పోటీ ప్రపంచంలో చదివి ఉద్యోగం తెచ్చుకోవడం ఒక సాహసం అయితే.. ఉన్న జాబ్ ఎప్పుడు ఊడిపోతుందో కూడా తెలియని పరిస్థితులు నెలకొన్నాయి. మైక్రోసాఫ్ట్, అమెజాన్, ఓరాకిల్, గూగుల్, టీసీఎస్ వంటి దిగ్గజ సంస్థలు సైతం.. ఖర్చులను తగ్గించుకోవడానికి, పునర్వ్యవస్థీకరణ పేరుతో లెక్కకు మించిన ఉద్యోగులను తొలగించేస్తున్నాయి. ఇప్పుడు దీనికి ఏఐ కూడా తోడైంది. దీంతో టెక్ రంగంలో తీవ్రమైన అలజడి మొదలైపోయింది. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) ఉద్యోగులను భర్తీ చేస్తుందని కొందరు చెబుతుంటే.. ఏఐ వల్ల కొత్త ఉద్యోగాలు పుట్టుకొస్తాయని ఇంకొందరు చెబుతున్నారు. ఈ సమయంలో బాబా వంగా అంచనాలు సోషల్ మీడియా ప్లాట్ఫామ్లలో వైరల్ అవుతున్నాయి.
బాల్కన్ ప్రాంతపు నోస్ట్రడామస్ అని పిలువబడే బాబా వంగా.. అంధురాలైనప్పటికీ, భవిష్యత్తును ముందుగానే చూడగల శక్తి తనకు ఉందని అనేక మంది విశ్వసించారు. రెండో ప్రపంచ యుద్ధం, సెప్టెంబర్ దాడులు, హిందూ మహాసముద్రం సునామీ వంటి కొన్ని ప్రధాన సంఘటనలు.. ఆమె అంచనాలకు సరిపోలినట్టు కొందరు భావించారు. ఈ కారణంగానే ఈమె పేరుకు ప్రత్యేక ప్రాధాన్యం ఏర్పడింది.
బాబా వంగా 1996లో మరణించినప్పటికీ.. ఆమె అంచనాలు ఇప్పటికీ చర్చకు దారి తీస్తూనే ఉన్నాయి. ఇప్పుడు తాజాగా ఆమె చేసిన ఒక టెక్ ప్రపంచానికి సంబంధించిన విషయం వైరల్ అయింది.
2026 సంవత్సరం AI రంగంలో ఒక కీలక మలుపు అవుతుందని, అది మన రోజువారీ జీవితాలపై తీవ్ర ప్రభావం చూపుతూ మానవ నియంత్రణకు మించి వెళ్లే అవకాశం ఉందని బాబా వంగ చెప్పినట్లు సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతోంది.
ఇదీ చదవండి: మరో ఐదేళ్లలో ఆ ఉద్యోగాలన్నీ మాయం!
ప్రస్తుతం ఏఐ చాలా వేగంగా అభివృద్ధి చెందుతోంది. మెషీన్ లెర్నింగ్, ఆటోమేషన్, చాట్బాట్స్, ఆటోమాటిక్ వాహనాలు వంటి సాంకేతికతలు ప్రజల జీవితాలను సులభతరం చేస్తున్నాయి. అయితే.. ఇవన్నీ ఉద్యోగాలపై తీవ్రమైన ప్రభావం చూపుతున్నాయి. AI మనుషులను భర్తీ చేస్తుందా? లేక మానవులకు తోడ్పడే సాధనంగా మారుతుందా? అనే ప్రశ్నలు ప్రజలలో ఆందోళన కలిగిస్తున్నాయి.
బాబా వంగా అంచనాలు పక్కన పెడితే.. ప్రస్తుత పరిస్థితులు కూడా ఏఐ వల్ల ఉద్యోగాలు పోతాయనే చెబుతున్నాయి. ప్రముఖ పారిశ్రామికవేత్త & వెంచర్ క్యాపిటలిస్ట్ 'వినోద్ ఖోస్లా' కూడా ఏఐ కారణంగా.. మరో ఐదేళ్లలో వైట్ కాలర్ ఉద్యోగాలలో భారీ మార్పులు చోటు చేసుకుంటాయని, ముఖ్యంగా ఐటీ సర్వీస్, బీపీఓ రంగాలు దాదాపు పూర్తిగా కనుమరుగయ్యే పరిస్థితి ఏర్పడవచ్చని హెచ్చరించారు.


