ఇంధన ధరలు రోజు రోజుకు పెరుగుతున్న సమయంలో.. చాలామంది కార్ల కొనుగోలుదారులు ఎక్కువ మైలేజ్ ఇచ్చే కార్లనే కొనుగోలు చేస్తుంటారు. అయితే క్రమంగా కొన్ని రోజులకు మైలేజ్ కొంత తగ్గే అవకాశం ఉంటుంది. ఇలా కాకుండా.. మైలేజ్ పెరగాలంటే వాహనదారులు ఏం చేయాలో ఇక్కడ తెలుసుకుందాం.
సరైన డ్రైవింగ్
కారు మైలేజ్పై ఎక్కువ ప్రభావం చూపేది డ్రైవింగ్ విధానమే. ఆకాశమత్తుగా వేగం పెంచడం, సడన్ బ్రేక్స్ వేయడం వల్ల ఇంధనం ఎక్కువగా ఖర్చవుతుంది. కాబట్టి స్మూత్గా.. ఒక నిర్దిష్టమైన వేగంతో డ్రైవ్ చేయాలి. సాధారణంగా గంటకు 60 కిమీ నుంచి 80 కిమీ వేగం ఉత్తమ మైలేజ్కు అనుకూలంగా ఉంటుంది. అంతే కాకుండా.. అవసరం లేనప్పుడు క్లచ్ నొక్కి ఉంచకుండా, సరైన గేర్ను ఉపయోగించాలి.
వాహనాన్ని సక్రమంగా నిర్వహించడం
వాహనాన్ని ఉపయోగించడం మాత్రమే కాకుండా.. మెయింటెనెన్స్ కూడా సరిగ్గా చేస్తుండాలి. ఇది నిర్లక్ష్యం చేస్తే మైలేజ్ తప్పకుండా తగ్గుతుంది. టైర్ ప్రెషర్ సరిగా లేకపోతే ఇంజిన్పై ఎక్కువ భారం పడుతుంది. కాబట్టి కంపెనీ సూచించిన టైర్ ప్రెజర్ మెయింటెనెన్స్ చేయాలి. ఇంజిన్ ఆయిల్, ఎయిర్ ఫిల్టర్, ఫ్యూయల్ ఫిల్టర్ వంటి వాటిని సమయానికి మారుస్తుండాలి.
అనవసర బరువు వేయొద్దు
కారులో లోపల లేదా కారు డిక్కీలో అవసరం లేని లగేజ్ ఉంచకూడదు. బరువు పెరిగితే.. ఇంజిన్ పనితీరు ఎక్కువ ఉండాల్సి ఉంటుంది. దీనివల్ల ఇంధనం ఎక్కువ ఖర్చవుతుంది. కాబట్టి అవసరం లేని వస్తువులను తొలగించడం ద్వారా మైలేజ్ కొంత పెంచుకోవచ్చు.
ఏసీ, ఎలక్ట్రిక్ పరికరాల వినియోయాగం
కారులో అవసరం లేనప్పుడు ఏసీ ఆపేయాలి. ఏసీ వినియోగం కూడా ఇంధన వినియోగానికి కారణం అవుతుంది. ప్రత్యేకంగా నగరంలో తక్కువ వేగంతో డ్రైవ్ చేస్తున్నప్పుడు AC వాడకం మైలేజ్ను తగ్గిస్తుంది. అంతే కాకుండా లైట్స్, ఇతర ఎలక్ట్రికల్ పరికరాలను ఆఫ్ చేసి ఉంచాలి.
రూట్ ప్లానింగ్
మీరు వెళ్లే మార్గంలో ట్రాఫిక్ ఎలా ఉందో తెలుసుకోవడం ఉత్తమం. ఎందుకంటే.. భారీ ట్రాఫిక్ ఉన్న మార్గాల్లో ఎక్కువ సేపు ఇంజిన్ ఆన్లో ఉండటం వల్ల ఇంధనం వృథా అవుతుంది. కాబట్టి ముందుగానే రూట్ మ్యాప్ ప్రిపేర్ చేసుకోవడం మంచిది. ఒకవేళ ట్రాఫిక్ ఎక్కువగా ఉన్నప్పుడు, కారు ఇంజిన్ ఆప్ చేసుకోవడం ఉత్తమం.


