అంతర్జాతీయ వాణిజ్యంలో అమెరికా డాలర్ ఆధిపత్యం, బ్రిక్స్ కూటమి సొంత కరెన్సీపై జరుగుతున్న సుదీర్ఘ చర్చకు బ్రెజిల్ అధ్యక్షుడు లూయిజ్ ఇనాసియో లూలా డా సిల్వా తెరదించారు. సరైన అవగాహన లేకపోవడంతోనే డీ-డాలరైజేషన్పై ప్రచారం జరుగుతున్నట్లు ఆయన స్పష్టం చేశారు. ఓ మీడియా సంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన ప్రపంచ ఆర్థిక వ్యవస్థ, భారత్-బ్రెజిల్ ద్వైపాక్షిక సంబంధాలపై వ్యాఖ్యలు చేశారు.
బ్రిక్స్ కరెన్సీపై స్పష్టత
బ్రిక్స్ దేశాలు డాలర్కు ప్రత్యామ్నాయంగా ఉమ్మడి కరెన్సీని రూపొందిస్తున్నాయనే వార్తలను లూలా డా సిల్వా పూర్తిగా కొట్టిపారేశారు. కొత్త కరెన్సీని సృష్టించాలనే ప్రతిపాదన గానీ, ఆ దిశగా చర్చలు గానీ బ్రిక్స్లో జరగడం లేదని స్పష్టం చేశారు. ప్రపంచ ఆర్థిక వ్యవస్థ రాత్రికి రాత్రే మారదన్నారు. డాలర్ ప్రపంచంలోనే అత్యంత బలమైన కరెన్సీ అని అంగీకరించారు. ఇతర కరెన్సీల ఎదుగుదలను అమెరికా సహజంగానే ప్రతిఘటిస్తుందని చెప్పారు. ఆ వాస్తవాన్ని తాము పరిగణనలోకి తీసుకుంటామని పేర్కొన్నారు.
స్థానిక కరెన్సీల్లో వాణిజ్యం.. డాలర్ వ్యతిరేకత కాదు
డాలర్ వినియోగాన్ని తగ్గించడం అంటే అది అమెరికాపై కక్ష కట్టడం కాదని, దేశాలకు మరిన్ని వ్యాపార ఎంపికలు చూపడమేనని లూలా వివరించారు. భారత్, బ్రెజిల్ మధ్య వాణిజ్యం కేవలం డాలర్లపైనే ఆధారపడాల్సిన అవసరం లేదన్నారు. స్థానిక కరెన్సీల (రూపాయి-రియల్) వాడకాన్ని ప్రోత్సహించాలని ఆయన పిలుపునిచ్చారు. ఇది కొంత క్లిష్టమైన ప్రక్రియ అయినప్పటికీ ప్రయత్నించడం అవసరమని అభిప్రాయపడ్డారు.
ఇదీ చదవండి: ఏఐ గ్లోబల్ గవర్నెన్స్కు అమెరికా పూర్తి వ్యతిరేకం


