ఆర్బీఐ కొట్టిన దెబ్బ.. షేర్లు భారీగా పతనం | Kotak Mahindra Shares Fall After RBI action | Sakshi
Sakshi News home page

ఆర్బీఐ కొట్టిన దెబ్బ.. షేర్లు భారీగా పతనం

Apr 26 2024 8:53 AM | Updated on Apr 27 2024 7:34 AM

Kotak Mahindra Shares Fall After RBI action

రిజర్వ్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా (RBI) కొట్టిన దెబ్బతో ప్రైవేట్‌ రంగ కోటక్‌ మహీంద్రా బ్యాంక్‌ షేర్లు భారీగా పతనమయ్యాయి. దాని వ్యవస్థాపకుడు, మాజీ సీఈవో ఉదయ్‌ కోటక్‌ సంపదకు కూడా భారీగా గండి పడింది.

కోటక్‌ మహీంద్రా బ్యాంక్‌పై రిజర్వ్‌ బ్యాంక్‌ చర్యలు తీసుకుంది. ఆన్‌లైన్, మొబైల్‌ బ్యాంకింగ్‌ మాధ్యమాల ద్వారా కొత్త కస్టమర్లను చేర్చుకోవద్దని ఆదేశించింది. అలాగే కొత్త క్రెడిట్‌ కార్డులను జారీ చేయకుండా ఆంక్షలు విధించింది. ఈ ఆదేశాలు తక్షణం అమల్లోకి వస్తాయి. బ్యాంకు ఐటీ రిస్క్‌ మేనేజ్‌మెంట్‌లో ‘తీవ్రమైన లోపాలు’ బయటపడటం ఇందుకు కారణమని ఆర్‌బీఐ పేర్కొంది.

ఆర్బీఐ చర్యల తర్వాత కోటక్ మహీంద్రా బ్యాంక్ షేర్లు గురువారం 13 శాతం వరకు పడిపోయాయి. కంపెనీలో దాదాపు 26 శాతం వాటాతో అతిపెద్ద వాటాదారుగా ఉన్న ఉదయ్‌ కోటక్‌ భారీ నష్టాన్ని చవిచూశారు. బ్లూమ్‌బెర్గ్ బిలియనీర్స్ ఇండెక్స్ ప్రకారం ఆయన సంపద 1.3 బిలియన్‌ డాలర్లు (సుమారు రూ.10 వేల కోట్లు) తగ్గింది. ఏప్రిల్ 24 నాటికి ఉదయ్‌ కోటక్‌ నెట్‌వర్త్‌ 14.4 బిలియన్ డాలర్లు (సుమారు రూ.1.1 లక్షల కోట్లు).

ప్రత్యర్థి యాక్సిస్ బ్యాంక్ లిమిటెడ్  2016 సెప్టెంబర్ తర్వాత మొదటిసారి కోటక్ మార్కెట్ క్యాపిటలైజేషన్‌ను అధిగమించింది. విశ్లేషకుల అంచనాలను అధిగమించిన తర్వాత యాక్సిస్ షేర్లు పుంజుకున్నాయి. కోటక్‌ మహీంద్రా బ్యాంక్ సీఈవోగా ఉదయ్‌ కోటక్‌ తప్పుకొన్న తర్వాత అశోక్‌ వాస్వానీ ప్రస్తుతం సీఈవోగా కొనసాగుతున్నారు.

Advertisement
 
Advertisement
Advertisement