కొత్త కారు కొనేవారికి మారుతి సుజుకీ షాక్!

Maruti Suzuki to hike vehicle prices from next month January - Sakshi

మీరు రాబోయే కొత్త ఏడాదిలో కొత్త కారు కొనాలని చూస్తున్నారా? అయితే.. మీకు ఒక షాకింగ్ న్యూస్. దేశీయ ఆటో రంగ దిగ్గజం మారుతి సుజుకీ కార్ల ధరలను పెంచనున్నట్లు ప్రకటించింది. ఈ ఏడాదిలో వాహనాల ఉత్పత్తి వ్యయం గణనీయంగా పెరగడంతో కార్ల ధరలను పెంచాలనే నిర్ణయానికి వచ్చినట్లు ఆటోమేకర్ పేర్కొంది. వివిధ ఇన్ పుట్ ఖర్చులు పెరగడం వల్ల గత ఏడాది కాలంలో వాహనాల ఖర్చుపై ప్రతికూల ప్రభావం పడుతుందని మారుతి సుజుకి ఒక అధికారిక ప్రకటనలో తెలిపింది. వచ్చే ఏడాది జనవరి నుంచి తమ అన్ని మోడళ్ల ధరలను పెంచాలని యోచిస్తున్నట్లు కంపెనీ గురువారం తెలిపింది.

అయితే, ధరల పెరుగుదల వివిధ మోడల్స్ బట్టి మారుతుందని తెలిపింది. కార్ల ధరల పెంపు మొదటిసారి కాదు, ఈ సంవత్సరం ప్రారంభంలో అతిపెద్ద కార్ల తయారీదారు దేశవ్యాప్తంగా కార్ల ధరలను రూ.34,000 వరకు పెంచింది. ముడి పదార్థాల ఖర్చులు పెరగడం, ఆటో పరిశ్రమ గత కొన్ని నెలలుగా కష్ట కాలాన్ని ఎదుర్కొంటున్నట్లు కంపెనీ పేర్కొంది. అలాగే, ఈ ఏడాది సెప్టెంబర్ నెలలో మారుతి సుజుకి ధరల పెంపును ప్రకటించింది. కార్ల తయారీదారు తన ఎంపిక చేసిన మోడల్స్ బట్టి ధరల పెంపు ₹1,000 నుంచి ₹22,500 వరకు ఉంది.

ఇప్పటికే దెబ్బతిన్న పరిశ్రమను చిప్ కొరత, పెరుగుతున్న ముడి పదార్థాల ధరలు, కంటైనర్లు అందుబాటులో లేకపోవడం, అధిక షిప్పింగ్ రేట్లు ఇంకా దెబ్బతీస్తున్నాయని సంస్థ తెలిపింది. స్టీల్ & మెగ్నీషియం వంటి కీలక ముడి పదార్థాలకు లభ్యత లేకపోవడం కూడా పరిశ్రమపై ఎక్కువ ప్రభావం చూపిస్తున్నట్లు తెలిపింది. మారుతి సుజుకి ఇప్పటికే ధరల పెంపును ప్రకటించడంతో, ఇతర కార్ల తయారీదారులు కూడా ఇదే మార్గంలో నడవాలని చూస్తున్నాయి. 

(చదవండి: కియా నుంచి మరో కొత్త కారు...! ఇది వస్తే గేమ్‌ ఛేంజరే..!)

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top