గత కొన్నేళ్లుగా మన దేశంలోనూ యూనికార్న్‌ కంపెనీల హవా నడుస్తోంది. ఒకప్పుడు యూనికార్న్‌ హోదా సాధించేందుకు దశబాద్ధాల తరబడి ఎదురు చూసిన స్టార్టప్‌లు ఇప్పుడు నెలల వ్యవధిలోనే యూనికార్న్‌లుగా మారిపోతున్నాయి. వ్యాపారంలో రయ్‌ రయ్‌ మంటూ దూసుకుపోతున్నాయి.

పెరల్‌ కపూర్‌ ‘జైబర్ 365’ అనే స్టార్టప్‌ సంస్థ కూడా అంతే. గత ఏడాది మేలో తన కార్యకలాపాల్ని ప్రారంభించిన ఈ సంస్థ వెబ్‌3, ఏఐ ఓఎస్‌ ఆధారిత సేవల్ని అందిస్తుంది. ప్రారంభమైన కొద్ది కాలంలో భారత్‌, ఆసియా దేశాల్లో ఫాస్టెస్ట్‌ యూనికార్న్‌ కంపెనీగా అవతరించింది. 

వడివడిగా అడుగులేస్తూ 
ఏఎంపీఎస్‌ స్టోర్‌లో ఫైనాన్షియల్ అడ్వైజర్‌గా, యాంటీయర్ సొల్యూషన్స్‌కు బిజినెస్ అడ్వైజర్‌గా ఇలా పలు కంపెనీల్లో ప్రముఖ పాత్ర పోషించిన పెరల్‌ తొలిసారి ఫిబ్రవరి 2022లో బిలియన్ పే టెక్నాలజీస్ ప్రైవేట్ లిమిటెడ్‌ని స్థాపించారు. తన జైత్రయాత్రను ప్రారంభించారు. బిలియన్‌ పే టెక్నాలజీ తర్వాత జైబర్ 365 ప్రారంభానికి శ్రీకారం చుట్టారు.   

పెరల్‌ కపూర్‌ చదువు, సంస్థ విషయానికొస్తే 
పెరల్‌ క్వీన్ మేరీ యూనివర్శిటీ ఆఫ్ లండన్ నుండి ఎంఎస్‌సీ ఇన్వెస్ట్‌మెంట్ బ్యాంకింగ్ పూర్తి చేశారు. అనంతరం పలు సంస్థల్లో పనిచేశారు. అనంతరం భవిష్యత్‌లో బ్లాక్‌ చైన్‌, ఏఐ, సైబర్‌ సెక్యూరిటీ బూమ్‌ను ముందుగానే అంచనా వేశాడు. జైబర్ 365ని ప్రారంభించాడు. ప్రస్తుతం యూనికార్న్‌గా అవతరిండచంతో పాటు పెరల్‌ అత్యంత పిన్న వయస్సుల్లో బిలియనీర్‌ని చేసింది. కాగా, ప్రస్తుతం ఆ సంస్థ తిరుగులేని యూనికార్న్‌ కంపెనీగా వృద్ది సాధిస్తున్నట్లు మార్కెట్‌ విశ్లేషకులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.

Advertisement
 
Advertisement
Advertisement