రికార్డులతో ప్రారంభమై.. ఫ్లాట్‌గా | Market open new highs- trading flat | Sakshi
Sakshi News home page

రికార్డులతో ప్రారంభమై.. ఫ్లాట్‌గా

Jan 6 2021 10:06 AM | Updated on Jan 6 2021 10:32 AM

Market open new highs- trading flat - Sakshi

ముంబై, సాక్షి: వరుసగా 11వ రోజూ దేశీ స్టాక్‌ మార్కెట్లు సానుకూలంగా ప్రారంభమయ్యాయి. అయితే వెనువెంటనే ఒడిదొడుకులకు తెరలేచింది. ప్రస్తుతం సెన్సెక్స్‌ 64 పాయింట్లు పుంజుకుని 48,502కు చేరింది. నిఫ్టీ సైతం 22 పాయింట్లు లాభపడి 14,221 వద్ద ట్రేడవుతోంది. తొలుత సెన్సెక్స్‌ 48,617 సమీపానికి చేరింది. నిఫ్టీ సైతం 14,244 పాయింట్ల వరకూ ఎగసింది. ఇవి సరికొత్త గరిష్టాలుకాగా.. ఇంట్రాడేలో సెన్సెక్స్‌ 48,373 దిగువన, నిఫ్టీ 14,183 వద్ద కనిష్టాలను చవిచూశాయి. కోవిడ్‌-19 కట్టడికి వ్యాక్సిన్ల అందుబాటు, విదేశీ ఇన్వెస్టర్ల పెట్టుబడుల వెల్లువ వంటి అంశాలు ఇన్వెస్టర్లకు జోష్‌నిస్తున్నట్లు నిపుణులు పేర్కొన్నారు. అయితే ఇటీవల మార్కెట్లు నిరవధిక ర్యాలీ బాటలో సాగుతుండటంతో ట్రేడర్లు కొంతమేర అప్రమత్తంగా వ్యవహరిస్తున్నట్లు చెప్పారు.  

ప్రభుత్వ బ్యాంక్స్‌ జోరు
ఎన్‌ఎస్‌ఈలో పీఎస్‌యూ బ్యాంక్స్‌, మీడియా, ఆటో, మెటల్‌ 2-0.6 శాతం మధ్య బలపడ్డాయి. అయితే ఎఫ్‌ఎంసీజీ, ఫార్మా 0.5-0.2 శాతం చొప్పున డీలా పడ్డాయి. నిఫ్టీ దిగ్గజాలలో గెయిల్‌, ఓఎన్‌జీసీ, ఎస్‌బీఐ, టైటన్‌, ఐవోసీ, ఐసీఐసీఐ, ఎయిర్‌టెల్‌, టెక్‌ మహీంద్రా, మారుతీ 3.3-1 శాతం మధ్య జంప్‌ ఎగశాయి. ఇతర బ్లూచిప్స్‌లో ఐటీసీ, ఆర్‌ఐఎల్‌, హెచ్‌యూఎల్‌, ఐషర్, అల్ట్రాటెక్‌, హిందాల్కో, హెచ్‌డీఎఫ్‌సీ లైఫ్‌, కొటక్‌ బ్యాంక్‌, యాక్సిస్‌ 1.3-0.3 శాతం మధ్య క్షీణించాయి. 

నౌకరీ జూమ్‌
డెరివేటివ్‌ స్టాక్స్‌లో నౌకరీ, వేదాంతా, కంకార్‌, బాటా, ఎన్‌ఎండీసీ, టాటా కెమ్‌, శ్రీరామ్‌ ట్రాన్స్‌, ఇండస్‌ టవర్‌, బీవోబీ 6-2.5 శాతం మధ్య జంప్‌చేశాయి. కాగా.. మరోపక్క లుపిన్‌, గోద్రెజ్‌ ప్రాపర్టీస్‌, ఆర్తి ఇండస్ట్రీస్‌, అరబిందో ఫార్మా, బయోకాన్‌, పిరమల్‌ 3-1 శాతం మధ్య నీరసించాయి. బీఎస్‌ఈలో మిడ్, స్మాల్‌ క్యాప్స్‌ 0.5 శాతం చొప్పున ఎగశాయి. ఇప్పటివరకూ 1,711 షేర్లు లాభపడగా.. 700 మాత్రమే నష్టాలతో కదులుతున్నాయి. 

ఎఫ్‌పీఐలు ఓకే
నగదు విభాగంలో మంగళవారం విదేశీ పోర్ట్‌ఫోలియో ఇన్వెస్టర్లు(ఎఫ్‌పీఐలు) రూ. 986 కోట్లు ఇన్వెస్ట్‌ చేయగా.. దేశీ ఫండ్స్‌(డీఐఐలు) రూ. 490 కోట్ల పెట్టుబడులను వెనక్కి తీసుకున్నాయి. సోమవారం ఎఫ్‌పీఐలు రూ. 1,843 కోట్ల విలువైన స్టాక్స్‌ కొనుగోలు చేయగా.. డీఐఐలు రూ. 715 కోట్ల విలువైన అమ్మకాలు చేపట్టిన విషయం విదితమే.

Advertisement
 
Advertisement
Advertisement