
న్యూఢిల్లీ: బ్యాటరీలు, విద్యుదీకరణ రంగాలలో సహకార పరిశోధనా వ్యవస్థను నెలకొల్పేందుకు మూడు ఐఐటీలతో ఒప్పందం కుదుర్చుకున్నట్లు హ్యుండై మోటార్ గ్రూప్ తెలిపింది. ఇందుకోసం ఐదేళ్లలో 7 మిలియన్ డాలర్ల పెట్టుబడి చేయనున్నట్టు వెల్లడించింది. ఐఐటీ ఢిల్లీ, ఐఐటీ బాంబే, ఐఐటీ మద్రాస్ వీటిలో ఉన్నాయి.
సహకారంలో భాగంగా హ్యుండై సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ను ఐఐటీ ఢిల్లీలో ఏర్పాటు చేస్తామని, హ్యుండై మోటార్ గ్రూప్ నుండి స్పాన్సర్షిప్ల ద్వారా నిర్వహిస్తామని సంస్థ ఒక ప్రకటనలో తెలిపింది. బ్యాటరీలు, విద్యుదీకరణలో పురోగతిని నడిపించడం హ్యుండై సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ ప్రాథమిక లక్ష్యం. ప్రధానంగా భారతీయ మార్కెట్ యొక్క విభిన్న అవసరాలను తీర్చడానికి ప్రత్యేకంగా ఏర్పాటు చేస్తున్నారు.
ఈ సెంటర్ భారత విద్యా వ్యవస్థ నుండి ప్రతిభావంతులైన వ్యక్తులతో బలమైన నెట్వర్క్ను పెంపొందించగలదని నమ్ముతున్నామని, ఆవిష్కరణలు, భవిష్యత్తు వృద్ధిని ప్రోత్సహిస్తుందని హ్యుండై మోటార్ గ్రూప్ రిసర్చ్, డెవలప్మెంట్, ప్లానింగ్, కోఆర్డినేషన్ సెంటర్ హెడ్ నక్సప్ సంగ్ వివరించారు. హ్యుండై సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ అకడమిక్–పారిశ్రామిక సహకార ప్రాజెక్టులపై సంయుక్త పరిశోధనలను నిర్వహించడమే కాకుండా.. కొరియా, భారత్కు చెందిన బ్యాటరీ, విద్యుద్దీకరణ నిపుణుల మధ్య సాంకేతిక, మానవ వనరుల మార్పిడిని సులభతరం చేస్తుందని సంస్థ తెలిపింది.