
పరిశ్రమలు, సేవల్లో సానుకూలత
రెట్టింపైన విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు
ఆర్బీఐ తాజా బులెటిన్ విడుదల
ముంబై: అంతర్జాతీయంగా అనిశ్చిత పరిస్థితుల మధ్య భారత ఆర్థిక కార్యకలాపాలు పటిష్టంగా ఉన్నట్టు ఆర్బీఐ బులెటిన్ తెలిపింది. పరిశ్రమలు, సేవల రంగాల్లో కార్యకలాపాలు ఇదే సూచిస్తున్నట్టు పేర్కొంది. వాణిజ్య విధాన పరమైన అనిశ్చితులకుతోడు పెరిగిపోయిన భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతలను ప్రస్తావించింది. ‘‘ఈ విధంగా అంతర్జాతీయ అనిశ్చితులు పెరిగిపోయిన తరుణంలోనూ 2025 మే నెలకు సంబంధించి అధిక ప్రాముఖ్యం కలిగిన సంకేతాలు.. పరిశ్రమలు, సేవల రంగాల్లో ఆర్థిక కార్యకలాపాలు పటిష్టంగా ఉన్నట్టు సూచిస్తున్నాయి’’అని తన బులెటిన్లో పేర్కొంది.
వ్యవసాయ రంగంలో 2024–25లో అన్ని ప్రధాన పంటల్లోనూ ఉత్పాదకత పెరిగినట్టు తెలిపింది. అదే సమయమంలో దేశీయంగా ధరలు సానుకూల స్థితిలోనే ఉన్నట్టు పేర్కొంది. రిటైల్ ద్రవ్యోల్బణం ఆర్బీఐ లక్ష్యం పరిధిలోనే వరుసగా నాలుగో నెలలోనూ నమోదైనట్టు తెలిపింది. వడ్డీ రేట్ల తగ్గింపును రుణ గ్రహీతలకు సమర్థవంతంగా బదిలీ చేసేందుకు వీలుగా సానుకూల ఆర్థిక పరిస్థితులు నెలకొన్నట్టు వివరించింది.
విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు ఏప్రిల్ నెలలో 8.8 బిలియన్ డాలర్లుగా ఉన్నాయంటూ.. మార్చి నెలలో ఉన్న 5.9 బిలియన్ డాలర్లు, 2024 ఏప్రిల్ నెలలో ఎఫ్డీఐ 7.2 బిలియన్ డాలర్ల కంటే అధికమని పేర్కొంది. ఇదే సమయంలో మన దేశం నుంచి బయటకు వెళ్లిన ఎఫ్డీఐలు కూడా పెరిగినట్టు తెలిపింది. నికర ఎఫ్డీఐలు ఏప్రిల్ నెలలో అంతక్రితం ఏడాది ఇదే నెలతో పోల్చి చూస్తే రెట్టింపై 3.9 బిలియన్ డాలర్లుగా ఉన్నట్టు తెలిపింది. ఈ బులెటిన్లో అభిప్రాయాలు రచయితల వ్యక్తిగతమే కానీ, ఆర్బీఐ అధికారిక అభిప్రాయాలు కాదని పేర్కొంది.