సిటీలో విక్రయమైన ఇళ్ల విలువ రూ.30,324 కోట్లు
ప్రస్తుత ఆర్థిక సంవత్సరం ప్రథమార్థం గణాంకాలివీ..
2026 హెచ్1లో 22,345 యూనిట్లు అమ్మకం
అనరాక్ రీసెర్చ్ రిపోర్ట్లో వెల్లడి
ప్రపంచవ్యాప్తంగా భౌగోళిక అస్థిరత, అధిక ధరలు వంటి ప్రతికూల మార్కెట్లో ఇండియాలో గృహ విక్రయాలు స్థిరంగా ఉన్నాయి. ఇప్పుడిప్పుడే మార్కెట్లు కుదుటపడుతుండటంతో ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో దేశంలో ఇళ్ల అమ్మకాలు రెండంకెల వృద్ధి రేటును నమోదు చేస్తుందని అనరాక్ రీసెర్చ్ అంచనా వేసింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం(ఏప్రిల్–25 నుంచి మార్చి–26)లో దేశంలోని ఏడు ప్రధాన నగరాలలో రూ.6.65 లక్షల కోట్ల విలువ చేసే ఇళ్లు అమ్ముడువుతాయని, గత ఆర్థిక సంవత్సరంతో పోలిస్తే విక్రయాలు 19 శాతం పెరగొచ్చని అనరాక్ రీసెర్చ్ అంచనా వేసింది.
హైదరాబాద్లో ప్రస్తుత ఆర్థిక సంవత్సరం ప్రథమార్థంలో రూ.30,646 కోట్ల విలువ చేసే 22,345 యూనిట్లు అమ్ముడుపోయాయి. గత ఆర్థిక సంవత్సరంలో రూ.59,243 కోట్ల విలువ చేసే 48,980 యూనిట్లను విక్రయించారు. గత ఆర్థిక సంవత్సరంతో పోలిస్తే ఈ ఆర్థిక సంవత్సరం ప్రథమార్థంలో విక్రయమైన ఇళ్ల విలువలో అత్యధికంగా 74 శాతంతో ఎన్సీఆర్–ఢిల్లీ, 71 శాతంతో చెన్నైలు అగ్రస్థానంలో నిలిచాయి. 45 శాతంతో ముంబై అత్యల్ప స్థానంలో నిలిచింది. లగ్జరీ, అల్ట్రా లగ్జరీ గృహాలకు డిమాండ్ కొనసాగుతూనే ఉంది. దీంతో డెవలపర్లు కూడా కొనుగోలుదారుల అభిరుచుల మేరకు విలాసవంతమైన భవన నిర్మాణాలనే ప్రారంభిస్తున్నారు. ఈ ఆర్థిక సంవత్సరం ప్రథమార్థంలో లాంచింగ్ అయిన ప్రాజెక్ట్లలో 42 శాతం లగ్జరీ గృహాలే కావడమే ఇందుకు ఉదాహరణ.
ఇప్పటికే 53 శాతం..
గత ఆర్థిక సంవత్సరంలో రూ.5.59 లక్షల కోట్లు విలువ చేసే 4,22,765 ఇళ్లు విక్రయమయ్యాయి. అయితే అంతకు క్రితం ఆర్థిక సంవత్సరంతో పోలిస్తే ఇళ్ల విక్రయాలు 14 శాతం మేర క్షీణించగా.. వాటి విలువ మాత్రం 6 శాతం మేర పెరిగింది. మెట్రో నగరాలలో విక్రయాలు స్థిరంగానే ఉంటాయని, 4 శాతానికి మించి వృద్ధి రేటును నమోదు కాదని అంచనా వేసింది. గత ఆర్థిక సంవత్సరంలోని విక్రయమైన ఇళ్ల విలువలో ఈ ఆర్థిక సంవత్సరం ప్రథమార్థంలోనే ఇప్పటికే 53 శాతం సాధించింది. ప్రస్తుత ఫైనాన్షియల్ ఇయర్ హెచ్1లో 2.98 లక్షల కోట్ల విలువ చేసే 1.93 లక్షల యూనిట్లు అమ్ముడుపోయాయి.


