జీఎస్టీ నిబంధనల్లో మార్పులు.. ఆగస్టు 1 నుంచి కొత్త రూల్!

govt brings down threshold for e invoicing to rs 5 cr businesses from august 1 - Sakshi

జీఎస్టీ నిబంధనల్లో కేంద్ర ప్రభుత్వం మార్పులు చేసింది. వార్తా సంస్థ పీటీఐ కథనం ప్రకారం.. రూ. 5 కోట్ల కంటే ఎక్కువ టర్నోవర్ ఉన్న వ్యాపార సంస్థలు ఆగస్టు 1 నుంచి బిజినెస్-టు-బిజినెస్ (B2B) లావాదేవీల కోసం ఎలక్ట్రానిక్ లేదా ఈ -ఇన్‌వాయిస్‌ని రూపొందించడం తప్పనిసరి. ప్రస్తుతం రూ.10 కోట్ల కంటే ఎక్కువ టర్నోవర్ ఉన్న వ్యాపార సంస్థలకు ఈ -ఇన్‌వాయిస్‌ నిబంధన అమలులో ఉంది.

ఇదీ చదవండి: సిటీ గ్రూపు నుంచి డిజిటల్ క్రెడిట్ కార్డ్‌.. లాభాలేంటో తెలుసా? 

కేంద్ర ఆర్థిక శాఖ మే 10 నాటి నోటిఫికేషన్ ద్వారా ఈ -ఇన్‌వాయిస్ నమోదు పరిమితిని తగ్గించింది. రూ. 5 కోట్ల కంటే ఎక్కువ టర్నోవర్ ఉన్న వ్యాపార సంస్థలు  B2B లావాదేవీలకు సంబంధించి ఈ -ఇన్‌వాయిస్‌లను సమర్పించాలి. ఈ నిబంధన ఆగస్ట్ 1 నుంచి అమలులోకి వస్తుంది.

ఇదీ చదవండి: Paytm New Features: పేటీఎంలో సరికొత్త ఫీచర్లు.. యూపీఐ బిల్లును పంచుకోవచ్చు! 

జీఎస్టీ చట్టం ప్రకారం..  2020 అక్టోబర్ 1 నుంచి రూ. 500 కోట్ల కంటే ఎక్కువ టర్నోవర్ ఉన్న కంపెనీలు B2B లావాదేవీల సంబంధించి  ఈ -ఇన్‌వాయిసింగ్ సమర్పించడం తప్పనిసరిగా ఉండేది. ఆ తర్వాత  2021 జనవరి 1 నుంచి  రూ.100 కోట్లకు మించిన టర్నోవర్ ఉన్న సంస్థలకూ ఇది అమలలోకి వచ్చింది. 2021 ఏప్రిల్ 1 నుంచి రూ. 50 కోట్ల కంటే ఎక్కువ టర్నోవర్ ఉన్న కంపెనీలు B2B ఈ -ఇన్‌వాయిస్‌లను సమర్పిస్తున్నాయి.  2022 ఏప్రిల్ 1 నుంచి ఈ నిబంధన రూ. 20 కోట్ల టర్నోవర్ కు, 2022 అక్టోబర్ 1 నుంచి రూ. 10 కోట్ల టర్నోవర్ కు తగ్గింది.

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top