అమెరికాకు చెందిన ప్రీమియం బైక్ తయారీ సంస్థ హార్లే డేవిడ్సన్, భారతీయ ద్విచక్ర వాహన దిగ్గజం హీరో మోటోకార్ప్ తమ భాగస్వామ్యాన్ని మరింత బలోపేతం చేయనున్నాయి. ఇరు సంస్థలు కలిసి ఎంట్రీ లెవల్ పెర్ఫార్మెన్స్ మోటార్సైకిళ్లు, క్రూయిజర్ మోడళ్లను సంయుక్తంగా అభివృద్ధి చేయనున్నాయి. వీటిని భారతదేశంలోనే తయారు చేస్తారు. ఇక్కడి నుండి అంతర్జాతీయంగా, ముఖ్యంగా అభివృద్ధి చెందుతున్న మార్కెట్లకు ఎగుమతి చేయాలని ప్రణాళికలు సిద్ధం చేస్తున్నాయి.
హార్లే ‘బ్యాక్ టు బ్రిక్స్’ వ్యూహం
2019 నుంచి 2025 మధ్య కాలంలో హార్లే డేవిడ్సన్ అంతర్జాతీయ రిటైల్ విక్రయాలు 40 శాతం తగ్గాయి. దీంతో కంపెనీ మార్జిన్లు 18% దెబ్బతిన్నాయి. డీలర్ల లాభాలు ఏకంగా 80% మేర క్షీణించాయి. ఈ సంక్షోభాన్ని అధిగమించేందుకు ‘బ్యాక్ టు బ్రిక్స్’ పేరుతో కొత్త వ్యూహాన్ని అమలు చేస్తోంది. ఇందులో భాగంగా ప్రస్తుత ప్లాట్ఫారమ్ల ఆధారంగా రాబోయే మూడేళ్లలో 20 కొత్త మోడళ్లు, వేరియంట్లను మార్కెట్లోకి తీసుకురావాలని కంపెనీ లక్ష్యంగా పెట్టుకుంది. తద్వారా ప్రీమియం విభాగంలో మరింత విస్తృతంగా వినియోగదారులను చేరుకోవాలని కంపెనీ భావిస్తోంది.
వ్యూహాత్మకంగా భారత్లోకి రీఎంట్రీ
హార్లే డేవిడ్సన్ 2011లో హర్యానాలోని బావల్లో ప్లాంట్ ఏర్పాటు చేసింది. నష్టాల కారణంగా 2019లో భారత్లో తయారీ కార్యకలాపాలను నిలిపివేసింది. తర్వాత 2020లో హీరో మోటోకార్ప్తో లైసెన్సింగ్, పంపిణీ ఒప్పందం కుదుర్చుకుంది. డీల్లో భాగంగా మోటార్సైకిళ్ల విక్రయం, సరీ్వసింగ్తో పాటు సంయుక్తంగా కొత్త మోడళ్ల రూపకల్పన, తయారీ చేపట్టాలని నిర్ణయించారు. ఈ భాగస్వామ్యంలో తొలి ఉత్పత్తిగా వచి్చన హెచ్డీ ఎక్స్440 ఎక్స్షోరూమ్ ధర రూ.2.35 లక్షల నుంచి ప్రారంభమవుతోంది. ఇదే ప్లాట్ఫారమ్పై హీరో మావ్రిక్ పేరుతో మరో మోడల్ను విక్రయిస్తోంది. ఇప్పుడు ఈ భాగస్వామ్యం అంతర్జాతీయ ఎగుమతుల దిశగా కీలక అడుగులు వేస్తోంది.
వ్యాపారణ విస్తరణ వ్యూహంపై హార్లే డేవిడ్సన్ స్పందిస్తూ.. జాతీయ, అంతర్జాతీయ మార్కెట్లలో తమ బ్రాండ్ విస్తరణకు హీరో మోటోకార్ప్ కీలక భాగస్వామి అని పేర్కొంది. అయితే కొత్త ఉత్పత్తులపై పూర్తి వివరాలను వెల్లడించలేదు. మరోవైపు హీరో మోటోకార్ప్ సీఈఓ హర్షవర్ధన్ చితాలే మాట్లాడుతూ, ఈ ఏడాది మరిన్ని హార్లే బ్రాండెడ్ మోటార్సైకిళ్లు విడుదలవుతాయని ధృవీకరించారు.
గ్లోబల్ మార్కెట్లలో అనుకూలత ఉంటే భారత్లో తయారైన మోడళ్లను ఇతర దేశాల్లో విక్రయించే నిర్ణయం పూర్తిగా హార్లే–డేవిడ్సన్దేనని స్పష్టం చేశారు. గత ఆర్థిక సంవత్సరంలో ఎక్స్440, హీరో మావ్రిక్ మోడళ్లు కలిపి దేశంలో 14,375 యూనిట్లు అమ్ముడయ్యాయి. 350సీసీ - 500సీసీ విభాగంలో సుమారు 11 శాతం మార్కెట్ వాటాతో, హీరో మోటోకార్ప్ ప్రస్తుతం బజాజ్ ఆటో, రాయల్ ఎన్ఫీల్డ్ తర్వాత మూడో అతిపెద్ద సంస్థగా నిలిచింది. పరిశ్రమ వర్గాల అంచనా ప్రకారం, ఈ ప్రీమియం మోటార్సైకిల్ విభాగంలో ఆపరేటింగ్ మార్జిన్లు సాఫ్ట్వేర్ ఎగుమతుల కంటే అధికంగా ఉండటం గమనార్హం.
ఏడాది చివర్లో ‘హార్లే–డేవిడ్సన్ స్ప్రింట్’
ప్రస్తుతం మార్కెట్లో ఉన్న హార్లే–డేవిడ్సన్ ఎక్స్440, హీరో మావ్రిక్ మోడళ్లకు మంచి ఆదరణ లభించడంతో ప్రస్తు ఆర్థిక సంవత్సరంలో మరిన్ని కొత్త మోడళ్లను విడుదల చేయాలని ఇరు సంస్థలు నిర్ణయించాయి. వీటిలో తొలి మోడల్గా ‘హార్లే–డేవిడ్సన్ స్ప్రింట్’ ఈ ఏడాది చివర్లో మార్కెట్లోకి వచ్చే అవకాశముంది. అనంతరం దశలవారీగా మరిన్ని మోడళ్లను ప్రవేశపెట్టనున్నారు. వీటిలో కొన్ని మోడళ్లను భారత్ నుంచి తొలిసారిగా అభివృద్ధి చెందుతున్న అంతర్జాతీయ మార్కెట్లకు ఎగుమతి చేయనున్నట్లు పరిశ్రమ వర్గాల సమాచారం.


