కరోనాతో ఇంటి అవసరం పెరిగింది. అప్పటి వరకు చిన్న ఇల్లు అయినా పర్లేదు అనుకునే కొనుగోలుదారులు ఆ తర్వాత నుంచి విశాలమైన ఇళ్లకే ప్రాధాన్యత ఇస్తున్నారు. దీంతో క్రమంగా అపార్ట్మెంట్ల విస్తీర్ణాలు పెరుగుతున్నాయి. 2019 నుంచి 2025 మధ్య కాలంలో యూనిట్ల సగటు సైజులు 45 శాతం మేర పెరిగాయి. ప్రస్తుతం దేశంలోని ఇతర మెట్రో నగరాలతో పోలిస్తే హైదరాబాద్లోనే యూనిట్ల సైజులు అత్యధికంగా ఉన్నాయని అనరాక్ రీసెర్చ్ రిపోర్ట్ వెల్లడించింది.
నగరంలో ఇళ్ల పరిమాణం రెండేళ్ల కాలంలో 13 శాతం మేర పెరిగాయి. 2023లో ఇక్కడ యూనిట్ల సగటు విస్తీర్ణం 2,299 చ.అ.లుగా
ఉండగా.. 2025 నాటికి 2,600 చ.అ.లకు పెరిగింది. ఆసక్తికరంగా దేశంలోని ఇతర నగరాలతో పోలిస్తే భాగ్యనగరంలో 2024లో కంటే గతేడాది అపార్ట్మెంట్ల పరిమాణం అత్యధికంగా 24 శాతం మేర పెరిగాయి. ఆ ఏడాది నగరంలో సగటు విస్తీర్ణాలు 2,103గా ఉన్నాయి. 2025లో మన తర్వాత ఎన్సీఆర్(ఢిల్లీ)లో ఫ్లాట్ల సైజు 2025లో 2,466 చ.అ.గా ఉంది. ఇక్కడ 2023లో 1,890 చ.అ.లుగా ఉన్నాయి. 2023లో ముంబైలో 810 చ.అ.లుగా ఉన్న యూనిట్ల సైజు.. గత ఏడాది నాటికి 904 చ.అ.లకు పెరిగాయి.
స్టడీ రూమ్లు కూడా..
గతంలో పిల్లల కోసం ప్రత్యేకంగా స్టడీ రూమ్ అనేది ఉన్నత స్థాయి గృహాలలోనే కనిపించేవి. కానీ, ఇప్పుడు ఈ గదులు కూడా మెయిన్ స్ట్రీమ్లోకి వచ్చేశాయి. స్టడీ రూమ్లు, వెయిటింగ్ హాల్ వంటివన్నీ ప్రధాన ఇంటి విస్తీర్ణంలోనే మిళితమైపోయాయి. దీంతో ఇళ్ల విస్తీర్ణాలే కాదు ధరలు కూడా పెరుగుతున్నాయి. దేశంలోని ఏడు ప్రధాన నగరాల్లో అపార్ట్మెంట్ల సగటు సైజులు 2023లో 1,420 చ.అ.లుగా ఉండగా.. 2025 నాటికి 1,676 చ.అ.లకు పెరిగాయి. 2024లో 1,540 చ.అ.లతో పోలిస్తే జస్ట్ ఒక సంవత్సర కాలంలోనే యూనిట్ల విస్తీర్ణాలు
ఏకంగా 8 శాతం వృద్ధి చెందాయి.


