స్పైస్‌జెట్‌ ప్రతిపాదనలను అంగీకరించం

Latest Update in Spice jet Airways And Kalanithi Maran Dispute - Sakshi

సుప్రీంకోర్టుకు విన్నవించిన

కేఏఎల్‌ ఎయిర్‌వేస్, కళానిధి మారన్‌  

న్యూఢిల్లీ: స్పైస్‌జెట్‌తో రూ.600 కోట్ల తమ వివిద పరిష్కారానికి సంబంధించి ఆ సంస్థ చేసిన రెండు ప్రతిపాదనలూ తమకు ఆమోదయోగం కాదని కేఏఎల్‌ ఎయిర్‌వేస్, మీడియా దిగ్గజం కళానిధి మారన్‌లు సుప్రీంకోర్టుకు తెలియజేశారు. స్పైస్‌జెట్‌ రెండు ప్రతిపాదనలను అంగీకరిస్తారా? అని ప్రధాన న్యాయమూర్తి ఎన్‌వీ రమణ, న్యాయమూర్తులు ఎఎస్‌ బోపన్న, హిమా కోహ్లీలతో కూడిన ధర్మాసనం  కాల్‌ ఎయిర్‌వేస్‌ ప్రైవేట్‌ లిమిటెడ్, మారన్‌ల అభిప్రాయాన్ని అడిగినప్పుడు, ఈ ప్రతిపాదనలు ఆమోదయోగం కాదని పేర్కొన్నాయి. కేసు తదుపరి విచారణ మార్చి 2వ తేదీకి వాయిదా పడింది. కళానిధి మారన్‌ స్పైస్‌జెట్‌ మాజీ ప్రమోటర్‌. ఆయనకు చెందిన కేఏఎల్‌ ఎయిర్‌వేస్‌ ఎయిర్‌లైన్‌ ట్రాన్స్‌పోర్ట్‌ సేవలను నిర్వహిస్తోంది. 

కేసు వివరాలు క్లుప్తంగా... 
కేఏఎల్, మారన్‌లు స్పైస్‌జెట్‌లో తమ షేర్‌హోల్డింగ్‌ను 2015 ఫిబ్రవరిలో  కంట్రోలింగ్‌ షేర్‌హోల్డర్, సహ వ్యవస్థాపకుడు అజయ్‌ సింగ్‌కు బదలాయించారు. అయితే ఈ డీల్‌కు సంబంధించి ప్రిఫర్డ్‌ షేర్లు, వారెంట్లను మారన్‌కు అనుకూలంగా జారీ చేయకపోవడంపై వివాదం నెలకొంది. స్పైస్‌జెట్‌లోని తమ మొత్తం 350.4 మిలియన్ల ఈక్విటీ షేర్లను, ఎయిర్‌లైన్‌లో 58.46 శాతం వాటాను దాని సహ వ్యవస్థాపకుడు సింగ్‌కు ఫిబ్రవరి 2015లో కేవలం రూ. 2కి  మారన్, కేఏఎల్‌ ఎయిర్‌వేస్‌కు చేశారు. స్పైస్‌జెట్‌తో వాటా బదిలీ వివాదంపై మారన్‌ కేఏఎల్‌ ఎయిర్‌వేస్‌ ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించాయి. ఈక్విటీ షేర్లుగా రీడీమబుల్‌ చేయదగిన 18 కోట్ల వారెంట్లను తమకు బదలాయించాలని డిమాండ్‌ చేశాయి. 2016 జూలై 29న హైకోర్టు రూలింగ్‌ ఇస్తూ, ఆర్బిట్రేషన్‌ కింద వివాదాన్ని పరిష్కరించుకోవాలని సూచించింది. రూ.579 కోట్లను హైకోర్టు రిజిస్ట్రీ వద్ద డిపాజిట్‌ చేయాలని కూడా స్పైస్‌జెట్, సింగ్‌ను హైకోర్టు ఆదేశించింది. అయితే కోర్టు తదుపరి ఆదేశాల మేరకు స్పైస్‌జెట్‌ హైకోర్టులో రూ.329 కోట్ల బ్యాంక్‌ గ్యారెంటీని, రూ.250 కోట్ల నగదును డిపాజిట్‌ చేసింది. అయితే దీనిపై స్పైస్‌జెట్‌ చేసిన అప్పీల్‌ను 2017 జూలైలో అత్యున్నత న్యాయస్థానం కొట్టివేసింది. మరోవైపు 2018 జూలై 20వ తేదీన ఆర్బిట్రేషన్‌ ట్రిబ్యునల్‌ అవార్డు ఇస్తూ, వారెంట్లు ఇష్యూ చేయనందుకు రూ.1,323 కోట్ల నష్టపరిహారాన్ని ఇవ్వాలన్న మారన్‌ కేఏఎల్‌ క్లెయిమ్‌ను కొట్టేసింది. అయితే వడ్డీసహా రూ.579 కోట్ల రిఫండ్‌ చేయాలని ఆదేశించింది. ఆర్బిట్రేషన్‌ అవార్డుపై సన్‌ టీవీ నెట్‌వర్క్‌ యజమాని కూడా అయిన మారన్, కేఏఎల్‌ ఎయిర్‌వేస్‌లు ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించాయి. దీనిపై ఢిల్లీ హైకోర్టు 2020 నవంబర్‌ 2వ తేదీన ఆదేశాలు ఇస్తూ, ఈ వివాదంలో వడ్డీకి సంబంధించి రూ.243 కోట్ల డిపాజిట్‌ చేయలని స్సైస్‌జెట్‌ను ఆదేశించింది. స్పైస్‌జెట్‌ నవంబర్‌ 7న సుప్రీంకోర్టును ఆశ్రయించి, ఈ ఉత్తర్వుపై స్టే పొందింది.  

రెండు ప్రతిపాదనలు ఇవీ.. 
అత్యున్నత న్యాయస్థానంలో వివాద శాశ్వత పరిష్కారానికి స్పైస్‌జెట్‌ రెండు ప్రతిపాదనలు చేసింది. అందులో ఒకటి– ఫుల్‌ అండ్‌ ఫైనల్‌ సెటిల్‌మెంట్‌గా రూ.300 కోట్ల చెల్లింపులు. ఢిల్లీ హైకోర్టులో డిపాజిట్‌ చేసిన రూ. 270 కోట్ల బ్యాంక్‌ గ్యారెంటీలో ప్రస్తుతానికి రూ.100 కోట్లు చెల్లించి, కేసు తదుపరి విచారణ ఢిల్లీ హైకోర్టులో వేగవంతం చేసేలా సుప్రీంకోర్టు నుంచి ఆదేశాలు పొందడం రెండవ ఆఫర్‌. తాజాగా ఈ రెండు ఆఫర్లను కేఏఎల్‌ ఎయిర్‌వేస్, మారన్‌లు తిరస్కరించారు. ఆర్బిట్రేషన్‌ అవార్డు కింద తమకు రూ.920 కోట్లు స్పైస్‌జెట్‌  నుంచి రావాల్సి ఉందని డిమాండ్‌ చేశాయి.   

 

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top