దేశంలోని ధనవంతులు ఎక్కడ ఇన్వెస్ట్‌ చేస్తున్నారో తెలుసా?

India Rich People Invest Their Money In Equity, Bonds, Real Estate Says Survey - Sakshi

వాణిజ్య రియల్టీకి ద్వితీయ ప్రాధాన్యం 

సంపన్నుల ఐశ్వర్యం ఈ ఏడాది పైపైకే

నైట్‌ ఫ్రాంక్‌ సర్వే వెల్లడి 

న్యూఢిల్లీ: దేశంలోని అధిక ధనవంతులు ఎక్కడ ఇన్వెస్ట్‌ చేస్తారు? చాలా మందికి దీన్ని తెలుసుకోవాలని ఉంటుంది. ప్రాపర్టీ కన్సల్టెన్సీ సంస్థ ‘నైట్‌ ఫ్రాంక్‌’ సర్వే పరిశీలిస్తే.. అల్ట్రా హై నెట్‌ వర్త్‌ వ్యక్తులకు (యూహెచ్‌ఎన్‌డబ్ల్యూఐ/అధిక ధనవంతులు) అత్యంత ఇష్టమైన పెట్టుబడి సాధనం ఈక్విటీలే అని తెలుస్తోంది. 34% పెట్టుబడులను ఈక్విటీలకే కేటాయిస్తున్నారు.

ఆ తర్వాత వాణిజ్య రియల్‌ ఎస్టేట్‌లో 25 శాతం, బాండ్లలో 16 శాతం, ప్రైవేటు ఈక్విటీ/వెంచర్‌ క్యాపిటల్‌ రూపంలో 10 శాతం, బంగారంలో 6 శాతం, ఇతర ఇష్టమైన వస్తువులపై (కళాకృతులు, కారు) 4% చొప్పున పెట్టుబడులు పెడుతున్నట్టు తెలిసింది. నైట్‌ ఫ్రాంక్‌ సంస్థ అంతర్జాతీయంగా సర్వే నిర్వహించి ‘ద వెల్త్‌ రిపోర్ట్‌ అవుట్‌లుక్‌ 2023’పేరుతో విడుదల చేసింది.

సర్వే ఫలితాలు..  
► దీర్ఘకాలంలో ఎంతో అనిశ్చితులు నెలకొన్నప్పటికీ 88 శాతం మంది భారతీయ అధిక ధనవంతుల సంపద 2022లో వృద్ధి చెందింది. 
► గతేడాది 10 శాతానికి పైగా తమ సంపద పెరిగినట్టు 35 శాతం మంది చెప్పారు.  
► ఈ ఏడాది కూడా తమ సంపద కనీసం 10 శాతం వృద్ధి చెందుతుందని 53 శాతం మంది అధిక ధనవంతులు అభిప్రాయపడుతున్నారు  
►  47 శాతం మంది 10 శాతానికి పైనే పెరగొచ్చన్న అంచనాతో ఉన్నారు.  

►  అంతర్జాతీయంగా.. సంపన్నుల కంటే ధనవంతులే ఈక్విటీల్లో ఎక్కువగా ఇన్వెస్ట్‌ చేస్తున్నారు.  
► మన దేశంలో అధిక ధనవంతులు కనీసం ఒక్కొక్కరు 5 నివాస ఆస్తులను కలిగి ఉన్నారు. అంతర్జాతీయంగా ఇది 4.2గానే ఉంది.  
►  2022లో 14 శాతం మంది అధిక ధనవంతులు ఇంటిని కొనుగోలు చేయగా, 2023లో 10 శాతం మంది ఇంటిని కొనుగోలు చేస్తారని అంచనా.  
► యూకే, యూఏఈ, యూఎస్‌ఏ ఇళ్ల కొనుగోలుకు ప్రాధాన్య ప్రాంతాలుగా ఉన్నాయి. 

చదవండి: సేల్స్‌ రచ్చ మామూలుగా లేదు, ఎలక్ట్రిక్‌ కార్ల అమ్మకాల్లో నంబర్‌ వన్‌!

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top