సూపర్‌ ర్యాలీకి బ్రేక్‌- బ్యాంక్స్‌ బోర్లా

Market down- rally breaks- banking plunges - Sakshi

అమ్మకాలతో 8 రోజుల వరుస లాభాకు చెక్‌

236 పాయింట్లు డౌన్‌- 43,357కు చేరిన సెన్సెక్స్‌

58 పాయింట్లు క్షీణించి 12,691 వద్ద నిలిచిన నిఫ్టీ

మెటల్‌ వీక్‌- ఎఫ్‌ఎంసీజీ, రియల్టీ, మీడియా ప్లస్

‌ బీఎస్‌ఈలో మిడ్‌, స్మాల్‌ క్యాప్స్‌ 0.5-1.2 శాతం అప్‌

ముంబై: చిట్టచివరికి 8 రోజుల వరుస లాభాలకు బ్రేక్‌ పడింది. తొలి నుంచీ ఇన్వెస్టర్లు అమ్మకాలకే ప్రాధాన్యత ఇవ్వడంతో మార్కెట్ల సూపర్‌ ర్యాలీకి బ్రేక్‌ పడింది. సెన్సెక్స్‌ 236 పాయింట్లు క్షీణించి 43,357 వద్ద ముగిసింది. ఈ నెలలో ఇప్పటివరకూ సెన్సెక్స్‌ ఏకంగా 10 శాతం ర్యాలీ చేయడం విశేషం. నిఫ్టీ 58 పాయింట్లు క్షీణించి 12,691 వద్ద నిలిచింది. ఇంట్రాడేలో సెన్సెక్స్‌ 43,544 పాయింట్ల వద్ద గరిష్టానికి చేరగా.. 43,128 దిగువన కనిష్టాన్నీ తాకింది. నిఫ్టీ సైతం 12,741- 12,625 పాయింట్ల మధ్య ఊగిసలాడింది. అమెరికా ఎన్నికలు ముగియడం, ఆర్థిక మంత్రి ప్యాకేజీ నేపథ్యంలో ట్రేడర్లు లాభాల స్వీకరణకు మొగ్గు చూపినట్లు విశ్లేషకులు తెలియజేశారు. 

రియల్టీ అప్‌
ఎన్‌ఎస్‌ఈలో ప్రధానంగా బ్యాంకింగ్ 2 శాతం పతనంకాగా.. ఎఫ్‌ఎంసీజీ, రియల్టీ, మీడియా, ఆటో, ఫార్మా 1.3-0.3 శాతం మధ్య పుంజుకున్నాయి. నిఫ్టీ దిగ్గజాలలో ఎస్‌బీఐ, కొటక్‌ బ్యాంక్‌, కోల్ ఇండియా, ఇండస్‌ఇండ్‌, ఎన్‌టీపీసీ, ఐసీఐసీఐ, యాక్సిస్‌, జేఎస్‌డబ్ల్యూ స్టీల్‌, యూపీఎల్‌, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్‌ 3-1.2 శాతం మధ్య డీలాపడ్డాయి. అయితే హెచ్‌యూఎల్‌, గ్రాసిమ్‌, శ్రీ సిమెంట్‌, హిందాల్కో, ఐటీసీ, ఎల్‌అండ్‌టీ, హెచ్‌డీఎఫ్‌సీ లైఫ్‌, బజాజ్‌ ఫిన్‌, ఐషర్‌, బజాజ్‌ ఫైనాన్స్‌ 3.3-1 శాతం మధ్య ఎగశాయి.

ఐబీ హౌసింగ్ జోరు
డెరివేటివ్స్‌లో ఐబీ హౌసింగ్‌, కమిన్స్‌, బాలకృష్ణ, ఎక్సైడ్‌, నౌకరీ, చోళమండలం, అరబిందో ఫార్మా 8-3.6 శాతం మధ్య జంప్‌చేశాయి. కాగా.. అపోలో హాస్పిటల్స్‌, బీవోబీ, ఎస్‌బీఐ, బాష్‌, టాటా పవర్‌, కెనరా బ్యాంక్‌, శ్రీరామ్‌ ట్రాన్స్‌ 4-2.7 శాతం మధ్య పతనమయ్యాయి. బీఎస్‌ఈలో మిడ్‌ క్యాప్‌ 0.5 శాతం, స్మాల్‌ క్యాప్‌ 1.2 శాతం చొప్పున బలపడ్డాయి. ట్రేడైన షేర్లలో 1,557 లాభపడగా.. 1,140 నష్టపోయాయి.

ఎఫ్‌పీఐల కొనుగోళ్లు
నగదు విభాగంలో బుధవారం విదేశీ పోర్ట్‌ఫోలియో ఇన్వెస్టర్లు(ఎఫ్‌పీఐలు) రూ. 6,207 కోట్లను ఇన్వెస్ట్ చేయగా.. దేశీ ఫండ్స్‌(డీఐఐలు) దాదాపు రూ. 3,464 కోట్ల విలువైన అమ్మకాలు చేపట్టాయి. మంగళవారం ఎఫ్‌పీఐలు రూ. 5,627 కోట్ల విలువైన స్టాక్స్‌ కొనుగోలు చేశారు. అయితే డీఐఐలు రూ. 2,309 కోట్ల పెట్టుబడులను వెనక్కి తీసుకున్న సంగతి తెలిసిందే.

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top