నయా జోష్‌- 48,000 చేరువలో సెన్సెక్స్‌  | Market up- Sensex near 48000 mark | Sakshi
Sakshi News home page

నయా జోష్‌- 48,000 చేరువలో సెన్సెక్స్‌ 

Jan 1 2021 10:03 AM | Updated on Jan 1 2021 4:23 PM

Market up- Sensex near 48000 mark - Sakshi

ముంబై, సాక్షి: కొత్త ఏడాది తొలి రోజు దేశీ స్టాక్‌ మార్కెట్లకు కొత్త జోష్‌ వచ్చింది. దీంతో సెన్సెక్స్‌ 48,000 మైలురాయివైపు కదులుతుంటే.. నిఫ్టీ 14,000 పాయింట్ల మార్క్‌ను దాటేసింది. ప్రస్తుతం సెన్సెక్స్‌ 193 పాయింట్లు ఎగసి 47,944కు చేరగా.. నిఫ్టీ 49 పాయింట్లు పుంజుకుని 14,031 వద్ద ట్రేడవుతోంది. వెరసి వరుసగా ఏడో రోజు మార్కెట్లు ర్యాలీ బాటలో సాగుతున్నాయి. గత వారానికల్లా నిరుద్యోగ క్లెయిములు తగ్గడంతో గురువారం యూఎస్‌ మార్కెట్లు 0.6 శాతం స్థాయిలో బలపడ్డాయి. మరోసారి రికార్డు గరిష్టాల వద్ద ముగిశాయి. దీనికితోడు కోవిడ్‌-19 కట్టడికి ఫైజర్‌ అభివృద్ధి చేసిన వ్యాక్సిన్‌కు ప్రపంచ ఆరోగ్య సంస్థ(WHO) గుర్తింపును ఇవ్వడంతో సెంటిమెంటు బలపడినట్లు నిపుణులు పేర్కొన్నారు.  ఇంట్రాడేలో సెన్సెక్స్‌ 47,944కు చేరగా.. నిఫ్టీ 14,033ను తాకింది. ఇవి సరికొత్త గరిష్టాలు కావడం విశేషం! (ఈ కొత్త కుబేరుడు- ఆసియాలోనే టాప్‌)

ఫార్మా, మెటల్‌ వీక్‌
ఎన్‌ఎస్‌ఈలో పీఎస్‌యూ బ్యాంక్స్‌ 2.2 శాతం లాభపడగా.. మీడియా, ఐటీ, ఆటో 0.6 శాతం చొప్పున పుంజుకున్నాయి. మెటల్‌, ఫార్మా స్వల్ప వెనకడుగులో ఉన్నాయి. నిఫ్టీ దిగ్గజాలలో ఎంఅండ్‌ఎం, యూపీఎల్‌, టీసీఎస్‌, ఎస్‌బీఐ, హెచ్‌డీఎఫ్‌సీ, శ్రీ సిమెంట్‌, టాటా మోటార్స్‌, అల్ట్రాటెక్, ఐటీసీ, ఇన్ఫోసిస్‌, బజాజ్‌ ఫైనాన్స్‌ 2-0.5 శాతం మధ్య ఎగశాయి. అయితే సన్‌ ఫార్మా, హిందాల్కో, గ్రాసిమ్‌, ఎస్‌బీఐ లైఫ్‌, ఐషర్, గెయిల్‌, టాటా స్టీల్‌ 1-0.4 శాతం మధ్య డీలా పడ్డాయి.

బీఈఎల్‌ జూమ్‌ 
డెరివేటివ్‌ స్టాక్స్‌లో బీఈఎల్‌, లాల్‌పాథ్‌, పీఎన్‌బీ, బీవోబీ, ఎస్కార్ట్స్‌, ఎల్‌ఐసీ హౌసింగ్‌, హెచ్‌డీఎఫ్‌సీ ఏఎంసీ, చోళమండలం, ఎంఅండ్‌ఎం ఫైనాన్స్‌ 5-2 శాతం మధ్య జంప్‌చేశాయి. కాగా.. మరోవైపు ఇండిగో, గోద్రెజ్‌ ప్రాపర్టీస్‌, బంధన్‌ బ్యాంక్‌, సెయిల్‌, అరబిందో, వేదాంతా 1-0.6 శాతం మధ్య క్షీణించాయి. బీఎస్‌ఈలో మిడ్‌, స్మాల్‌ క్యాప్స్‌ 0.6 శాతం చొప్పున పుంజుకున్నాయి. ఇప్పటివరకూ ట్రేడైన షేర్లలో 1,607 లాభపడగా.. 586 మాత్రమే నష్టాలతో కదులుతున్నాయి. 

ఎఫ్‌పీఐల జోరు
నగదు విభాగంలో గురువారం విదేశీ పోర్ట్‌ఫోలియో ఇన్వెస్టర్లు(ఎఫ్‌పీఐలు) రూ. 1,136 కోట్లను ఇన్వెస్ట్‌ చేయగా.. దేశీ ఫండ్స్‌(డీఐఐలు) రూ. 258 కోట్ల పెట్టుబడులను వెనక్కి తీసుకున్నాయి. బుధవారం ఎఫ్‌పీఐలు రూ, 1,825 కోట్ల విలువైన స్టాక్స్‌ కొనుగోలు చేయగా.. డీఐఐలు రూ. 587 కోట్ల విలువైన అమ్మకాలు చేపట్టిన విషయం విదితమే. 

Advertisement
 
Advertisement
Advertisement