చివర్లో లాభాల్లోకి.. మార్కెట్లు ఫ్లాట్‌ | Sakshi
Sakshi News home page

చివర్లో లాభాల్లోకి.. మార్కెట్లు ఫ్లాట్‌

Published Tue, Dec 15 2020 3:54 PM

Market ends flat despite weak session - Sakshi

ముంబై, సాక్షి: రెండు రోజుల వరుస ర్యాలీకి తొలుత బ్రేక్‌ పడినప్పటికీ చివర్లో మార్కెట్లు కోలుకున్నాయి. వెరసి నామమాత్ర లాభాలతో నిలిచాయి. రోజంతా ఇన్వెస్టర్లు అమ్మకాలకే ప్రాధాన్యత ఇవ్వడంతో మార్కెట్లు చివరివరకూ నీరసంగా కదిలాయి. సెన్సెక్స్‌ 10 పాయింట్ల నామమాత్ర లాభంతో 46,263 వద్ద ముగిసింది. నిఫ్టీ సైతం 10 పాయింట్లు బలపడి13,568 వద్ద స్థిరపడింది. సోమవారం యూఎస్‌ మార్కెట్లు 0.5 శాతం స్థాయిలో వెనకడుగు వేయడంతో దేశీయంగానూ సెంటిమెంటు బలహీనపడినట్లు నిపుణులు పేర్కొన్నారు. దీంతో ఇంట్రాడేలో సెన్సెక్స్‌ చివర్లో 46,350 వద్ద గరిష్టాన్ని తాకగా.. తొలుత 45,966 వద్ద కనిష్టానికి చేరింది. ఈ బాటలో నిఫ్టీ 13,590-13,447 పాయింట్ల మధ్య ఊగిసలాడింది. 

ఐటీ సైతం
ఎన్‌ఎస్‌ఈలో పీఎస్‌యూ బ్యాంకింగ్‌, ఎఫ్‌ఎంసీజీ, రియల్టీ, ఫార్మా, ఐటీ 1.5- 0.2 శాతం మధ్య నీరసించగా.. మీడియా, మెటల్‌, ఆటో 1.7-0.6 శాతం స్థాయిలో బలపడ్డాయి. నిఫ్టీ దిగ్గజాలలో బజాజ్‌ ఫైనాన్స్‌, బజాజ్‌ ఫిన్, ఐషర్, జేఎస్‌డబ్ల్యూ స్టీల్‌, శ్రీసిమెంట్‌, హెచ్‌డీఎఫ్‌సీ, టెక్‌ మహీంద్రా, అదానీ పోర్ట్స్‌, అల్ట్రాటెక్‌, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్‌ 5-1.5 శాతం మధ్య బలపడ్డాయి. అయితే హెచ్‌యూఎల్‌, నెస్లే, బీపీసీఎల్‌, ఐసీఐసీఐ, యాక్సిస్‌, ఎస్‌బీఐ, టీసీఎస్‌, ఐటీసీ, ఓఎన్‌జీసీ, సిప్లా 2-1 శాతం మధ్య క్షీణించాయి.

జీ జూమ్‌
డెరివేటివ్స్‌లో జీ 7 శాతం జంప్‌చేయగా.. జీఎంఆర్, హావెల్స్‌, ఎల్‌అండ్‌టీ ఫైనాన్స్‌, భారత్ ఫోర్జ్‌, జిందాల్ స్టీల్‌, ఎంఅండ్‌ఎం ఫైనాన్స్‌ 5.5-3 శాతం మధ్య ఎగశాయి. కాగా.. మరోపక్క కెనరా బ్యాంక్‌ 5 శాతం పతనంకాగా.. ఇండిగో, ఐజీఎల్‌, పీవీఆర్‌, ఐసీఐసీఐ లంబార్డ్‌, గ్లెన్‌మార్క్‌, జూబిలెంట్‌ ఫుడ్‌, ఎంజీఎల్ 3.2-2 శాతం మధ్య వెనకడుగు వేశాయి. బీఎస్‌ఈలో మిడ్ క్యాప్‌ ఇండెక్స్‌ 0.4 శాతం పుంజుకుంది. ట్రేడైన షేర్లలో 1,550 లాభపడగా.. 1,422 నష్టాలతో ముగిశాయి.

ఎఫ్‌ఫీఐల ఇన్వెస్ట్‌మెంట్స్‌
నగదు విభాగంలో సోమవారం విదేశీ పోర్ట్‌ఫోలియో ఇన్వెస్టర్లు(ఎఫ్‌పీఐలు) రూ. 2,264 కోట్లకుపైగా ఇన్వెస్ట్‌ చేయగా.. దేశీ ఫండ్స్‌(డీఐఐలు) రూ. 1,721 కోట్ల పెట్టుబడులను వెనక్కి తీసుకున్నాయి. శుక్రవారం ఎఫ్‌పీఐలు రూ. 4,195 కోట్ల విలువైన స్టాక్స్‌ కొనుగోలు చేయగా.. డీఐఐలు రూ. 2,359 కోట్ల విలువైన అమ్మకాలు చేపట్టిన విషయం విదితమే. 

Advertisement
Advertisement